ఎవుసం సాఫీగా సాగేందుకు పెట్టుబడి సాయం అందిస్తూ అన్నదాతలకు ఆత్మబంధువయ్యాడు ముఖ్యమంత్రి కేసీఆర్.ఇదివరకు పంటలు పండించేందుకు అష్టకష్టాలు పడ్డ రైతాంగానికి కొండంత భరోసానిచ్చి అదునుకు ఆసరా అవుతున్నాడు. సీజన్ మొదలు కాకముందే బ్యాంకు ఖాతాల్లో నగదు జమచేస్తుండడంతో వాటిని వ్యవసాయ ఖర్చులకు వినియోగిస్తున్నారు. పెట్టుబడి కోసం అప్పు చేసే అవసరం లేకుండా సాయం అందిస్తుండడంతో ఉత్సాహంగా పనులు చేసుకుంటున్నారు. – నమస్తే తెలంగాణ నెట్వర్క్, జనవరి 8
మహదేవపూర్, జనవరి 8 : రైతుబంధు పైకం సమయానికి అందడం వల్ల పంట సాగు కోసం మిత్తికి తెచ్చే బాధ తప్పింది. ఇదివరకు పెట్టుబడి డబ్బులు లేక అడ్తిదారు, వడ్డీ వ్యాపారుల దగ్గర ఎక్కువ వడ్డీకి తెచ్చి పంటలు వేసేది. తెలంగాణ వచ్చినంక ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబంధు పథకం తెచ్చినంక డైరెక్ట్ రైతుల అకౌంట్ల పడుతున్నయ్. ఇగ అప్పటినుంచి అప్పు తెచ్చే అవసరం లేకుంటైంది. వచ్చిన పైసలను విత్తనా లు, ఎరువులు, నాట్లకు ఖర్చు పెడ్తున్న. రైతుల సంక్షేమం కోసం పెట్టిన పథకాలు చాలా బాగున్నయ్. దేశంలో ఎక్కడా ఇలాంటి పథకాలు లేవు.
– చల్ల శ్రీనివాస్, సూరారం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా
చిన్నగూడూరు : ఈ యేడు సాగుకు అనుకూలంగా వర్షాలు పడి చెరువులు కుంటలు నిండినయ్. దానికి తోడు ముఖ్యమంత్రి కేసీఆర్ సమయానికి పెట్టుబడి సహాయం అందించారు. నాకున్న ఎకరం 30గుంటల భూమికి రైతుబంధు కింద రూ.8,750 బ్యాంకుల పడ్డయ్. రెండో పంట కూడా నాటేసిన. వచ్చిన డబ్బులను పెట్టుబడి కోసం ఖర్చు పెడుతున్న. నేను 40ఏండ్ల సంది ఎవుసం చేస్తున్న. కేసీఆర్ వచ్చినంక మునుపటంత ఇబ్బందులు ఇప్పుడు లేవు. బావుల్లో నీళ్లు లేక, కరంటు ఎప్పుడొస్తదో తెల్వక రాత్రీపగలు పొలం కాడ కావలి కాశేది. ఒక్కోసారి కరంటు తీగలు తాకి రైతుల ప్రాణాలు పోయేటియి. ఇప్పుడు 24గంటల కరంటు, రైతుబంధు, అకాల మరణం పొందిన రైతు కుటుంబాలకు 5లక్షల బీమా ముఖ్యమంత్రి ఇస్తాండు. ఊర్లల్ల కొనుగోలు కేంద్రాలు పెట్టి రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను గిట్టుబాటు ధరకు కొ నుగోలు చేస్తాండ్రు. కేసీఆర్ వచ్చినంక వ్యవసాయం సంబురంగా సాగుతాంది.
– దోమల ఎలమంద, చిన్నగూడూరు
రఘునాథపల్లి : స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ రైతుబంధు పంటకు పెట్టుబడి సాయం అందించడంతో వ్యాపారుల వద్దకు వెళ్లి అప్పులు తేవడం తప్పింది. సమైక్యరాష్ట్రంలో రైతులు పంటలు పండించాలంటే పెట్టుబడి కోసం చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చేది. పంటలు పండిస్తే గిట్టుబాటు ధర రాక వాటిని షావుకారులకు అమ్ముకునేది. అప్పుడు రూపాయి కూడా చేతికి రాకపోయేకాదు. ఇట్ల అప్పులు ఎక్కువై ఒక్కోసారి తినడానికి తిండి లేక గోసపడేది. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పంట పెట్టుబడి సాయం అందిస్త్తూ రైతులకు గిట్టుబాటు ధర, ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా ఇస్తూ ఇవాళ రైతును రాజుగా మార్చుతున్నడు.
– జంగిడి యాదగిరి , రఘునాథపల్లి, జనగామ జిల్లా
వర్ధన్నపేట : రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు ద్వారా ఆర్థిక సహాయం చేయడం వల్ల పెట్టుబడికి ఇబ్బంది లేకుంటైంది. ప్రతి ఏడాది వానకాలం, యాసంగి సీజన్లో సాగు చేసుకోవడానికి అప్పులు ఎవరు ఇస్తరా అన్ని చూసేది. ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ రైతుబంధు తెచ్చిన తర్వాత సంతోషంగా సాగుచేసుకుంటున్న. నాకు రెండెకరాల భూమి ఉంది. రెండు సీజన్లకు రూ.10వేలు వస్తున్నయ్. కూలీలు, మందు బస్తాలకు సరిపోతానయ్. అప్పులు తెస్తే పంట అమ్మంగ మిత్తితో కలిపి అప్పు కట్టుడుకే సరిపోయేది. ప్రభుత్వం రైతుబంధు ఇస్తున్నప్పటి నుంచి పంట డబ్బులు మిగులుతానయ్. పంటలు మంచిగ పండడంతో పిల్లలను మంచిగ చదివించుకుంటాన. కుటుంబంతో సంతోషంగా ఉంటాన.
– ఆబర్ల సదానందం, ఇల్లంద, వరంగల్ జిల్లా
పరకాల : నాకు నాలుగెకరాల భూమి ఉంది. రెండు ఎకరాలల్ల మిర్చి తోట పెట్టిన. రెండు ఎకరాల్లో వరి పండిస్తున్న. తెలంగాణ సర్కారు ఇస్తున్న రైతుబంధుతోటి రెండు సీజన్లకు కలిపి సాలుకు నలభై వేలు బ్యాంకుల పడుతున్నయ్. ఇదివరకు ఎవుసం అంటే మస్తు ఇబ్బంది అయ్యేది. కేసీఆర్ ముఖ్యమంత్రి అయినంక వ్యవసాయంలో అవన్నీ తప్పినయ్. ఆంధ్ర రాష్ట్రంల ఉన్నప్పుడు కరంటు, నీళ్లు సక్కగ లేక పంటలు ఎండిపోయేటియి. అయినా అప్పటి సర్కారోళ్లు రైతులను పట్టించుకోనేలేదు. తెలంగాణ వచ్చినంక కేసీఆర్ సార్ మా రైతులకు మంచిగ చేస్తుండు. పెద్దమనసుతోటి ఆలోచించి రైతుబంధు, రైతుబీమా పథకాలు పెట్టుడు రైతులకు ఎంతో మేలైతాంది.
– బిలకంటి సంపత్రావు, నడికూడ, హనుమకొండ జిల్లా