బకాయి ఉన్న రూ.1400 కోట్లు వెంటనే విడుదల చేయాలి
సీఎం కేసీఆర్ పెట్టే కొత్త పార్టీని ప్రజలు ఆదరించాలి
రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
పత్తిపాక పాఠశాలలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర, జడ్పీ చైర్పర్సన్ జ్యోతి
శాయంపేట, జూన్ 12 : తెలంగాణ రాష్ర్టానికి బకాయి ఉన్న రూ.1400కోట్లు విడుదల చేయకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కిరికిరి పెడుతోందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఆదివారం మండలంలోని పత్తిపాక గ్రామంలో మన ఊరు – మనబడి కార్యక్రమం జరిగింది. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్ జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతితో కలిసి పాల్గొన్నారు. స్థానిక పాఠశాలలో రూ.93లక్షలతో చేపట్టే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. గ్రామంలో తిరుగుతూ సమస్యలను పరిశీలించారు. పింఛన్ వస్తుందా? అంటూ పలువురిని ఆత్మీయంగా పలకరించారు. ఈ సందర్భంగా సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ ఇంటింటికీ నల్లా పెట్టించి గోదావరి నీటిని అందిస్తున్న ఘనత, స్త్రీనిధి ద్వారా మహిళలకు రూ.15వేల కోట్లు రుణాలుగా ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్దేనని తెలిపారు.
త్వరలోనే అభయహస్తం డబ్బులు వడ్డీతో చెల్లిస్తామన్నారు. రాష్ట్రంలో వచ్చే నెల నుంచి కొత్త పెన్షన్లు ఇస్తామన్నారు. దేశ రాజకీయాల్లో మార్పులు తెచ్చేందుకు సీఎం కేసీఆర్ ఏర్పాటు చేయబోయే పార్టీకి మద్దతు ఇవ్వాలన్నారు. కేంద్రంలోని బీజేపీ పాలనలో గ్యాస్, పెట్రోలు, డీజిల్ ధరలు పెంచి సామన్యులపై భారం మోపుతున్నారని తెలపారు. దేశ నాయకుడిగా సీఎం కేసీఆర్ను ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచారన్నారు. ఆర్థిక ఇబ్బందులు వచ్చినా పథకాలను అపలేదని చెప్పారు. వరంగల్ జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి మాట్లాడుతూ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తున్న సీఎం కేసీఆర్కు ప్రజలు అండగా నిలవాలని కోరారు. తొలుత పంచాయతీ కార్యదర్శిని స్టేజీపైకి పిలిచి గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధిని మంత్రి అడిగి తెలుసుకున్నారు. వైకుంఠధామం చుట్టూ బయో ఫెన్సింగ్ వేయించి మొకలు నాటాలని సూచించారు. రోడ్డుపై ప్లాస్టిక్, తాగిపడేసిన బాటిళ్లు ఎందుకున్నాయని ప్రశ్నించారు. వాటిని అమ్మితే ఎంత ఆదాయం వచ్చిందని కార్యదర్శిని అడగడంతో రూ.2500 వచ్చినట్లు చెప్పారు. రోజూ చెత్త సేకరణ ట్రాక్టర్ గ్రామంలో తిరుగుతుందా? అని గ్రామస్తులను అడగ్గా వస్తోందని చెప్పడంతో సంతృప్తి వ్యక్తం చేశారు. వేదికపై డీపీవో, అధికారులు సమాధానాలు ఆలస్యంగా చెప్పడంతో అసహనం వ్యక్తం చేశారు. జడ్పీ సీఈవో రాజారావు, డీఆర్డీవో శ్రీనివాస్కుమార్, డీపీవో జగదీశ్వర్, సర్పంచ్ చిట్టిరెడ్డి రాజిరెడ్డి, ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి, డీఎల్పీవో కల్పన, ఎంపీడీవో ఆమంచ కృష్ణమూర్తి, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గంగుల మనోహర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ శరత్ పాల్గొన్నారు.