హనుమకొండ, జూలై 21 : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలకు ప్రతిరూపమే కాళోజీ కళాక్షేత్రం అని కుడా చైర్మన్ సంగంరెడ్డి సుందర్రాజ్ యాదవ్ అన్నారు. శుక్రవారం హనుమకొండ కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో కాళోజీ కళాక్షేత్రం నిర్మాణ పనులపై కలెక్టర్లు సిక్తా పట్నాయక్, ప్రావీణ్య, కాళోజీ ఫౌండేషన్ సభ్యులతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సుందర్రాజ్ యాదవ్ మాట్లాడుతూ కాళోజీ కళాక్షేత్ర నిర్మాణ పనులను రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని అధికారులకు సూచించారు. కాళోజీ కళా క్షేత్రంలో ఏర్పాటు చేయనున్న ఆర్ట్ గ్యాలరీని అత్యంత సుందరంగా తీర్చి దిద్దాలన్నారు. కాళోజీ రచనలు, సాహిత్యం, జీవిత చరిత్ర, పరిశోధనలు, ఆయన వాడిన వస్తువులు, ఫొటోలు, డాక్యుమెంటరీలు సంపూర్ణంగా ఆర్ట్ గ్యాలరీలో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రేక్షకులకు సీటింగ్, లైటింగ్ సౌకర్యవంతంగా ఉండేలా ఏర్పాట్లు చేయాలన్నారు.
కాళోజీ ఫౌండేషన్ కోసం ప్రత్యేకంగా మినీ ఆడిటోరియం, రెండు గదులను కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఆడిటోరియంలో శబ్దానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, శబ్దాలు ప్రతి ధ్వనించకుండా శాస్త్రీయ పద్ధతులు పాటించాలని సూచించారు. యువ కళాకారులను ప్రోత్సహించేందుకు ఈ కాళోజీ కళాక్షేత్రం ఎంతగానో దోహదపడుతుందన్నారు. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. అధికారులు క్షేత్ర స్థాయిలో పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. ఆడిటోరియం ఆవరణలో ఏర్పాటు చేసే కాళోజీ విగ్రహాన్ని జీవ కళ ఉట్టిపడేలా రూపొందించాలన్నారు. అంతేకాక కాళోజీ కళాక్షేత్రం తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా ఉండాలని సుందర్రాజ్ యాదవ్ స్పష్టం చేశారు. సమావేశంలో కుడా పీవో అజిత్ రెడ్డి, కాళోజీ ఫౌండేషన్ చైర్మన్ రామశాస్త్రి, ప్రధాన కార్యదర్శి విద్యార్థి, కార్యదర్శి పొట్లపల్లి శ్రీనివాస్రావు, కోశాధికారి పందిళ్ల అశోక్కుమార్ తదితరులు పాల్గొన్నారు.