నమస్తే నెట్వర్క్, మే 4 ; ప్రచారంలో బీఆర్ఎస్ దూసుకుపోతోంది. పార్లమెంట్ ఎన్నికలు సమీపించడంతో ఊరూరా క్యాంపెయిన్ జోరుగా సాగుతోంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలోని వరంగల్, మహబూబాబాద్ లోకసభ అభ్యర్థుల గెలుపు కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్వహించిన రోడ్షోలకు ప్రజలనుంచి విశేష స్పందన రాగా శ్రేణుల్లో జోష్ వచ్చింది. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, నాయకులంతా రెట్టింపు ఉత్సాహంతో క్షేత్రస్థాయికి వెళ్లి జనంతో మమేకం అవుతున్నారు. ఇంటింటికీ వెళ్లి ఓట్లు అడుగుతూ బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నారు. రాష్ట్రంలో అబద్ధపు హామీలిచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి, పదేళ్లున్నా పేదల కోసం ఏమీ చేయని బీజేపీ సర్కారుకు బుద్ధి చెప్పి బీఆర్ఎస్కు ఓటేయాలని కోరారు.
వరంగల్, మహబూబాబాద్ లోక్సభ స్థానాల పరిధిలో శనివారం బీఆర్ఎస్ నేతలు విస్తృత ప్రచారం నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లా గూడూరులో ఎంపీ అభ్యర్థి మాలోత్ కవిత ఉపాధి హామీ కూలీల వద్దకు ఓట్లు అడిగారు. జనగామ జిల్లా కొడకండ్లలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఉపాధి కూలీల వద్దకు వెళ్లి ప్రచారం చేశారు. కారు గుర్తుకు ఓటు వేసి అభ్యర్థి సుధీర్కుమార్ను గెలిపించాలని కోరారు. ఒక్క ఓటుతో అటు బీజేపీని, ఇటు కాంగ్రెస్ను ఖతం చేసి, బీఆర్ఎస్ సత్తా చూపించాలన్నారు. భువనగిరి అభ్యర్థి క్యామ మల్లేశం గెలుపు కోసం జనగామ మండలం పలు గ్రామాల్లో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి విస్తృత ప్రచారం చేశారు. ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు పంచుతూ వారితో మమేకమయ్యారు. లింగాలఘనపురం మండలంలో స్టేషన్ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ప్రచారం చేశారు.
నయవంచకుడు కడియం శ్రీహరి మీ గ్రామాల్లోకి వస్తే చావుడప్పులు కొట్టి నిరసన తెలుపాలని ప్రజలకు పిలుపునిచ్చారు. భూపాలపల్లి పట్టణంలోని పలు వార్డుల్లో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కలియదిరిగి సుధీర్కుమార్ను గెలిపించాలని ప్రజలను కోరారు. ప్రజల అభీష్టం మేరకే కేసీఆర్ జిల్లాలు ఏర్పాటుచేశారని ఇప్పు డు కాంగ్రెసోళ్లు వాటిని రద్దు చేస్తామంటే ఉరికిచ్చి కొడుతామని హెచ్చరించారు. చిన్నగూడూరులో మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్ ప్రజలతో సమావేశం నిర్వహించి మానుకోట అభ్యర్థి కవితను గెలిపించాలని కోరారు. నెక్కొండ మండలం గుండ్ర పల్లిలో కార్యకర్తలు, ప్రజలతో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి సమావే శమై బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు.