కాశీబుగ్గ, జూన్ 11: కేంద్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పించాలని చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్రెడ్డి కోరారు. కేంద్ర ఈశాన్య ప్రాంత అభివృద్ధి, సహకారశాఖ మంత్రి బీఎల్ వర్మ శనివారం రాత్రి వరంగల్ లక్ష్మీపురంలోని చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ కార్యాలయంలో చాంబర్ పాలకవర్గంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు మాట్లాడుతూ వరంగల్ జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. కాకతీయ టెక్స్టైల్ పార్క్, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు, వ్యవసాయ మార్కెట్కు వస్తున్న రైతు సరుకుల రవాణా అవసరాల కోసం జిల్లాలో ఎయిర్పోర్ట్, డై పోర్టు, సైడింగ్ ఏర్పాటుకు సహకరించాలని కోరారు. వరంగల్ జిల్లా వ్యవసాయ ఆధారిత జిల్లా కావడంతో మ్యాంగో, ఇతర పండ్లు, టమాట సరుకులు స్టోరేజీ సమస్యలను అధిగమించేందుకు కేంద్రం చొరవ చూపాలని కోరారు. దీని వల్ల మ్యాంగో పల్ప్, టమాటా కెచప్ వంటి బై ప్రాడక్ట్ పరిశ్రమలు నెలకొల్పే అవకాశాలు ఏర్పడుతాయని, దీంతో గ్రామీణ యువతకు ఉపాధి లభిస్తుందని, రైతులకు ఎంఎస్పీ ఆపరేషన్లో భాగంగా వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు లభిస్తాయని వివరించారు.
జిల్లాలో స్పైస్బోర్డు, కాటన్ టెస్టింగ్ ల్యాబ్లు అందుబాటులో లేక రైతులు కాటన్, టర్మరిక్ తదితర సరుకుల నాణ్యత సర్టిఫికెట్ల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఎదురవుతుందని తెలిపారు. ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్ అయిన వరంగల్లో ప్యాడీ, ఆయిల్ సీడ్, పల్సర్, కాటన్, చిల్లీస్ తదితర క్యాష్ క్రాప్స్ మార్కెటింగ్ జరుగుతుందని, ఇక్కడే ఆన్లైన్ డేటా ఆపరేటింగ్ సిస్టం సెంటర్ను ఏర్పాటు చేసి గ్లోబల్ రిపోర్టులు రైతులకు అందుబాటులో ఉంచాలని కోరారు. వరంగల్ సాంస్కృతిక, చారిత్రక నగరమైనందున వేయి స్తంభాల దేవాలయం, భద్రకాళీ దేవాలయం, ఖిలావరంగల్, రామప్ప దేవాలయం, కోటగుళ్లు ఉన్నాయని, టూరిజం అభివృద్ధి అవకాశాలను సద్వినియోగం చేసుకొని టూరిజాన్ని అభివృద్ధి చేయాలని విన్నవించారు. వరంగల్లో ఓల్డెస్ట్ విద్యాసంస్థల్లో చదివిన విద్యార్థులు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అనేక సంస్థల్లో అత్యున్నత పదవులు నిర్వర్తిస్తున్నారని, హైదరాబాద్ తరహాలో అభివృద్ధి చెందుతుందని, వెంటనే కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థలను ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపై కేంద్ర మంత్రి స్పందిస్తూ త్వరలోనే ఢిల్లీకి ఆహ్వానించుతామని తెలిపారు. చాంబర్ ఉపాధ్యక్షుడు మొగిలి చంద్రమౌళి, సంయుక్త కార్యదర్శి సాగర్ల శ్రీనివాస్, కోశాధికారి అల్లే సంపత్, చాంబర్ పరిధిలోని అడ్తి, వ్యాపారులతోపాటు వివిధ సెక్షన్ల అధ్యక్ష కార్యదర్శులతోపాటు గుమస్తాలు, దడువాయిలు పాల్గొన్నారు.