మడికొండ, ఏప్రిల్ 25 : కార్యకర్తలే నా ప్రాణం.. నియోజకవర్గ ప్రజలే నా బలగం అని చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. పనికిరాని పార్టీలో గుర్తిం పు పొందాలనే నాయకులు, కొంతమంది చిల్లరగాళ్లు ఎలాంటి ఆధారాలు లేకుండా తనపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారని, అర్థరహిత విమర్శలు మానుకోవాలని ప్రతిపక్షాలను హెచ్చరించారు. రౌడీ రాజకీయాలను ప్రజలు గుర్తించాలని కోరారు. కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి అధ్యక్షతన మడికొండలో మంగళవారం జరిగిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ప్రతినిధుల సమావేశానికి కుడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్, గ్రంథాలయ సం స్థ చైర్మన్ అజీజ్ ఖాన్, రైతు రుణ విమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకన్నతో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ మాట్లాడుతూ సహాయం చేసి పది మందికి చెప్పే అలవాటు తనకు లేదని, ఈ స్థాయికి రావడానికి ఎంతో కష్టపడ్డానని అన్నారు. మే నెలలో కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతామని, రూ.కోటితో కార్మిక భవన్కు త్వరలోనే శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు.
గత పాలకుల హయాంలో ఐదేళ్లలో కనీసం రూ.5కోట్ల పనులు చేయలేదని, తెలంగాణ వచ్చిన 9 ఏళ్లలోనే ఒకో డివిజన్లో రూ.25 నుంచి 30 కోట్లకు తగ్గకుండా అభివృద్ధి జరిగిందన్నారు. 75 ఏళ్ల కాంగ్రెస్, బీజేపీ పాలనలో ఈ నగరానికి ఏం చేశారో చెప్పాలని సవాల్ విసిరారు. రాష్ట్ర ప్రభుత్వం వరంగల్లో వ్యాగన్ పరిశ్రమ కోసం స్థలం కేటాయిస్తే కేంద్రం ఏర్పాటు చేయకుండా జాప్యం చేస్తున్నదన్నారు. కుడా చైర్మన్ సుందర్రాజ్యాదవ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చిన్న జిల్లాలను ఏర్పాటు చేసి ప్రజల వద్దకే పాలనను తీసుకొచ్చినట్లు తెలిపారు. కాగా, ప్రతినిధుల సమావేశం పండుగ వాతావరణంలో కొనసాగింది. సుమారు రెండు వేలకు పైగా ప్రతినిధులు హాజరయ్యారు. చీఫ్ విప్ దాస్యం బీఆర్ఎస్ జెండా ఆవిష్కరించారు. అనంతరం వేదికపై తెలుగుతల్లి విగ్రహానికి పూలమాల వేసి, అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం పలు తీర్మాణాలను ప్రవేశ పెట్టి ఆమోదించారు. మాడిశెట్టి శివశంకర్, పులి రజినీకాంత్, నార్లగిరి రమేశ్, కొమురయ్య, జోరిక రమేశ్, వీరేందర్, నయీమొద్దీన్, దర్శన్సింగ్ పాల్గొన్నారు.