వరంగల్ : ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) నేతృత్వంలో తెలంగాణలోని ఆలయాల అభివృద్ధి జరుగుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు(Minister Errabelli) అన్నారు. వరంగల్ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండి శివారు వానకొండయ్య గుట్టపై వెలసిన గిరిజనుల ఆరాధ్య దైవం లక్ష్మీనరసింహస్వా మి జాతర ఉత్సవాలు(Jatara celabrations) మంగళవారం నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి.
ఏటావేసవిలో హోలీ పండుగ నాడు ప్రారంభమై ఉగాది పర్వదినాన జాతర ఉత్సవాలు ముగుస్తాయని నిర్వాహకులు తెలిపారు. స్వామి వారి కల్యాణ ఉత్సవాల సందర్భంగా కడవెండిలో స్వామి వారికి సమర్పించే పట్టు వస్త్రాల కోసం మంత్రి మగ్గం నేశారు. కళాకారులతో కలిసి కోలాటం ఆడుతూ,చిడతలు వాయిస్తూ డప్పు కొడుతూ ఉత్సాహం నింపారు.
15 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు దేవరుప్పుల, పాలకుర్తి, కొడకండ్లతో పాటు గుండాల, మోత్కూర్, లింగాలఘణపురం, రఘనాథపల్లి, స్టేషన్ఘన్పూర్, తిరుమలగిరి తదితర మండలాల నుంచి భక్తులు తరలివస్తారని చెప్పారు. భక్తుల సౌలభ్యం కోసం ఘాట్ రోడ్డు నిర్మించామని, పాలకుర్తి నియోజకవర్గాన్ని నభూతో నభవిష్యత్ అనేలా అభివృద్ధి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ శివలింగయ్య , అధికారులు పాల్గొన్నారు.