వర్ధన్నపేట, ఫిబ్రవరి 17 : మున్సిపాలిటీని అన్ని విధాలా అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్దంగా ఉందని ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. పట్టణంలోని వరంగల్-ఖమ్మం జాతీయ రహదారి, అంబేద్కర్ సెంటర్ నుంచి ఫిరంగిగడ్డ వరకు ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ సిస్టంను శుక్రవారం రాత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీపీగా ఉన్న వర్ధన్నపేటను మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేసుకోవడంతో పాటు మూడేళ్లుగా ప్రజల అవసరాలను గుర్తించి అభివృద్ధి పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. వరంగల్-ఖమ్మం, జఫర్గడ్ రహదారిని వెడల్పు చేశామన్నారు. డివైడర్లను కూడా నిర్మించుకున్నామని చెప్పారు. అంతర్గత సీసీరోడ్లు, సులభ్ కాంప్లెక్స్లతో పాటు ఇంటిగ్రేటెడ్ మార్కెట్నూ ఏర్పాటు చేసుకుంటున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ పట్టణాభివృద్ధి కోసం రూ.45 లక్షల నిధులు విడుదల చేశారన్నారు.
లైటింగ్కు రూ.2 కోట్లు..
పట్టణంలో వరంగల్-ఖమ్మం జాతీయ రహదారి, జఫర్గడ్ రోడ్డులోని ఫిరంగి గడ్డ వరకు రూ.2 కోట్లతో సెంట్రల్ లైటింగ్ను ఏర్పాటు చేశామని ఎమ్మెల్యే అరూరి అన్నారు. నిత్యం లారీలు, కార్లు, ఇతర వాహనాలతో రద్దీగా ఉండే జాతీయ రహదారిపై ప్రమాదాలు జరుగుతున్నాయని, దీన్ని దృష్టిలో పెట్టుకుని డివైడర్, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు పట్టణానికి వస్తుంటారని, వారికి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో పట్టణంలో ప్రజల అవసరాల మేరకు అన్ని రకాల అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు వివరించారు.
ఘనంగా సీఎం జన్మదిన వేడుకలు..
ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను పట్టణంలో ఘనంగా నిర్వహించారు. సెంట్రల్ లైటింగ్ను ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే అరూరి రమేశ్ స్థానిక ప్రజా ప్రతినిధులు జాతీయ రహదారిలోని అంబేద్కర్ సెంటర్లో కేక్ కట్ చేశారు. అనంతరం బీఆర్ఎస్ నాయకులు పటాకులు కాల్చి సంబురాలు జరిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ అంగోత్ అరుణ, ఎంపీపీ అప్పారావు, జడ్పీటీసీ భిక్షపతి, వైస్చైర్మన్ ఎలేందర్రెడ్డి, కౌన్సిలర్లు రాజమణి, రవీందర్, రామకృష్ణ, సుధీర్, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
స్వరాష్ట్ర కలను సాకారం చేసిన కేసీఆర్..
హసన్పర్తి : స్వరాష్ట్ర కలను సాకారం చేసి, 8 ఏండ్లలో తెలంగాణను దేశంలోనే ఆదర్శంగా నిలిపిన పాలనాదక్షుడు సీఎం కేసీఆర్ అని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బండి రజినీకుమార్ ఆధ్వర్యంలో హసన్పర్తిలోని ఎర్రగటు ్టగుట్ట కల్యాణ మండపంలో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఎమ్మెల్యే అరూరి సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలతో కలిసి సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రతి గడపకూ సంక్షేమ ఫలాలను అందిస్తున్నారని కొనియాడారు. కాగా, అరూరి గట్టుమల్లు మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన పలు పోటీల మహిళా విజేతలకు ఎమ్మెల్యే బహుమతులు ప్రదానం చేశారు. ఎంపీపీ సునీత, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షురాలు లలితాయాదవ్, జిల్లా ఆత్మ చైర్మన్ చంద్రమోహన్ పాల్గొన్నారు.