హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 22 : వరంగల్ రీజియన్ పరిధిలో ఆర్టీసీ కార్మికుల సమ్మెతో బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఉదయం నుంచే బస్సులు బయటకు డిపోల ఎదుట కార్మికులు ఆందోళనలకు దిగడంతో పాటు తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని నినాదాలు చేశారు. దీంతో తొలి రోజైన బుధవారం సమ్మె సక్సెస్ అయ్యింది. ఒక్క బస్సు కూడా డిపో నుంచి బయటకు రాకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రజలు బస్టాండుల్లో గంటల తరబడి వేచిచూశారు. రీజియన్ పరిధిలోని వరంగల్ 1, వరంగల్ 2, హనుమకొండ, పరకాల, భూపాలపల్లి, జనగామ, నర్సంపేట, మహబూబాబాద్, తొర్రూరు డిపోల్లో మొత్తం 1,036 బస్సులుండగా ఇందులో 596 ఆర్టీసీ సంస్థ నడిపిస్తున్నది. 325 అద్దె, 115 విద్యుత్ బస్సులుండగా డిపోల్లోనే నిలిచిపోయాయి.
సమ్మెను నిర్వీర్యం చేసేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు ఆర్టీసీ అధికారులు అద్దె, ఎలక్ట్రిక్ బస్సులను నడిపించారు. కొన్ని బస్సుల్లో కండక్టర్లు లేకుండా డ్రైవర్లతోనే నడిపించారు. వరంగల్ నగరం నుంచి నర్సంపేట, పరకాల, ములుగు, భూపాలపల్లి వంటి ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఆటోలు, ఇతర వాహనాలను ఆశ్రయించారు. నిత్యం బస్సులపై ఆధారపడే విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బస్సుల బంద్తో ప్రతిరోజూ వరంగల్ రీజియన్ పరిధిలో ఆర్టీసీకి వచ్చే రూ. 1.50 కోట్లకు పైగా ఆదాయానికి గండి పడింది. హనుమకొండ డిపో నుంచి లోకల్ బస్సు బయటకు రాగా అడ్డుకున్న కార్మికులు డ్రైవర్ను కిందకు దిగాలని డిమాండ్ చేశారు.
సుబేదారి ఇన్స్పెక్టర్ రంజిత్కుమార్, పోలీస్ సిబ్బంది కార్మికులకు నచ్చజెప్పి పక్కకు జరిపించారు. అలాగే భూపాలపల్లిలో ఐదు ఎలక్ట్రిక్ బస్సులను అడ్డుకున్నారు. ఓ కార్మికుడు బస్సు అడ్డంగా పడుకుని నిరసన వ్యక్తం చేశారు. హనుమకొండ నుంచి జనగామ వైపు నడుస్తున్న కొన్ని బస్సుల్లో కండక్టర్లు డబ్బులు తీసుకొని టికెట్లు ఇవ్వలేదు. సమ్మెను ఆసరాగా చేసుకున్న ప్రైవేటు వాహనదారులు విపరీతంగా రేట్లు పెంచడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రయాణికుల ఇబ్బందుల దృష్ట్యా ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని ప్రజలు కోరుతున్నారు.
ఆర్టీసీ సమ్మె కారణంగా గ్రామీణ తపాలా సేవలు నిలిచిపోయాయి. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు అందరికీ ఉచిత బస్సు ప్రయాణం కల్పించారు. పలు డిపో మేనేజర్లు తాత్కాలిక పద్ధతిలో డ్రైవర్, కండక్టర్లను నియమిస్తున్నారు. కాగా, ఆయా డిపోలు, బస్టాండ్ల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, ఎమ్మెల్సీ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు మద్దతుగా నిలిచారు. మహబూబాబాద్లో ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు, మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ కార్మికులతో కలిసి ఆందోళనలో పాల్గొన్నారు.
బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ హనుమకొండ, వరంగల్ 1 డిపోల వద్ద నిరసనలో పాల్గొన్నారు. భూపాలపల్లిలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కార్మికులతో కలిసి ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు అన్యాయం చేస్తున్నదని, వారి న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
కార్మికుల సమ్మె కారణంగా ప్రయాణికులకు ఇబ్బందుల్లేకుండా వరంగల్ రీజియన్ పరిధిలో మొత్తం 228 అద్దె, ఎలక్ట్రిక్ బస్సులను నడిపించాం. సాయంత్రం 5 గంటల వరకు హనుమకొండ డిపో నుంచి 2, మహబూబాబాద్ డిపో నుంచి 2 ఆర్టీసీ బస్సులతో పాటు హైర్బస్సులు 145, ఎలక్ట్రిక్ బస్సులు 79 మొత్తం 228 నడిపించాం. ప్రజా రవాణాకు అంతరాయం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం.
– ఎస్ భవానీప్రసాద్, రీజనల్ మేనేజర్, వరంగల్