జనవరిలో కేసీఆర్ హామీ.. ఆగస్టులో కార్యరూపం
ఈ ఏడాది జనవరి 12న సీఎం కేసీఆర్ జిల్లాకు వచ్చినప్పుడు ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల జిల్లాకు కేటాయిస్తున్నట్లు హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఫిబ్రవరిలో ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేశ్ ఆధ్వర్యంలో త్రిసభ్య కమిటీ బృందం జిల్లాకు వచ్చి అధ్యయనం చేసింది. హైదరాబాద్ నుంచి జిల్లా వచ్చిన ఈ కమిటీ సభ్యులు కళాశాల నిర్మాణం కోసం జిల్లాకేంద్రంలో మూడు చోట్ల స్థలాలను పరిశీలించారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 11న జిల్లాకు ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
అనంతరం ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ వెబ్సైట్లో మహబూబాబాద్ ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల పేరును చేర్చి విద్యార్థుల నుంచి అడ్మిషన్లను తీసుకుంటున్నది. ఇప్పటికే 60మంది విద్యార్థులు ఆన్లైన్లో ఆప్షన్లు ఎంచుకోగా ఇప్పటికే 30మంది విద్యార్థులు కళాశాలలో రిపోర్ట్ చేశారు. మరో నాలుగైదు రోజుల్లో మొత్తం అడ్మిషన్ల ప్రక్రియ పూర్తికానుంది. అనంతరం ఈ నెల మొదటి వారంలో విద్యార్థులందరికీ వారం రోజులపాటు ఓరియంటేషన్ క్లాసులు నిర్వహించి అనంతరం తరగతులు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. స్థలం ఎంపికపై తుది నిర్ణయం తీసుకున్న తర్వాత నిధులు మంజూరు చేసి నిర్మాణ పనులు మొదలుపెట్టనున్నారు. అప్పటివరకు తాతాలిక భవనంలో తరగతులు నిర్వహించేలా యంత్రాంగం ఏర్పాటు చేసింది. కాగా సీఎం కేసీఆర్ హామీ ఇచ్చి నెలల వ్యవధిలోనే నెరవేర్చడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
రాష్ట్ర ప్రభుత్వం గత నెల 11న మహబూబాబాద్కు జేఎన్టీయూ(ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల)ను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా ఆగస్టు నెల నుంచి ఆన్లైన్లో అడ్మిషన్లను కూడా స్వీకరిస్తున్నది. ఇప్పటికే 60మంది విద్యార్థులు ఈ కళాశాలలో వివిధ కోర్సుల్లో జాయిన్ అయ్యారు. వచ్చే వారం నుంచి తరగతులను ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభించేందుకు సీఎం కేసీఆర్ వచ్చారు. అప్పుడు ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం జేఎన్టీయూ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలను ఏర్పాటు చేసింది. 2023-24 విద్యా సంవత్సరానికి గాను ఇందులో ఐదు బ్రాంచీలను ఏర్పాటు చేసి ఒకో బ్రాంచీకి 60 సీట్ల చొప్పున సీట్లను కేటాయించారు. అయితే ఈ ఏడాది ఇప్పటికే అడ్మిషన్లు తుది దశకు చేరుకోవడంతో విద్యార్థులు కేవలం మూడు కోర్సుల్లో చేరేందుకు ఉత్సాహం చూపారు.
ఇప్పటివరకు 60మంది విద్యార్థులు వివిధ కోర్సుల్లో చేరేందుకు ఆన్లైన్లో స్లాట్బుక్ చేసుకున్నారు. ఇందులో కొంతమంది విద్యార్థులు కళాశాలకు వచ్చి రిపోర్టు చేస్తున్నారు. ఈ ఏడాది కొత్తగా భవనాన్ని నిర్మించేందుకు సమయం లేకపోవడంతో తాతాలిక భవనంలో తరగతుల నిర్వహించాలని ఆదేశాలు వచ్చాయి. దీంతో జిల్లాకేంద్రంలో ఖాళీగా ఉన్న పాత కలెక్టరేట్ భవనాన్ని ఇంజినీరింగ్ కళాశాలకు కేటాయించారు. ఈ ఏడాది అందులో తరగతులు నిర్వహించనున్నారు. వచ్చే ఏడాదిలోగా ప్రభుత్వ స్థలం చూసి అందులో కొత్తగా ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలను నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తున్నది. ఇందులో భాగంగా ఇప్పటికే మూడు నాలుగు చోట్ల ప్రభుత్వ స్థలాలను కూడా పరిశీలించారు. ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలో విద్యను అభ్యసించేందుకు వచ్చే విద్యార్థుల కోసం ప్రభుత్వం హాస్టల్ వసతి కూడా కల్పిస్తున్నది. ఇందులో భాగంగా కురవి రోడ్డులో ఒక భవనాన్ని హాస్టల్ కోసం తాతాలికంగా తీసుకున్నట్లు తెలిసింది. ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలకు అంగోత్ బలరాం నాయక్ను ప్రిన్సిపాల్గా నియమించింది. వచ్చిన విద్యార్థుల నుంచి వివరాలను సేకరించి జాయినింగ్ రిపోర్ట్ తీసుకుంటున్నారు.
వచ్చే వారం నుంచి ప్రారంభిస్తాం..
ఈ ఏడాది నుంచి ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల తరగతులు ప్రారంభించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది మూడు కోర్సులను ప్రవేశపెట్టింది. ఇందులో సీఎస్ఈ(కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్), ఈసీఈ, డేటా సైన్స్ కోర్సులను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే 60 మంది విద్యార్థులు ఆప్షన్స్ ఇచ్చారు. 30మంది విద్యార్థులు వచ్చి కళాశాలలో రిపోర్ట్ చేశారు. మరో నాలుగైదు రోజుల్లో అడ్మిషన్ల ప్రక్రియ మొత్తం పూర్తి కానుంది. ఇది పూర్తయిన వెంటనే వచ్చిన విద్యార్థులకు వారం రోజులపాటు ఓరియంటేషన్ క్లాసులు నిర్వహిస్తాం. అనంతరం బ్రాంచీల వారీగా విద్యార్థులను విభజించి తరగతులు నిర్వహిస్తాం ఇప్పటికే ఇంజినీరింగ్ కళాశాల నిర్వహించేందుకు పాత కలెక్టరేట్ భవనాన్ని తీసుకున్నాం. ఈ ఏడాది ఇందులోనే తరగతులు నిర్వహిస్తాం.
– అంగోత్ బలరాం నాయక్, ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్