గిర్మాజీపేట, డిసెంబర్ 1: బాలలను భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా.. విద్యార్థి దశలోనే సృజనాత్మకతకు పదును పెట్టేలా విజ్ఞానంపై అవగాహన కల్పిస్తూ.. కొత్త ఆవిష్కరణలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. శనివారం నుంచి సోమవారం వరకు మూడు రోజులపాటు జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు వర్ధన్నపేటలోని అల్ఫోర్స్ పాఠశాల సిద్ధమైంది. ఏడు ఉప అంశాలతోపాటు నూతన ఆవిష్కరణకు సంబంధించిన ఏవైనా ప్రయోగాలను ఇందులో ప్రదర్శించొచ్చు. 6 నుంచి 7వ తరగతి వరకు జూనియర్ విభాగం, 8 నుంచి 10వ తరగతి వరకు సీనియర్ విభాగంగా పరిగణించనున్నారు.
ఈ ప్రదర్శనలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు ఎగ్జిబిట్లను ప్రదర్శించొచ్చు. అలాగే, సైన్స్, గణితం, అన్ని సబ్జెక్టులకు సంబంధించిన ఉపాధ్యాయులు, డీఈడీ, బీఈడీ శిక్షణ పొందుతున్న ఛాత్రోపాధ్యాయులు, బోధన ఉపకరణాలు అనే అంశంపై ప్రయోగాలను ప్రదర్శించేందుకు అవకాశం కల్పించారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 3న ఉదయం 8 గంటల్లోపే పాఠశాలకు చేరుకోవాలి. మధ్యాహ్నం 12 గంటలకు ముఖ్య అతిథులు వైజ్ఞానిక ప్రదర్శనను ప్రారంభించనున్నారు. ఈ వైజ్ఞానిక ప్రదర్శనలో సుమారు 5 వందల మంది పాల్గొనే అవకాశం ఉంది. గురువారం వరకు 4 వందల మంది విద్యార్థులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మరో వంద మంది రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ప్రదర్శనలో పాల్గొనే విద్యార్థులకు వసతి, భోజన సౌకర్యం కల్పించనున్నారు. విద్యార్థి సొంతంగా తయారు చేసి ఊహించి రాస్తే 20 మార్కులు, సైన్స్, గణిత భావనలు స్పష్టంగా కనిపిస్తే 15 మార్కులు, సైంటిఫిక్(ప్రయోగ) సూత్రానికి 15 మార్కులు, ప్రయోగం తయారు చేసి విధానం కోసం 15 మార్కులు, సమాజానికి ఉపయోగపడేలా ఉంటే 15 మార్కులు, తక్కువ ఖర్చుతో లాభదాయకంగా ఉంటే 10 మార్కులు, ప్రయోగం వివరించే విధానానికి(ప్రజెంటేషన్కు) 10 మార్కుల చొప్పున కేటాయిస్తారు. గ్రామీణ, గిరిజన, వెనుకబడిన ప్రాంతాల విద్యార్థులకు 5 శాతం, పట్టణ పరిధిలోని విద్యార్థులకు 3 శాతం వెయిటేజీ కేటాయిస్తారు.
వైజ్ఞానిక ప్రదర్శనకు ఏర్పాట్లు పూర్తి : డీఈవో
వర్ధన్నపేట: పట్టణ సమీపంలోని అల్ఫోర్స్ పాఠశాలలో ఈ నెల 3 నుంచి నిర్వహించనున్న బాల వైజ్ఞానిక ప్రదర్శనకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గురువారం డీఈవో వాసంతి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ ప్రదర్శనలకు 3న నల్లబెల్లి, చెన్నారావుపేట, నెక్కొండ, నర్సంపేట, ఖానాపురం మండలాలు, 4న జిల్లాలోని అన్ని రెసిడెన్షియల్ పాఠశాలలు, 5న వర్ధన్నపేట, పర్వతగిరి, రాయపర్తి, సంగెం, గీసుగొండ, దుగ్గొండి మండలాలకు చెందిన విద్యార్థులు పాల్గొంటారని వివరించారు. ఆమె వెంట జిల్లా సైన్స్ అధికారి శ్రీనివాస్, ఉపాధ్యాయులు ఉన్నారు.
ఆసక్తిని పెంపొందించుకోవాలి
పాఠ్యాంశాల్లోని విషయాలు కాకుండా నూతన అంశాలతో కొత్తదనం ఉండేలా ప్రయోగాలను ప్రదర్శించేందుకు సైన్స్ ఉపాధ్యాయులు కృషి చేయాలి.
– డాక్టర్ కట్ల శ్రీనివాస్, జిల్లా సైన్స్ అధికారి
ప్రధానాంశం: సాంకేతిక బొమ్మలు
ఉప అంశాలు: ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజీలో పురోగతి, ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్, ఆరోగ్యం, పరిశుభ్రత, రవాణా, ఆవిష్కరణ, పర్యావరణ ఆందోళనలు, ప్రస్తుత ఆవిష్కరణలతో చారిత్రక అభివృద్ధి, మన కోసం గణితం.