హనుమకొండ చౌరస్తా, జూన్ 11 : నిరుద్యోగుల ద్రోహి సీఎం రేవంత్రెడ్డి అని, యువతకు ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక మోసం చేస్తున్నాడని ఏబీఎస్ఎఫ్, పోలీసు అభ్యర్థులు ఆరోపించారు. పోలీస్ శాఖలో 20 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయాలని కాకతీయ యూనివర్సిటీ గ్రంథాలయం నుంచి సెకండ్ గేట్ వరకు నిరసన ర్యాలీ చేపట్టి ధర్నా నిర్వహించారు.
అనంతరం ఏబీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మంద నరేశ్ మాట్లాడుతూ పోలీస్ శాఖలో 5 వేల ఉద్యోగాలు కాకుండా 20 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసి నిరుద్యోగులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే కానిస్టేబుల్ అభ్యర్థులకు 36, ఎస్సైకి 38 ఏళ్ల వయోపరిమితి ఇవ్వాలన్నారు. నిరుద్యోగ యువతకు సీఎం అన్యాయం చేస్తే ఊరుకొనేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏబీఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు ధార సురేశ్, కేయూ అధ్యక్షుడు అడ్డ రాజేశ్, ఉపాధ్యక్షుడు బండారి శ్రీనివాస్, రణధీర్, ప్రణయ్, పవన్, కార్తీక్, వేణు, సాయికిరణ్, వెంకటేశ్, సూర్య, పోలీస్ అభ్యర్థులు పాల్గొన్నారు.