పోచమ్మమైదాన్, అక్టోబర్ 6: సర్కార్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం పౌష్టికాహారం అందిస్తున్నదని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాశ్ అన్నారు. కలెక్టర్ పి.ప్రావీణ్య, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్తో కలిసి శుక్రవారం మట్టెవాడ ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలో సీఎం బ్రేక్ఫాస్ట్ పతకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి ప్రజాప్రతినిధులు, అధికారులు అల్పాహారం ఆరగించారు. అనంతరం బండా ప్రకాశ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఎంతో ముందుచూపుతో పిల్లల చదువుతోపాటు ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించారన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే మధ్యాహ్న భోజనం, రాగిజావ అందిస్తున్న ప్రభుత్వం.. తాజాగా అల్పాహారం అందించే పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న అల్పాహార పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. ఇప్పటికే మౌలిక వసతులు కల్పించారన్నారు. అల్పాహార పథకం వల్ల పిల్లలందరూ పౌష్టికాహారం తీసుకుని ఆరోగ్యంగా ఉంటూ చదువుపై ఏకాగ్రత పెంచుకుంటారని తెలిపారు. అల్పాహార పథకం మెనూ అద్భుతంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్ ఆశయం, ఆయన పేద విద్యార్థుల కోసం పడే తపన అభినందనీయమన్నారు. కార్యక్రమంలో డీఈవో వాసంతి, కార్పొరేటర్ ఆకుతోట తేజస్వీ శీరిష్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.