హనుమకొండ, సెప్టెంబర్ 14: చారిత్రకమైన వరంగల్కు హైదరాబాద్ కంటే గొప్ప చరిత్ర ఉందని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. గురువారం బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ మహ్మద్ ఇంతియాజ్, కుడా చైర్మన్ సంగంరెడ్డి సుందర్రాజ్ యాదవ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ఖాన్, ముస్లిం వెల్ఫేర్ సొసైటీ సభ్యులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ప్రపంచంలో అతి విశిష్టమైన రెండు దర్గాలు పచ్చ రంగులో ఉన్నాయని, అందులో ఒకటి ఇరాన్లోని బాగ్దాద్లో ఉండగా, రెండోది మన దర్గా కాజీపేట్లో ఉందన్నారు. కులాలు, మతాలకతీతంగా దర్గా ఉత్సవాలు జరుగుతాయన్నారు. అందరూ వచ్చి దర్గాలో ప్రార్థనలు చేస్తారని చీఫ్ విప్ తెలిపారు. తన చిన్న నాటి నుంచే తన కుటుంబ సభ్యులతో కలిసి కాజీపేట దర్గాకు వెళ్లేవాడనని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్ ముస్లిం, మైనార్టీల సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నారన్నారు. అన్ని వర్గాల పండుగలను అధికారికంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ముస్లిం మైనార్టీల కోసం షాదీముబారక్, రంజాన్ కానుకలు, క్రిస్మస్ గిఫ్ట్ప్యాక్లు, గురుకుల పాఠశాలలులాంటి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ర్టాన్ని మతసామరస్యానికి ప్రతీకగా తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్దేనని చీఫ్ విప్ అన్నారు. ముస్లిం కార్పొరేషన్ చైర్మన్ల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి, అధికారికంగా గిలాప్, చాదర్ను క్యాంపు కార్యాలయం నుంచి దర్గాకు తీసుకుపోతున్నట్లు తెలిపారు. ఈ ఆచారం ఇప్పటి నుంచి ప్రతి సంవత్సరం జరుగుతుందని తెలిపారు. ఇతర రాష్ర్టాలను చూస్తే మతాల మధ్య, మనుషుల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతూ అనేక కుట్రలకు పాల్పడుతున్నారన్నారు. కానీ, తెలంగాణలో మాత్రం అలాంటి శక్తులకు చోటు లేదన్నారు.
రేవంత్రెడ్డి ఓ గాడ్సే
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఓ గాడ్సే అని తెలంగాణ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ మహ్మద్ ఇంతియాజ్ ధ్వజమెత్తారు. కాజీపేట దర్గాను సందర్శించిన సందర్భంగా రేవంత్రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముస్లిం, మైనార్టీలకు ఎంతో చేసిందని చెప్పడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనార్టీలను ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుందని, వారి సంక్షేమం కోసం చేసింది ఏమిలేదన్నారు. ఏబీవీపీ మూలాలు ఉన్న రేవంత్రెడ్డికి అసలు ముస్లిం, మైనార్టీల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్ ముస్లిం మైనార్టీల కోసం పెద్ద మొత్తంలో నిధులు ఖర్చు చేయడంతో పాటు అనేక పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే బాబ్రీమసీదు ఇష్యూ వచ్చిందన్నారు. రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదని, కాంగ్రెస్, టీఆర్ఎస్లు అలవెన్స్లో ఉన్నపుడు కేసీఆర్ సూచిస్తే వైఎస్సార్ ప్రవేశపెట్టారన్నారు. కాంగ్రెస్ ఇస్తే పార్లమెంట్లో ఎందుకు ఆమోదం పొందలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో 981 గురుకుల పాఠశాలలు ప్రారంభిస్తే అందులో 200 మైనార్టీలవేనన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో షాదీముబారక్, గురుకుల పాఠశాలలు ఎందుకు తీసుకురావడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ 50 ఏళ్ల పాలనలో రూ.5 వేల కోట్లు ఖర్చు చేస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం 9 ఏండ్ల కాలంలో రూ.10వేల కోట్లు మైనార్టీల కోసం ఖర్చు చేసిందన్నారు. వరంగల్ పశ్చిమ నియోజక వర్గం అభివృద్ధికి చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ కృషి చేస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో ముస్లిం, మైనార్టీలు బీఆర్ఎస్ పార్టీ వైపే ఉంటూ వరంగల్ పశ్చిమ నియోజక వర్గంలో దాస్యం వినయ్భాస్కర్కు సహకరిస్తామని చెప్పారు. ముస్లిం వెల్ఫేర్ స్కీం కింద త్వరలో వరంగల్లో రూ.20లక్షలతో రెడీమేడ్ గార్మెంట్ సెంటర్ను ప్రారంభించనున్నట్లు ఇంతియాజ్ వెల్లడించారు. సమావేశంలో రాష్ట్ర ఖాదీ బోర్డు చైర్మన్ మౌలానా యూసుఫ్ జాహిద్, మాజీ డిప్యూటీ మేయర్ సిరాజొద్దీన్, మైనార్టీ నాయకులు నయీమొద్దీన్, తారిఖ్ అన్వర్, సోనీ మహ్మద్, బియాబాని, ఎండీ జుబేర్, అమ్జద్ పాల్గొన్నారు.