హనుమకొండ, నవంబర్ 28 : ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో హైదరాబాద్కు దీటుగా నగరాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి, చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. మంగళవారం వరంగల్లోని కేఎంసీ మైదానంలో పశ్చిమ, తూర్పు నియోజకవర్గాల ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలే తన బలం.. బలగం అన్నారు. పదవులు ఉన్నా లేకున్నా నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేశానన్నారు. కరోనా కష్టకాలం, వరదల సమయంలో వారి కష్టసుఖాల్లో భాగస్వామిని అయ్యానని తెలిపారు. దేనికి బయపడకుండా కేసీఆర్ ఇచ్చిన ధైర్యం, స్ఫూర్తితో తెలంగాణ సాధనే లక్ష్యంగా ముందుకు సాగానన్నారు. తనకు మరోసారి బీ ఫాం ఇచ్చిన సీఎం నమ్మకాన్ని వమ్ము చేయనని హామీ ఇచ్చారు. మూడోసారి కూడా కేసీఆరే సీఎం అవడం ఖాయమన్నారు. కేసీఆర్, మంత్రి కేటీఆర్ల సహకారంతో నియోజకవర్గాన్ని వేల కోట్లతో అభివృద్ధి చేశానని తెలిపారు.
అలాగే సంక్షేమం, అభివృద్ధి ఫలాలను గడప గడపకూ అందిస్తున్నానన్నారు. ఇప్పటికే నగరం ఐటీ, ఎడ్యుకేషన్, కల్చరల్ హబ్గా తీర్చిదిద్దామని, త్వరలోనే మెడికల్ హబ్గా మారుస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధిని చూసిన దేశ ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. దీన్ని ఓర్వలేని కాంగ్రెస్, బీజేపీలు అసత్య ఆరోపణలు చేస్తున్నాయని విమర్శించారు. ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్న వారికి హక్కులు కల్పించామన్నారు. ఎన్నికల అనంతరం మిగిలిన వారికి కూడా పట్టాలు ఇచ్చి, గృహలక్ష్మి పథకం వర్తింపజేయాలని సీఎం కేసీఆర్ను కోరారు. భద్రకాళీ ఆలయ మాడ వీధుల నిర్మాణానికి రూ. 30కోట్లు ప్రభుత్వం ఇచ్చిందని, మరిన్ని నిధులు ఇవ్వాలని కేసీఆర్కు విజ్ఞప్తి చేశారు. స్పందించిన సీఎం అధికారంలోకి రాగానే మంజూరు చేస్తామని తెలిపారు. ప్రజలు మరోసారి తనను భారీ మెజార్టీతో గెలిపిస్తే మరింత అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధికి అడిగినప్పుడల్లా నిధులు ఇచ్చిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.