ఎల్కతుర్తి, డిసెంబర్ 24 : రన్నింగ్లో ఉన్న ఆర్టీసీ బస్సు వెనుక టైర్లు ఒక్కసారిగా ఊడిపోవడంతో ప్రయాణికులు ఒకరిపై ఒకరు పడ్డారు. ఏం జరుగుతుందో తెలియక భయంతో ఆర్తనాదాలు చేశారు. డ్రైవర్ చాకచక్యంగా బ్రేక్ వేయడంతో తృటిలో పెనుప్రమాదం తప్పింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. హుజూరాబాద్ డిపో పల్లెవెలుగు(హైర్ విత్) బస్సు సుమారు 80 మంది ప్రయాణికులతో హుజూరాబాద్ నుంచి హనుమకొండకు బయలుదేరింది. కొంతదూరం వెళ్లాక బస్సు వెనుక భాగం నుంచి శబ్దం వస్తున్నదని ప్రయాణికులు డ్రైవర్కు చెప్పారు.
దీంతో బస్సును ఆపి డ్రైవర్ టైర్లను పరిశీలించాడు. అనంతరం మెల్లగా వెళ్తుండగా ఎల్కతుర్తి శివారులో వెనుకటైర్లు ఊడిపోయాయి. దీంతో ఒక్కసారిగా బస్సు కుదిపేయడంతో ప్రయాణికులు ఒకరిపై ఒకరు పడగా స్వల్ప గాయాలయ్యాయి. అప్రమత్తమైన డ్రైవర్ బ్రేక్ వేయడంతో బస్సు నిలిచిపోయింది. చిన్నపాటి గాయాలతో బయట పడడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం వారు మరో బస్సులో తమ వెళ్లిపోయారు.