వరంగల్ చౌరస్తా, మే 14 : వరంగల్ రైల్వే స్టేషన్కు, బస్టాండ్కు కూతవేటు దూరంలో ఉండి ఉమ్మడి రాష్ట్ర పాలకుల నిర్లక్ష్యం మూలంగా అభివృద్ధ్దికి ఆమడ దూరంలో నిలిచిన చింతల్ ప్రాంతం నేడు స్వరాష్ట్ర పాలనలో అభివృద్ధికి కేరాఫ్గా మారిపోయింది. పేద, మధ్యతరగతి కుటుంబాలు నివసించే ప్రాంతం కావడంతో ఉమ్మడి రాష్ట్ర పాలకులు ఈ ప్రాంతాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు. ఏళ్ల తరబడి రోడ్డు మార్గం లేక స్థానికులు చాలా ఇబ్బందులు పడ్డారు. కానీ, ప్రజా సంక్షేమ, మౌలిక వసతుల కల్పన మెరుగు పరచడానికి తెలంగాణ ప్రభుత్వం పెద్ద పీటవేసింది.
ఈ క్రమంలోనే గుంతలు పడి, కంకర తేలిన రోడ్డుకు మరమ్మతు చేపట్టి, ప్రత్యేక నిధులతో విలీన గ్రామాలను కలుపుతూ చింతల్ ప్రధాన కూడలి నుంచి తారు రోడ్డును నిర్మించింది. దీంతో ఎన్నో ఏళ్ల కలగా మిగిలిన రోడ్డు నిర్మాణం పూర్తయింది. రోడ్డులేక ఇబ్బందులు పడిన స్థానికులు విశాలంగా రోడ్డు నిర్మాణం పూర్తికావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రహదారి నిర్మాణం పూర్తయ్యి, రవాణా మార్గం మెరుగు పడడంతో వెనకబాటుకు గురైన చింతల్ ప్రాంతం నేడు అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోంది. మౌలిక వసతులు కల్పించి, ప్రజల గోస తీర్చిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని స్థానికులు అభినందిస్తూ, ఆశీర్వదిస్తున్నారు.