హనుమకొండ చౌరస్తా, మే 16 : ముఖ్యమంత్రి కేసీఆర్ క్రీడారంగానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, మేయర్ గుండు సుధారాణి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ క్రీడాసంబురాలు పేరుతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్-2023 పోటీలను మంగళవారం హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించారు. రెండురోజుల ఈ క్రీడా పోటీలను శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, మేయర్ గుండు సుధారాణి జ్యోతి ప్రజ్వలన చేసి ఫుట్బాల్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, అథ్లెటిక్స్ క్రీడలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడాకారులను ప్రో త్సహించడానికి తెలంగాణ ప్రభు త్వం క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వీటిని విధిగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అంతేకాక తెలంగాణకు పేరు తీసుకువస్తున్న క్రీడాకారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతగానో ప్రోత్సహిస్తున్నారన్నారు. కాగా, క్రీడలను ప్రారంభించిన అనంతరం డిప్యూటీ చైర్మన్, మేయర్లు క్రీడాకారులతో కలిసి ఫుట్బాల్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో ఆడి వారిని ఉత్సాహపరిచారు. పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారులను అభినందించారు. అనంతరం క్రీడాకారులకు బండా ప్రకాశ్, సుధారాణి చేతుల మీదుగా స్నాక్స్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో జడ్పీ మాజీ చైర్మన్ సాంబారి సమ్మారావు, డీవైఎస్వో గుగులోత్ అశోక్కుమార్, డిప్యూటీ కమిషనర్ జోనా, హనుమకొండ ఏసీపీ కిరణ్కుమార్, ఆర్వోలు యూసుఫొద్దీన్, శ్రీనివాస్, పీడీలు, పీఈటీలు, కోచ్లు పాల్గొన్నారు.