పెద్దవంగర, నవంబర్10 : కాంగ్రెస్ పార్టీకి పాలకుర్తి ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ పాలకుర్తి నియోజకవర్గ అభ్యర్థి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. కలిసేందుకు వచ్చిన కార్యకర్తలను కాలితో తన్నిన టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన పెద్దవంగర మండలంలోని కొరిపెల్లి, వడ్డేకొత్తపల్లి, పోచారం, గంట్లకుంట, పోచంపల్లి, అవుతాపురం, ఉప్పరగూడెం గ్రామాల్లో ప్రచారం నిర్వహించగా, బోనాలు, బతుకమ్మలతో మహిళలు, ఉప్పుచప్పుళ్లు, సంప్రదాయం నృత్యంతో గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. వడ్డేకొత్తపల్లి గ్రామంలో మాజీ మంత్రి నెమరుగొమ్ముల యతిరాజారావు విగ్రహానికి పూలమాల నివాళులర్పించారు. ఆయా గ్రామాల్లో మంత్రి మాట్లాడుతూ.. పాలకుర్తి ప్రజలు ఎంతో తెలివైనవారని, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య పోరాట స్ఫూర్తితో అందరూ ఏకమై కాంగ్రెస్, బీజేపీ నాయకులకు గుణపాఠం చెప్పాలన్నారు. కోట్లాది రూపాయలతో రాష్ట్రంలోని గ్రామాలను కనీవినీ ఎరగని రీతిలో అభివృద్ధి చేసిన మహనీయుడు సీఎం కేసీఆర్ అన్నారు. మన కోసం పాటుపడుతున్న కేసీఆర్కు అండగా నిలవాలని కోరారు. మహిళలు ఆర్థికంగా బలోపేతమయ్యేలా ఎన్నో స్కీమ్స్ ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఉచితంగా కుట్టు శిక్షణతోపాటు రూ.15వేల విలువైన కుట్టు మిషన్ ఉచితంగా అందించి, ఉపాధి కల్పిస్తున్నామన్నారు. నిరుద్యోగ యువత ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగాలు సాధించేలా ఉచితంగా శిక్షణ ఇప్పిస్తున్నట్లు తెలిపారు. డ్రైవింగ్ లైసెన్స్ మేళా పెట్టి ఉచితంగా డ్రైవింగ్ లైసెన్స్లు అందించామన్నారు. కాగా, పాలకుర్తి మండలం కొండాపురం గ్రామానికి చెందిన 50 మంది కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్లో చేరగా, మంత్రి ఎర్రబెల్లి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
పాలకుర్తి నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్న మంత్రి దయాకర్రావును అధిక మెజార్టీ గెలిపించడంతోపాటు సీఎం కేసీఆర్ను మూడోసారి ముఖ్యమంత్రిని చేయాలని రాష్ట్ర ఆరోగ్యశ్రీ ట్రస్టు చైర్మన్ డాక్టర్ నెమరుగొమ్ముల సుధాకర్రావు అన్నారు. బీఆర్ఎస్ ప్రభు త్వం రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించిందన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ ను తెలంగాణను దోపిడీ దొంగల చేతిలో పెట్టొద్దన్నారు. విపక్షాలకు అధికారం ఇస్తే తెలంగాణ అభివృద్ధిలో మరో 50 ఏళ్లు వెనక్కి పోతుందని, కాంగ్రెస్కు ఓటేస్తే కర్ణాటక గతే పడుతుందన్నారు. విపక్షాల మోసపూరిత హామీలతో ప్రజలు ఆగంకావొద్దని, ఆలోచించి ఓటు వేయాలన్నారు.
కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్రెడ్డి వెన్నుపోటుదారుడని, డబ్బులతో బ్లాక్మెయిల్ చేయడంలో దిట్ట అని బీఆర్ఎస్ నేత, ఎన్నారై తిరుపతిరెడ్డి అన్నారు. ఝూన్సీరెడ్డి పెద్ద మోసకారి అని, ఆమె చరిత్ర త్వరలోనే మీడియా ముందు ప్రకటిస్తానన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని కాపాడాలని రేవంత్రెడ్డి తనను కోరారని, ఇప్పుడు డబ్బులకు అమ్ముడుపోయి టికెట్ ఇవ్వకుండా వెన్నుపోటు పొడిచాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి ఎర్రబెల్లి గెలుపును ఆపడం ఎవరితరం కాదని, 70వేల మెజార్టీ ఖాయమన్నారు. పాలకుర్తిలో దయన్నపై పోటీ చేయడానికి ఎవరూ లేకపోతే, నన్ను పోటీ చేయమని అడిగింది నువ్వు కాదా..?, ఆరు నెలలు నేను ఇకడికి వచ్చి కష్టపడిన తర్వాత ఝాన్సీరెడ్డి డబ్బులకు అమ్ముడు పోయింది నిజం కాదా అని ప్రశ్నించారు. రానున్న రోజుల్లో తగిన గుణపాఠం చెబుతామన్నారు. మంత్రి దయాకర్రావు సారథ్యంలో పార్టీ గెలుపు కోసం పనిచేస్తానన్నారు. కార్యక్రమంలో మండల ఇన్చార్జిలు సోమేశ్వర్రావు, గోపాల్రావు, పాలకుర్తి దేవస్థానం, మండల అభివృద్ధి కమిటీ చైర్మన్ రామచంద్రయ్యశర్మ, జిల్లా, మండల రైతుబంధు సభ్యులు కిశోర్రెడ్డి, సోమనర్సింహారెడ్డి, సోమేశ్వర్రావు, ఎంపీపీ రాజేశ్వరి, జడ్పీటీసీ జ్యోతిర్మయి, మండల అధ్యక్ష, కార్యదర్శులు ఐలయ్య, సంజ య్, రైతుబంధ సమితి మండల కన్వీనర్ సోమారెడ్డి, సర్పంచ్లు శోభ, భాస్కర్రావు, లక్ష్మి, యాదలక్ష్మి, మం జుల, జమున, ఎంపీటీసీలు శ్రీనివాస్, సబిత, అనురాధ, విజయ, కల్పనాయాదవ్, నాయకులు యాదగిరిరావు, సుధీర్కుమార్, వెంకన్న, సునీల్రెడ్డి, శ్రీనివాస్, మనోహర్, సుధాకర్, జ్ఞానేశ్వరాచారి, మల్లికార్జునాచారి, పూర్ణచందర్, శ్రీనివాస్, రాజూయాదవ్, కమారస్వామి, సోమన్ననాయక్, వరప్రసాద్రెడ్డి, సమ్మయ్య, రఘు, యూత్ నాయకులు హరీశ్, అనుదీప్ పాల్గొన్నారు.