ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణపై కక్ష పూర్తింగా వ్యవహిస్తున్నారని, ఆయన మొదటి నుంచీ తెలంగాణ వ్యతిరేకి అని, ఇది ప్రజలు గ్రహించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ 11 రోజుల పాటు నిర్వహిస్తున్న దిక్షా దివస్లో భాగంగా మూడో రోజు కార్యక్రమాల్లో వినోద్ పాల్గొన్నారు. గురువారం కార్పొరేషన్ ఆవరణలోని స్మృతి చిహ్నం వద్ద నివాళి అర్పించి, బైక్ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణకు రావాల్సిన నిధులు ఇవ్వకుండా కేంద్రం అడ్డుకుంటున్నదని, నవోదయ పాఠశాలలు, మెడికల్ కళాశాలలు ఇవ్వకుండా వివక్ష చూపుతున్నదని మండిపడ్డారు. చీఫ్విప్ దాస్యం మాట్లాడుతూ కేసీఆర్ దీక్ష వల్లే ఉద్యమం మలుపు తిరిగి స్వరాష్ట్రం సిద్ధించిందని స్పష్టం చేశారు.
– వరంగల్, డిసెంబర్ 1
వరంగల్, డిసెంబర్ 1 : ప్రధాని మోదీ మొదటి నుంచీ తెలంగాణ వ్యతిరేకి అని, ఇది ప్రజలు గ్రహించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ సూచించారు. ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దీక్షా దివస్ కార్యక్రమాల్లో భాగంగా మూడో రోజు గురువారం కార్పొరేషన్ కార్యాలయ ఆవరణలోని స్మృతి చిహ్నం వద్ద నివాళులర్పించారు. అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేశారు. అనంతరం ఇక్కడి నుంచి భారీ బైక్ ర్యాలీ తీయగా బోయినపల్లి జెండాను ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వినోద్ మాట్లాడుతూ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తల్లీబిడ్డలను బలవంతంగా విడదీశారని ప్రధాని మోదీ మాట్లాడడం ఆయనకు తెలంగాణపై ఉన్న వ్యతిరేకతకు నిదర్శనమన్నారు.
తెలంగాణకు నిధులు ఇవ్వకుండా అడుగడుగునా అడ్డుకుంటున్నారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్కు జాతీయ హోదా ఇవ్వడం లేదని, తెలంగాణకు నవోదయ పాఠశాలలు, మెడికల్ కళాశాలలు ఇవ్వకుండా వివక్ష చూపుతున్నారని మండిపడ్డారు. ‘కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై పార్లమెంట్లో ఎంపీ బండి సంజ య్ ఎందుకు మాట్లాడడం లేదు. బండీ.. అసలు నువ్వు తెలంగాణ బిడ్డవేనా’ అని ప్రశ్నించారు. తెలంగాణలో ఆర్థిక సంక్షోభం సృష్టించేందుకు కేంద్రం కుట్రలు చేస్తున్నదని విమర్శించారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉందన్నారు. సంక్షేమ పథకాలు, ఉద్యోగుల జీతాలకు ఎలాంటి ఢోకా లేదన్నారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో అల్లర్లు సృష్టించేందుకే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ యాత్ర చేస్తున్నారని. భైంసా వెళ్లి అక్కడ అల్లర్లు సృష్టించి అక్కడి నుంచి రాష్ట్రమంతా అం టించేందుకు కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. వైఎస్ షర్మిల పాదయాత్ర బీజేపీ కనుసన్నల్లోనే సాగుతోందని విమర్శించారు.
