న్యూశాయంపేట, మార్చి 17 : హనుమకొండ జిల్లాలోని పశ్చిమ నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్థి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవాల కోసం ఈ నెల 23న మంత్రి కేటీఆర్ వస్తున్నారని, ఈ సందర్భంగా నిర్వహించే సభను విజయవంతం చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ అధ్యక్షతన హంటర్రోడ్డులోని విష్ణుప్రియ గార్డెన్లో శుక్రవారం నిర్వహించిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సన్నాహక సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని జీర్ణించుకోలేక తప్పుడు విమర్శలు చేస్తూ వచ్చే కాంగ్రెస్, బీజేపీ నేతలకు బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. గతంలో ఎన్నడూ లేని విధంగా హనుమకొండ, వరంగల్ నగరాభివృద్ధికి సీఎం కేసీఆర్ వేలాది కోట్ల రూపాయలు వెచ్చించారని వివరించారు.
పార్టీ అభివృద్ధి కోసం పాటుపడే నాయకులు, కార్యకర్తలకు ఫలితం ఉంటుందని, కాబోయే సీఎం కేటీఆర్ను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఎన్నికలు రాబోతున్నందున కార్యకర్తలు నిత్యం ప్రజల మధ్య ఉండి వారిలో రాజకీయ చైతన్యం తేవాలని సూచించారు. కులాలు, మతాల పేరిట అల్లర్లు సృష్టిస్తున్న బీజేపీ తీరును ఎండగట్టాలన్నారు. కాంగ్రెస్కు సరైన నాయకత్వమే లేదని ఎద్దేవా చేశారు. మోదీ ప్రభుత్వం బీఆర్ఎస్ నేతలను అక్ర మంగా అరెస్టులు చేయిస్తున్నదని, దీనిపై రాజకీయంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు.
మళ్లీ మనదే విజయం : బోయినపల్లి
వచ్చే ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్ పార్టీయే విజయం సాధిస్తుందని, ఇందుకు ప్రజల సహకారం ఉండాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. బీజేపీ దుర్మార్గులు సోషల్ మీడియాలో తెలంగాణపై దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. జిల్లాల ఏర్పాటుతో తెలంగాణలోని మారుమూల ప్రాంతాల ప్రజలు సైతం అభివృద్ధి ఫలాలు పొందుతున్నారని గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యమానికి హనుమకొండ కేంద్ర బిందువుగా నిలిచిందన్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి హనుమకొండ నియోజకవర్గంగా పేరు మార్చేందుకు ఎన్నికల కమిషన్కు విన్నవిస్తామన్నారు.
కంటికిరెప్పలా కాపాడుకుంటా : దాస్యం
చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ మాట్లాడుతూ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని, నిత్యం నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటానని అన్నారు. 23న కేటీఆర్ బహిరంగ సభను విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు. హనుమకొండ జిల్లా పరిధిలో దాదాపు రూ.80 కోట్లతో పలు అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ ప్రారంభోత్సవం చేస్తారని చెప్పారు. జిల్లాను ఐటీ, మెడికల్, ఎడ్యుకేషనల్ హబ్గా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, పాడి కౌశిక్రెడ్డి మాట్లాడుతూ ఈడీ, మోదీలను ఎదుర్కొనేందుకు ప్రజలే మనకు బలమని స్పష్టం చేశారు. సన్నాహక సమావేశంలో కుడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్, దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవారెడ్డి, రైతు రుణ విమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ఖాన్, మైనార్టీ కమిషన్ సభ్యుడు దర్శన్సింగ్, మాజీ ఎమ్మెల్సీ పుల్లా పద్మావతి, మాజీ మేయర్ గుండా ప్రకాశ్, కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి పాల్గొన్నారు.