భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): ‘ధరణి’ని బంగాళాఖాతంలో కలుపుతామంటూ కాంగ్రెసోళ్లు కారు కూతలు కూస్తున్నారని సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విమర్శించారు. ప్రజలు బీఆర్ఎస్ను గెలిపించి వారినే బంగాళాఖాతంలో కలపాలని పిలుపునిచ్చారు. ధరణి వల్లనే భూములపై రైతులకు సర్వ హక్కులూ వచ్చాయని గుర్తుచేశారు. పినపాక, భద్రాచలం నియోజకవర్గాల్లో ప్రతి కుటుంబానికీ దళితబంధు పథకాన్ని వర్తింపజేస్తామని పేర్కొన్నారు. తమ నియోజకవర్గానికి ఈ పథకం కావాలంటూ ప్రభుత్వ విప్, పినపాక అభ్యర్థి అయిన రేగా కాంతారావు కోరారని, ఆయన కోరిన విధంగానే ఈ రెండు నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో ఈ పథకాన్ని అమలు చేస్తామని అన్నారు. ఇదేగాక భద్రాచలానికి వరద ముంపు రాకుండా రూ.1,000 కోట్లతో నిధులతో నిర్మించే కరకట్టకు తానే శంకుస్థాపన చేస్తానని చెప్పారు. ఈ నియోజకవర్గాల్లో రెండు రోజులు ఉండి ఇక్కడి ప్రజల సమస్యలను పరిష్కరిస్తానని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు వస్తూపోతూ ఉంటాయి కాబట్టి ఆయా పార్టీల విధాలను, వాటి అభ్యర్థుల గుణగణాలను చూసి ఓటు వేయాలని సూచించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం లక్ష్మీపురంలో సోమవారం నిర్వహించిన సీఎం ప్రజా ఆశీర్వాద సభలో ఆయన ప్రసంగించారు. 2014 ముందు రైతులు కరంటు కష్టాలతో చాలా ఇబ్బందులు పడ్డారని, కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలిసేది కాదని అన్నారు. ఆ ఇబ్బందులు పడలేక ఎంతోమంది రైతులు వ్యవసాయాన్ని మానుకున్నారని గుర్తుచేశారు. అలాంటి సమయంలో తెలంగాణ రావడంతో మన రైతులకు నిరంతర విద్యుత్ అందిస్తూ వస్తున్నామని, పంటల సాగుకు ఇబ్బందులు లేకుండా రైతుబంధును అందిస్తున్నామని గుర్తుచేశారు. రైతుబంధు లాంటి పథకం దేశంలో మరెక్కడా లేదని అన్నారు. ఇప్పుడు రూ.పది వేలు ఇస్తున్న రైతుబంధు సాయాన్ని మళ్లీ గెలిచాక రూ.16 వేలకు పెంచుతామని అన్నారు. పినపాక నియోజకవర్గంలోనే సీతారామ ప్రాజెక్టు, సీతమ్మ బరాజ్ నిర్మాణాలు జరుగుతున్నాయని, వచ్చే ఏడాది నాటికి ఉమ్మడి జిల్లాకు పుష్కలంగా సాగునీరు అందుతుందని అన్నారు. గతంలో ఎప్పుడూ మన్యం మంచం పట్టిందనే వార్తలు చూసేవాళ్లమని సీంఎ కేసీఆర్ గుర్తుచేశారు. తెలంగాణ సిద్ధించాక ఆ పరిస్థితి లేదని స్పష్టం చేశారు. పైగా ఆరోగ్య తెలంగాణ వైపు అడుగులు వేస్తున్నామని అన్నారు. ఇక్కడ నుంచే గోదావరి నీటిని మిషన్ భగీరథ ద్వారా ప్రతీ ఇంటికి సరఫరా చేస్తున్నామని అన్నారు.
పోడుభూములకు పట్టాలిచ్చిన చరిత్ర బీఆర్ఎస్దేనని అన్నారు. పినపాక నియోజకవర్గంలో 57 వేల ఎకరాలపై 16 వేల మందికి హక్కులు కల్పించామని, రైతుబంధు అందిస్తున్నామని వివరించారు. ఇంకా ఎవరైనా అర్హులుంటే వారికీ పట్టాలు అందిస్తామని అన్నారు. కారుగుర్తుకు ఓటు వేసి ఈ రెండు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.