జనగామ చౌరస్తా, డిసెంబర్ 9 : స్వచ్ఛ జనగామ లక్ష్యంగా పనిచేయాలని అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి ఎం పీడీవోలు, ఎంపీవోలు, ఏపీవోలు, పంచాయతీ కార్యదర్శులతో అదనపు కలెక్టర్ ‘పల్లె ప్రగతి’పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ జిల్లాలో చేపట్టిన పల్లె ప్రకృతి వ నాలు, సెగ్రిగేషన్ షెడ్లు, వైకుంఠధామాలు, మల్టీ లేయర్ అవెన్యూ ప్లాంటేషన్స్, మినీ బృహత్ పల్లె ప్రకృతి వనాల పనులు సకాలంలో పూర్తి చేసి స్వచ్ఛ జనగామ జిల్లాకు కృషి చేయాలని అధికారులకు సూచించారు. తడి-పొడి చెత్తను సేకరించి సెగ్రిగేషన్ షెడ్లకు తరలించి సేంద్రియ ఎరువులు తయారు చేయాలన్నారు. ప్రతి ఇంటికి ఇంకుడుగుంత, మురుగు కాలువకు చివరన సామూహిక ఇంకుడుగుంత నిర్మించాలని పేర్కొన్నారు.
హరితహారం మొక్కలను సంరక్షించాలన్నారు. తెలంగాణ క్రీడా ప్రాంగణాలను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలన్నారు. ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ‘పల్లె ప్రకృతి వనం యాప్’ను పంచాయతీ కార్యదర్శులు విధిగా నిర్వహించాలని, ఎప్పటికప్పుడు అందులో ఫొటోలు అప్లోడ్ చేయాలని ఆదేశించారు. హరితహారం మొక్కల కోసం బ్యాగ్ ఫిల్లింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. గ్రామాల్లో నేమ్ బోర్డ్స్ ఏర్పాటు చేయాలన్నారు. జనన, మరణ వివరాలు రిజిస్టర్లో వెంటవెంటనే నమోదు చేయాలని తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతీ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు విజయవంతంగా అమలు చేయాలన్నారు. గ్రామాల్లో ట్రాక్టర్ బిల్స్, సిటిజెన్ కన్జ్యూమర్ బిల్స్, విద్యుత్ బిల్స్ సక్రమంగా నిర్వహించాలన్నారు. పంచాయతీ ఆధ్వర్యంలో రికార్డులు అప్డేట్గా ఉంచాలని తెలిపారు. విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే సహించేది లేదని అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ అధికారులను హెచ్చరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో డీఆర్డీవో రాంరెడ్డి, డీఎల్పీవో పార్థసారథి, స్వచ్ఛభారత్ మిషన్ కోఆర్డినేటర్ కరుణాకర్, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.