జయశంకర్ భూపాలపల్లి, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ)/ కృష్ణకాలనీ : కేంద్రంలోని బీజేపీ సర్కారుపై సింగరేణి కార్మికలోకం భగ్గుమన్నది. నాలుగు బొగ్గు బ్లాకులను వేలం వేయాలనే మోదీ ప్రభుత్వ నిర్ణయంపై కన్నెర్రజేసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపుమేరకు జయశంకర్ భూపాలపల్లి వేదికగా జంగ్సైరన్ మోగించింది. జిల్లాకేంద్రంలో శనివారం నిర్వహించిన మహాధర్నాకు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతిరాథోడ్ ముఖ్య అతిథులుగా హాజరై కేంద్రం తీరుపై ధ్వజమెత్తారు. ‘గుజరాత్కు ఒక నీతి.. తెలంగాణకు ఒక నీతా.. తెలంగాణపై మోదీ సర్కారు ఆదినుంచీ వివక్ష చూపుతున్నది.. ఇప్పుడు సింగరేణి ప్రైవేటీకరణకు కుట్రలు పన్నుతున్నది.. సంస్థను కాపాడుకు నేందుకు కేసీఆర్ సర్కారు పోరాడుతూనే ఉంటుంది..’ అని స్పష్టం చేశారు. ఇదే సమయంలో కార్మికులు, ప్రజలు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్న ఈ కార్యక్రమానికి కార్మికులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో తరలివచ్చి ‘బీజేపీ హఠావో.. సింగరేణి బచావో’ నినాదాలతో హోరెత్తించారు.
బొగ్గు బ్లాకులను వేలం వేయాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ చీకటి సూర్యులు జంగ్సైరన్ మోగించారు. బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు పిలుపు మేరకు శనివారం భూపాలపల్లి జిల్లాకేంద్రంలో శనివారం బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి అధ్యక్షతన మహాధర్నా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ హాజరు కాగా, వరంగల్, మహబూబాబాద్ ఎంపీలు పసునూరి దయాకర్, మాలోత్ కవిత, వరంగల్, నర్సంపేట, జనగామ, మహబూబాబాద్, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, పెద్ది సుదర్శన్రెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, శంకర్నాయక్, అరూరి రమేశ్, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, జనగామ, మహబూబాబాద్ జడ్పీ చైర్పర్సన్లు జక్కు శ్రీహర్షిణి, పుట్ట మధూకర్, సంపత్రెడ్డి, బిందు హాజరయ్యారు. అస్వస్థత కారణంగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హాజరుకాలేకపోయారు. ఆశించిన దానికంటే అధికసంఖ్యలో సింగరేణి కార్మికులు, ప్రజలు, బీఆర్ఎస్, టీబీజీకేఎస్ శ్రేణులు తరలిరావడంతో మహాధర్నా సక్సెస్ అయింది. బీజేపీ సర్కారు తెలంగాణపై చూపుతున్న వివక్ష గురించి కళాకారుల బృందం పాడిన పాటలు ఆకట్టుకున్నాయి.
గుజరాత్కో నీతి.. తెలంగాణకో నీతా..
గుజరాత్ రాష్ర్టానికో నీతి, తెలంగాణ రాష్ర్టానికో నీతా అని మంత్రి ఎర్రబెల్లి కేంద్రంలోని నరేంద్రమోదీ ద్వంద్వ విధానంపై ధ్వజమెత్తారు. మహాధర్నాలో ఆయన మాట్లాడుతూ గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ నాలుగు బొగ్గు బ్లాకులను నామినేషన్పై ఇచ్చిందని, అదే తెలంగాణలోని నాలుగు బ్లాకులను వేలం వేయాలని కేంద్రం నిర్ణయం తీసుకొని టెండర్లకు ఆహ్వానించిందని, ఇలా కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం ద్వంద్వ విధానాలను అవలంబిస్తూ మూర్ఖంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. రామగుండానికి ప్రధాని మోదీ వచ్చిన సందర్భంగా సింగరేణిని ప్రైవేటీకరణ చేయబోనని చెప్పి ఇప్పుడు బ్లాకులను వేలానికి పెట్టారని విమర్శించారు. సింగరేణి కార్మికుల పరిరక్షణ కోసం సీఎం కేసీఆర్ ప్రభుత్వం పోరాడుతూనే ఉందని, అదే సమయంలో సింగరేణి కార్మికులు, తెలంగాణ ప్రజలు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ వ్యాప్తంగా సింగరేణి కార్మికులు ఉద్యమిస్తుంటే హైదరాబాద్కు వచ్చిన ప్రధాని మోదీ సింగరేణిని ప్రైవేటీకరణ చేయమని ఒక్క మాటైనా చెప్పారా అని ప్రశ్నించారు. ప్రధాని దోస్తులైన అదానీకి విదేశాల్లో బొగ్గు గనులు ఉన్నాయని, అక్కడి బొగ్గును దిగుమతి చేసుకొని మనదేశంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసిందని ధ్వజమెత్తారు.
