చికెన్ ధరలు భారీగా తగ్గాయి. ఎన్నికల సమయంలో రూ.250కి పైగానే ఉన్న ధరలు ఒక్కసారిగా పడిపోవడంతో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం విత్ స్కిన్ కిలోకు రూ.120, స్కిన్ లెస్ రూ.140 చొప్పున అమ్ముతున్నారు. కార్తీకమాసం, అయ్యప్ప దీక్షలు ఉండడంతోపాటు ఎన్నికలు ముగియడం వంటి కారణాలతో చికెన్ ధరలు తగ్గాయని వ్యాపారులు చెబుతున్నారు.
జనగామ రూరల్, డిసెంబర్10 : నిన్న, మొన్నటి వరకు ఆకాశాన్నంటిన చికెన్ ధరలు ప్రస్తుతం తగ్గుముఖం పట్టాయి. రోజురోజుకూ ధరలు పడిపోతుండడంతో వ్యాపారు లు ఆందోళన చెందుతున్నారు. రెండు నెలల క్రితం వరకు చికెన్ ధరలు చుక్కలు చూపించాయి. ప్రస్తుతం ఎన్నికలు పూర్తవడం, కార్తీకమాసం, అయ్యప్ప, హనుమాన్, భవా నీ మాలలు వేస్తుండడంతో మాంసం అమ్మకాలు తగ్గి ధరలు పడిపోయాయి. ప్రస్తుతం విత్ స్కిన్ రూ.121, స్కిన్లెస్ రూ.140, లైవ్ కిలో రూ.90 చొప్పున అమ్మకాలు చేస్తున్నారు. రెండు నెలల క్రితం విత్ స్కిన్ రూ.240, స్కిన్లెస్ 260, బోన్లెస్ రూ. 450, లైవ్ రూ.150 ఉంది. ఇప్పుడు చికెన్ తక్కువ ధరకే దొరుకుతుండడంతో మాంసం ప్రియులు ఖుషీ అవుతుండగా, కోళ్ల వ్యాపారులు మాత్రం నష్టాల పాలవుతున్నారు. చికెన్ ధరలు తగ్గడానికి వ్యాపారు లు పలు కారణాలు చెబుతున్నారు. కోళ్లు ఎద్ద సైజ్కు వచ్చాక కచ్చితంగా అమ్మాలి. లేకుంటే వాటికి మేత ఎక్కువగా పెట్టడంతోపాటు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
ప్రస్తుతం మార్కెట్లో డిమాండ్ తగ్గి, కోళ్లు భారీగా రావడంతో ధర తగ్గింది. ఎన్నికల నేపథ్యంలో డిమాండ్ ఉంటుందని వ్యాపారులు పెద్ద ఎత్తున ఫీడ్ వేశారు. తీరా ఎన్నికల్లో అనుకున్న స్థాయిలో కోళ్లు అమ్ముడు కాలేదు. ఎన్నికలు ముగియడంతో ధర పడిపోయింది. దీంతోపాటు ప్రస్తుతం కార్తీక మాసం, అయ్యప్ప, హనుమాన్, భవానీ మాలలు, పూజలు ఉండడంతో మాంసం అమ్మకాలు తగ్గాయి. నష్టాల్లో పౌల్ట్రీ యజమానులు ధరలు, అమ్మకాలు పడిపోవడంతో పౌల్ట్రీ వ్యాపారులు తీవ్ర నిరాశలో ఉన్నారు. రోజురోజుకూ ధరలు తగ్గుతుండడంతో నష్టాలను చవిచూస్తున్నారు. ఎన్నికల సమయంలో ఉత్పత్తి భారీగా పెంచారు. కానీ, అందుకు తగినట్లు అమ్మకాలు లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. లాభాలు రావడం పక్కనపెడితే రెండింతలు నష్టాలు వచ్చాయని వాపోతున్నారు. కిరాయి, లేబర్, ఇతర ఖర్చులు భరించాల్సి వస్తుందన్నారు. కార్తీకమాసం, మాలధారణలు ముగిస్తే ధరలు మళ్లీ పుంజుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. అదే జరిగితే నష్టాల నుంచి గట్టెక్కుతామని వ్యాపారులు చెబుతున్నారు.