కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై టీఆర్ఎస్ పోరుబాట పట్టింది. తెలంగాణ ఉద్యమం తరహాలో ఉద్యమాన్ని నిర్మించేందుకు ప్రతి శాసనసభ నియోజకవర్గంలో సన్నాహక సమావేశాలు నిర్వహించింది. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు నిరసన కార్యక్రమాల నిర్వహణపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. హనుమకొండ హంటర్రోడ్డులోని సీఎస్ఆర్ గార్డెన్లో వర్ధన్నపేట నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తలతో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి రమేశ్, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు సమావేశం నిర్వహించారు. ధాన్యం కొనే వరకు పోరాటం ఆపొద్దని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కరీమాబాద్లోని రామ్ లక్ష్మణ్ గార్డెన్లో జరిగిన సమావేశంలో వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని మట్లాడుతూ.. రైతాంగం పచ్చగుంటనే మనమందరం బాగుంటామన్నారు. కేంద్రమే ధాన్యం కొనాలని డిమాండ్ చేశారు. నర్సంపేటలో ఎమ్మెల్యే పెద్ది మాట్లాడుతూ.. తెలంగాణ రైతుల పక్షాన పోరాడేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటామన్నారు.
వరంగల్, మార్చి 24(నమస్తేతెలంగాణ) : రాష్ట్రంలోని రైతులు పండించే రెండు పంటల వడ్లను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొనుగోలు చేయాలనే డిమాండ్తో దశలవారీగా నిరసన కార్యక్రమాలు నిర్వహించేందుకు ఉద్యమ కార్యచరణ రూపొందించుకోవాలని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో గురువారం టీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశాలు జరిగాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు నిరసన కార్యక్రమాల ఇన్చార్జిలు, ముఖ్య ప్రజాప్రతినిధులు, నేతలు ఈ సమావేశాలకు హాజరయ్యారు. నర్సంపేటలో జరిగిన టీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశానికి స్థానిక ఎమ్మె ల్యే పెద్ది సుదర్శన్రెడ్డి, నిరసన కార్యక్రమ ఇన్చార్జి, జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి పాల్గొన్నారు. ఓడీసీఎంఎస్ చైర్మన్ రామస్వామినాయక్, జడ్పీ వైస్చైర్మన్ శ్రీనివాస్, మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజినితో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు, రైతుబంధు సమితి బాధ్యు లు హాజరయ్యారు. తెలంగాణ రైతులపై కేంద్రంలోని మోదీ ప్రభుత్వ వివక్షకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని ఎమ్మెల్యే పెద్ది, జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి పార్టీ శ్రేణులకు సూచించారు.
26న గ్రా మ పంచాయతీలు, 27న మండల పరిషత్లు, 28న వ్యవసాయ మార్కెట్ కమిటీలు, పీఏసీఎస్లు, 29న డీసీసీబీ, ఓడీసీఎంఎస్, 30న జిల్లా పరిషత్, 31న అవకాశం, అవసరం ఉన్న చోట మున్సిపాలిటీల్లో కేంద్రం వడ్లు కొనాలని డిమాండ్ చేస్తూ తీర్మానం చేసి ప్రతుల ను కొరియర్, పోస్టుల ద్వారా మోదీకి పంపాలని చెప్పారు. పంజాబ్లో ప్రతి సంవత్సరం రెండు పంటలు(వడ్లు, గోధుమలు) వంద శాతం ఎఫ్సీఐ ద్వారా కేంద్రమే కొంటున్నట్లు తెలంగాణలో కూడా వానకా లం, యాసంగి వడ్లను కొనాలనేది తీర్మానంలో ఉండాలని తెలిపారు. హనుమకొండ హంటర్రోడ్డులోని సీఎస్ఆర్ గార్డెన్లో జరిగిన వర్ధన్నపేట నియోజకవర్గస్థాయి సన్నాహక సమావేశానికి వర్ధన్నపేట, పర్వతగిరి మండలాలు, వర్ధన్నపేట మున్సిపాలిటీ, జీడబ్ల్యూఎంసీ పరిధిలోని 3,14,43 డివిజన్ల నుంచి ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. జనగామ జిల్లా పాలకుర్తిలో జరిగిన టీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశానికి రాయపర్తి మండలంలోని ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు తరలివెళ్లారు. పరకాలలో జరిగిన టీఆర్ఎస్ నియోజకవర్గస్థాయి సన్నాహక సమావేశానికి సం గెం, గీసుగొండ మండలాలు, జీడబ్ల్యూఎంసీ పరిధిలో ని 15,16,17 డివిజన్ల నుంచి పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు తరలివెళ్లారు. వరంగల్తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆధ్వర్యంలో కరీమాబాద్లోని రామ్లక్ష్మణ్ గార్డెన్లో టీఆర్ఎస్ నియోజకవర్గస్థాయి సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీది ట్రబుల్ ఇంజిన్, ఆ పార్టీ తెలంగాణకు తీరని అన్యా యం చేస్తున్నదని మండిపడ్డారు. పంజాబ్లో మాదిరిగా ఇక్కడి వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.