సుబేదారి, డిసెంబర్ 19 : భూ ఆక్రమణకు పాల్పడిన ఏడుగురిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసినట్లు హనుమకొండ సీఐ కరుణాకర్ తెలిపారు. గోపాల్పూర్కు చెందిన భూక్యా ఉమాదేవి 2019లో ములుగురోడ్డు -హనుమాన్ జంక్షన్ సమీపంలోని సర్వే నంబర్ 527లో 200 గజాల స్థలాన్ని పిన్నింటి సంపత్రావు నుంచి కొనుగోలు చేశారు. గత నెలలో ఇంటి పనులు ప్రారంభించారు. గత నెల 19న ప్లాట్ వద్దకు ప్రభుత్వ ఉద్యోగులైన బొంకూరి అశోక్, అతడి భార్య విజయకుమారి, మరో నలుగురు వచ్చి పనులను అడ్డుకున్నారు. ఉమాదేవిని, ఆమె భర్తను కులం పేరుతో దూషించి కర్రలతో దాడికి యత్నించారు. మరుసటి రోజు రాత్రి విజయకుమారి, అశోక్ ప్లాట్లో మట్టిపోసి ఆక్రమించడానికి ప్రయత్నించారు.
బాధితురాలు ఉమాదేవి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు నకిలీ పత్రాలతో ప్లాట్ ఆక్రమించుకోవడానికి ప్రయత్నించిన, కులం పేరుతో దూషించి, దాడికి యత్నించిన అశోక్, విజయకుమారి, సహకరించిన మరో నలుగురు వ్యక్తులు, టిప్పర్ యజమానిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు. కాగా, భూ ఆక్రమణకు ప్రయత్నించిన విజయకుమారి, అశోక్ ప్రభుత్వ ఉద్యోగులు అని పోలీసులు తెలిపారు. అశోక్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో, విజయకుమారి విద్యా శాఖలో పని చేస్తున్నట్లు చెప్పారు. వీరిద్దరిపై గతం లో భూ ఆక్రమణల అరోపణలు ఉన్నట్లు తెలిపారు.