వరంగల్, జనవరి 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రూపాయి రూపాయి కూడబెట్టుకున్న సొమ్మును డిపాజిటర్లకు ఇవ్వకుండా కొన్ని చిట్ఫండ్ కంపెనీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. చిట్టీల కాల పరిమితి ముగిసినా డబ్బులివ్వక ఆగం చేస్తున్నాయి. డిపాజిటర్లు ఎన్నిసార్లు మొరపెట్టకున్నా కనికరించక వేధింపులకు గురి చేస్తున్నాయి. కనీసం వారిని ఆఫీసులోకి కూడా రానివ్వకుండా గేట్లు బందు పెట్టి వారి జీవితాలతో ఆడుకుంటున్నాయి. చిట్టీ డబ్బుతో అప్పులు చెల్లించవచ్చనే భరోసా లేక కొందరు అవమానంతో ఆగమవుతుండగా మరికొందరు ఆత్మహత్యలకు ఒడిగడుతుండడం కలిచివేస్తున్నది. డిపాజిటర్ల డబ్బును సొంతానికి వాడుకుంటున్న సంస్థలు లగ్జరీ కార్లు, కార్పొరేట్ స్థాయి భవనాలను నిర్మించుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నాయి. డిపాజిటర్ల డబ్బులతోనే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాయి. చిట్టీ గడువు ముగిసిన తర్వాత డబ్బు అడిగిన వారిని పదేపదే తిప్పించుకొని చివరికి తాము చేసే వెంచర్లలోనే ప్లాటు తీసుకోవాలని బెదిరిస్తున్నాయి. ప్లాట్లు కొనకుంటే ఏమీ రాదని మొండి కేస్తున్నాయి. మధ్యతరగతి, ఉద్యోగుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని చిట్ఫండ్ కంపెనీలు చేస్తున్న ఆగడాలకు అంతు లేకుండాపోతున్నది.
ఫిర్యాదుల వెల్లువ..
వరంగల్ ఉమ్మడి జిల్లాలో 272 చిట్ఫండ్ సంస్థలున్నాయి. కొన్ని మినహా అన్ని సంస్థలూ డిపాజిటర్లకు సకాలంలో డబ్బు ఇవ్వడంలేదు. ఎక్కువ మంది మధ్యతరగతి వారు, ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులు, ఏదో ఓ పెద్ద పని కోసం నెలవారీగా డబ్బు దాచుకునేందుకు చిట్ఫండ్ సంస్థలను ఆశ్రయిస్తుంటారు. నెల వారీగా చెల్లించిన డబ్బు ఒక్కసారి పెద్ద మొత్తంలో వస్తుందనే ఉద్దేశంతో చిట్టీలు వేస్తుంటారు. రిజిస్ట్రేషన్ శాఖ అనుమతితో చిట్టీలు నడుపుతున్నామని చెప్పి పలు సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. మధ్యలో అవసరం ఉండి చిట్టీలు ఎత్తుకున్న వారికిసంస్థలు డబ్బు ఇవ్వడంలేదు. చిట్టీ కాలపరిమితి పూర్తయ్యే వరకు డబ్బు జమ చేసిన వారికి కూడా ఇవ్వడంలేదు. డిపాజిట్దారులు చిట్ ఫండ్ సంస్థల వారిని ఎంత బతిమాలినా స్పందించడంలేదు. కొందరు ఆవేదనతో నిలదీసే ప్రయత్నం చేస్తుంటే మరికొందరు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. చాలా సందర్భాల్లో పోలీసులు సర్దిచెప్పి పంపిస్తున్నారు. దీంతో డిపాజిట్దారులకు న్యాయం దక్కడంలేదు. ఏడాదిగా చిట్ ఫండ్ సంస్థల మోసాలు ఎక్కువయ్యాయి. డిపాజిట్దారులకు డబ్బులు ఇవ్వకుండా దాటవేస్తున్నాయి.
చిట్టీలు పూర్తయినా పైసలు ఇవ్వకుండా నెలలతరబడి తిప్పుతూ డిపాజిట్దారులను మానసికంగా వేధిస్తున్న కొన్ని చిట్ఫండ్ సంస్థలపై వరంగల్ పోలీస్ కమిషరేట్ పరిధిలోని వివిధ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. డిపాజిట్దారులకు రావాల్సిన డబ్బు ఇవ్వకుండా, చిట్ఫండ్ సంస్థలు నిర్వహించే వెంచర్లలో భూములను నిర్బంధంగా కొనుగోలు చేయాలని బెదిరింపులకు గురి చేస్తున్నారని పలువురు ఫిర్యాదులో పేర్కొన్నారు. కొన్ని చిట్ ఫండ్ సంస్థలు ఏకంగా డబ్బు ఇవ్వకుండా, భూములు కూడా చూపకుండా మోసం చేస్తున్నాయని ఫిర్యాదు చేశారు. ఇలా ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలో సీపీ తరుణ్జోషి రెండు నెలల క్రితం చిట్ ఫండ్ సంస్థల యజమానులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని, డిపాజిట్దారులకు గడువులోగా డబ్బు చెల్లించాలని ఆదేశించారు. అయినా కూడా చిట్ ఫండ్ సంస్థల తీరులో మార్పు కనిపించడంలేదు. డిపాజిట్దారుల నుంచి ఫిర్యాదులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు చర్యలకు ఉపక్రమించారు.