అమిత్షాను కలిసిన తర్వాత తెలంగాణలో పాదయాత్ర మొదలు పెట్టిందని నిజం కాదా అని ప్రశ్నించారు. ఇది ప్రజలు గమనిస్తున్నారన్నారు. తెలంగాణ ఏర్పాటును అడ్డుకున్న వైఎస్ఆర్ పేరుతో తెలంగాణలో పాదయాత్ర చేయడం శుద్ధ దండుగ అని ఎద్దేవా చేశారు. పాదయాత్రలు ఆంధ్రప్రదేశ్లో చేసుకుంటే ఫలితముంటుందని సలహా ఇచ్చారు. తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. షర్మిల బీజేపీ వదిలిన బాణమని స్పష్టం చేశారు. తెలంగాణ వస్తే కరంట్, నీళ్లు ఉండవన్న ఆంధ్ర సీఎం మాటలను గుర్తు చేస్తూ తెలంగాణలో తిరుగుతుంటే పచ్చని పంట పొలాలు, నిండిన చెరువులు, 24 గంటల కరంట్ కనిపించడం లేదా? అని షర్మిలను ప్రశ్నించారు. యావత్ దేశానికి అన్నం పెడుతున్న అన్నపూర్ణ తెలంగాణ అని, తెలంగాణ ఉద్యమకారులను అవమాన పరిచేలా మాట్లాడితే సమాధానం ఘాటుగా ఉంటుందని తెగేసిచెప్పారు.
రాజకీయంగా విమర్శలు చేస్తే తప్పు లేదని, మర్యాద తప్పి మాట్లాడడం తప్పని హితవు పలికారు. ఇక్కడ మేయర్ గుండు సుధారాణి, రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ఖాన్, కార్పొరేటర్లు దేవరకొండ విజయలక్ష్మి, బోయినపల్లి రంజిత్రావు, ఇండ్ల నాగేశ్వర్రావు, వేముల శ్రీనివాస్,చీకటి ఆనంద్, కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, మాజీ కార్పొరేటర్లు తాడిశెట్టి విద్యాసాగర్, జోరిక రమేశ్ పాల్గొన్నారు.
యాత్రల పేరుతో రెచ్చగొడుతున్నరు : దాస్యం
ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ మాట్లాడుతూ తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో 2009 నవంబర్ 29న చేపట్టిన ఆమరణ దీక్షతో ఉద్యమం మలుపుతిరిగి రాష్ట్రం సిద్ధించిందని గుర్తు చేశారు. దీక్షా దివస్ కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వామ్యం కావాలని కోరారు. వైఎస్ షర్మిల రాష్ట్రంలో గొడవలు సృష్టించేందుకు కుట్ర చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్రెడ్డిపై షర్మిల అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నా రు. తెలంగాణ ఉద్యమంలో కనిపించని బీజే పీ నేతలు ఇప్పుడు యాత్రల పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు.
భారీ బైక్ ర్యాలీ
కార్పొరేషన్ ఆవరణలోని దీక్షా దివస్ స్మృతి చిహ్నం నుంచి హనుమకొండ అదాలత్ సెంటర్లోని అమరవీరుల స్తూపం వరకు బైక్ ర్యాలీ తీశారు. వందలాది మంది టీఆర్ఎస్ శ్రేణులతో కలిసి చీఫ్విప్ వినయ్భాస్కర్ ర్యాలీలో పాల్గొన్నారు. కార్పొరేషన్ కార్యాలయం నుంచి ఎంజీఎం సెంటర్, ములుగు రోడ్డు, అలంకార్, హనుమకొండ చౌరస్తా, పబ్లిక్ గార్డెన్స్, అంబేద్కర్ విగ్రహం, కాళోజీ సెంటర్ మీదుగా అమరుల స్తూపం దాకా ర్యాలీ కొనసాగింది. అమరవీరుల స్తూపం వద్ద నేతలు నివాళులర్పించారు. వందలాది మోటర్ సైకిళ్లు, టీఆర్ఎస్ జెండాలతో నగర రహదారులు గులాబీమయంగా మారాయి. జై తెలంగాణ.. జై కేసీఆర్ నినాదాలతో రోడ్లన్నీ మార్మోగాయి.