పలు చిట్ఫండ్ కంపెనీల చైర్మన్ల అరెస్ట్
ప్రజలను అడ్డగోలుగా ముంచుతున్న చిట్ఫండ్ కంపెనీలపై పోలీసు శాఖ గట్టిగా స్పందించింది. మధ్య తరగతి ప్రజల ఆశలను కూల్చుతున్న చిట్ ఫండ్ సంస్థల మోసాలపై కుప్పలు తెప్పలుగా వచ్చిన ఫిర్యాదులపై చర్యలు చేపట్టింది. తాజాగా అచల చిట్ ఫండ్ చైర్మన్ పంచగిరి సత్యనారాయణ, అక్షర చిట్ ఫండ్ చైర్మన్ పేరాల శ్రీనివాసరావు, మరో చిట్ఫడ్ చైర్మన్ను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. విచారణ అనంతరం వరంగల్ జిల్లా కోర్టులో హాజరుపరిచారు. అచల చిట్ ఫండ్ చైర్మన్ పంచగిరి సత్యనారాయణకు కోర్టు రిమాండ్ విధించింది. అనంతరం పరకాల సబ్ జైలుకు పంపించారు. అక్షర చిట్ ఫండ్ చైర్మన్ పేరాల శ్రీనివాసరావు, మరో సంస్థ చైర్మన్ బెయిలుపై విడుదలయ్యారు. మూడు చిట్ఫండ్ సంస్థల యజమానుల అరెస్ట్తో ఈ రంగం ఒక్కసారిగా కుదుపునకు గురైంది. సంస్థల వారీగా వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన సీపీ తరుణ్జోషి, న్యాయపరంగా చర్యలు తీసుకునేలా ఆదేశించారు. సెంట్రల్ జోన్ డీసీపీ పుష్ప నేతృత్వంలో పోలీస్ బృందాలు బుధవారం తెల్లవారు జామునే చిట్ఫండ్ సంస్థల యజమానులను అదుపులోకి తీసుకున్నాయి. ఫిర్యాదుల్లోని అంశాల ఆధారంగా సుబేదారి, హనుమకొండ, కాజీపేట, మట్టెవాడ పోలీస్స్టేషన్లలో విచారించారు. వివరాలు సేకరించిన అనంతరం కోర్టులో హాజరు పరిచారు. డిపాజిట్దారుల ఫిర్యాదుల ఆధారంగా మరో నాలుగు సంస్థలపైనా త్వరలోనే చర్యలుంటాయని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
అచల చిట్ఫండ్ చైర్మన్పై మరో కేసు
సుబేదారి : హనుమకొండ నక్కలగుట్టలోని అచల చిట్ఫండ్ చైర్మన్ పంచగిరి సత్యనారాయణపై మరో కేసు నమోదు చేసినట్లు సుబేదారి సీఐ ఏ రాఘవేందర్ తెలిపారు. బాలసముద్రానికి చెందిన కటకం శ్రావణ్కుమార్ రూ.50లక్షల చిట్టీ వేశాడు. గత ఆగస్టు 30న రూ.37.25 లక్షలకు చిట్టీ ఎత్తుకున్నాడు. డబ్బులు ఇవ్వాలని అడిగితే చైర్మన్ పంచగిరి సత్యనారాయణ, చైర్మన్ కుమారుడు దుశ్వంత్, ఏజెంట్ మహమ్మద్ఇమామొద్దీన్ బెదిరిస్తున్నాడని బాధితుడు శ్రావణ్కుమార్ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నట్లు సీఐ తెలిపారు.
నర్సంపేటలో ‘శుభనందిని’ బాధితుడి ఆత్మహత్యాయత్నం
నర్సంపేటలోని శుభనందిని చిట్ఫండ్ సంస్థలో చిట్టీ కట్టి ఏడాది గడిచినా డబ్బు ఇవ్వకపోడంతో ఓ బాధితుడు చివరికి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. మండల కేంద్రంలోని సంస్థ బ్రాంచ్ ఎదుట గురువారం గ్యాస్ బండ, ఉరితాడు, పురుగుల మందు డబ్బాతో ఆందోళనకు దిగాడు. బాధితుడు తెలిపిన వివరాల మేరకు.. ములుగు జిల్లా కేంద్రానికి చెందిన బీ రాజు చిరుద్యోగి. అతడికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. నర్సంపేటలోని శుభనందిని చిట్స్లో రూ.5లక్షల చిట్టీ వేశాడు. చిట్టీ కూడా ఏడాది కిందటే పూర్తయింది. బాధితుడికి రూ.4.50 లక్షలు ఇవ్వాల్సి ఉండగా చిట్ఫండ్ సంస్థ చెక్కులు ఇచ్చింది. కానీ, ఆ చెక్కుల అకౌంట్లలో డబ్బు లేక పోవడంతో వాటిని పట్టుకుని ఏడాది నుంచి బాధితుడు రవి శుభనందిని సంస్థ చుట్టూ తిరుగుతున్నాడు. ఇక భరించలేక గురువారం గ్యాస్బండ పట్టుకుని బ్రాంచ్కు వచ్చి ఆత్మహత్యకు ప్రయత్నించగా సిబ్బంది అడ్డుకొని గ్యాస్బండను లాక్కొని బాత్రూంలో దాచిపెట్టారు. దీంతో బాధితుడు పురుగుల మందు డబ్బా పట్టుకుని నిరసన తెలిపాడు. వెంట తెచ్చుకున్న తాడుతో ఉరి వేసుకుని చస్తానని ఆవేదన వ్యక్తం చేయగా సంస్థ ఉద్యోగులు లాక్కున్నారు. తనకు చిట్టీ డబ్బు చెల్లించక పోవడం వల్ల అప్పుల పాలయ్యానని రవి వాపోయాడు. చివరికి వారంలోగా డబ్బు ఇస్తామని సంస్థ ఉద్యోగులు హామీ ఇవ్వడంతో వెనుదిరిగాడు.