ఇలా సింగరేణి సంస్థను పరోక్షంగా నిర్వీర్యం చేయడానికి కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం కంకణం కట్టుకుందని, దీనిపై సింగరేణి కార్మికులు, తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలన్నారు. ఎన్ని కేసులైనా ఎదుర్కొంటాం కానీ కేంద్ర ప్రభుత్వానికి తలవంచేది లేదని స్పష్టంచేశారు. మోదీ ప్రభుత్వాన్ని సీఎం కేసీఆర్ నేతృత్వంలో గద్దె దింపేవరకూ పోరాడుదామని పిలుపునిచ్చారు. ఉపాధి హామీ పథకాన్ని కూడా ఎత్తివేయాలని కేంద్రం కుట్రలు చేస్తున్నదన్నారు. వ్యవసాయానికి ఉపాధి హామీ పథకం అనుసంధానం చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసి పంపితే కేంద్ర ప్రభుత్వం బుట్టదాఖలు చేసిందన్నారు. కూలీలకు పని దినాలు తగ్గించిందని, ఎనిమిదేండ్ల కాలంలో ఉపాధి హామీ కూలీలకు గడ్డపార, తట్ట, మెడికల్ కిట్లు ఇవ్వలేదని అన్నారు. పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా ఉపాధి కూలీ పెంచాలని కోరితే కేవలం రూ.15 పెంచారని అన్నారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఒక మెడికల్ కాలేజీ, నవోదయ పాఠశాలను కూడా మంజూరు చేయలేదన్నారు.
‘బీజేపీని హెచ్చరిస్తున్నాం, మతం పేరిట చిచ్చు పెట్టాలని చూస్తే ఎదుర్కొన్నాం. ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారాన్ని కనిపెట్టాం. తెలంగాణకు ఈ ఎనిమిదేండ్లలో మోదీ ఒక మంచి పని కూడా చేయలేదు’ అని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బుర్ర రమేశ్, భూపాలపల్లి మున్సిపల్ చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణి సిద్ధు, మున్సిపల్ వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, టీబీజీకేఎస్ భూపాలపల్లి ఏరియా ఇన్చార్జిలు ఏబూసి ఆగయ్య, బడితల సమ్మయ్య, ఫిట్ సెక్రటరీలు, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కటకం జనార్ధన్, మున్సిపల్ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కల్లెపు రఘుపతిరావు, సెగ్గం సిద్ధు, వరంగల్ ఉమ్మడి జిల్లాలోని జడ్పీటీసీలు, ఎంపీపీలు, పీఏసీఎస్ చైర్మన్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, టీబీజీకేఎస్ నాయకులు, కార్యకర్తలు, సింగరేణి కార్మికులు, బీఆర్ఎస్ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు అధికసంఖ్యలో పాల్గొన్నారు.
మన వనరులను దోచేందుకు కేంద్రం కుట్ర..
ఎనిమిదేండ్ల కాలంలో తెలంగాణ రాష్ర్టానికి కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం చేసిందేమీ లేకపోగా ఇక్కడి సహజ వనరులను దోచే కుట్రకు తెరలేపిందని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. పేదల సంక్షేమం పట్టని ప్రధాని ఈ దేశానికి ఉండడం దురదృష్టమన్నారు. తెలంగాణ కొంగు బంగారమైన సింగరేణి స్వాతంత్య్రం రాక ముందునుంచే లక్షల కుటుంబాలకు అన్నంపెట్టిన కల్పవల్లి అని, 130 ఏళ్ల చరిత్ర గల సింగరేణిలో మరో వందేళ్ల అవసరాలకు సరిపడా బొగ్గు నిక్షేపాలు ఉన్నాయని, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపడుతాయని పేర్కొన్నారు. అనేక ఇబ్బందుల నేపథ్యంలో కార్మికులకు సీఎం కేసీఆర్ కారుణ్య నియామకాలను తీసుకువచ్చి ఇప్పటి వరకు అనేక కుటుంబాలకు ఉద్యోగ అవకాశాలు కల్పించారని గుర్తుచేశారు. సంస్థను గతంలో ఎన్నడూ లేనివిధంగా మరింత లాభాల బాటలో నడిపిస్తూ సింగరేణి కార్మికులకు సంస్థ లాభాల్లో 30శాతం వాటా పెంచి ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. పేదలు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. ఆసరా, కల్యాణలక్ష్మి, రైతుబంధు, రైతుబీమా, 24గంటల ఉచిత విద్యుత్ వంటి పథకాలు దేశంలోని బీజేపీపాలిత రాష్ర్టాల్లో అమలుచేస్తున్నారా అని మోదీని ప్రశ్నించారు. కార్మికులను కడుపులో పెట్టుకొని చూసుకుంటున్న సీఎం కేసీఆర్ వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటారన్నారు. ఇక్కడ నాలుగైదు వేలకు టన్ను బొగ్గు దొరుకుతుంటే విదేశాల నుంచి బొగ్గును దిగుమతి చేసుకోవాలని ప్రధాని మోదీ చెబుతున్నారని, విదేశీ బొగ్గు దిగుమతికి ఖర్చు ఎంత ఎక్కువ అవుతుందో తెలంగాణ ప్రజలు ఆలోచించాలని మంత్రి సత్యవతి అన్నారు.
– మంత్రి సత్యవతి రాథోడ్
కాంగ్రెస్ పాలన అంతా అవినీతిమయం
కాంగ్రెస్ పాలన అంతా అవినీతిమయం. కాంగ్రెస్ హయాంలో ప్రాజెక్టులు, రహదారుల్లోనే కాకుండా మరుగుదొడ్లు, బాత్రూంల నిర్మాణాల్లో కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. మరుగుదొడ్లు, బాత్రూంల ఉత్తర్వుల కాపీలు ప్రజల చేతుల్లో ఉంటే బిల్లుల సొమ్ము మాత్రం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల జేబుల్లోకి వెళ్లింది. కాంగ్రెస్ హయాంలో ఇందిరమ్మ ఇళ్ల అవినీతిలో మంథని నియోజకవర్గం రాష్ట్రంలోనే ప్రథమంగా నిలిచింది. ఈ విషయమై సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్లు కట్టకుండానే కాంగ్రెస్ నాయకులు బిల్లులు కాజేశారు. ప్రస్తుత మంథని ఎమ్మెల్యే గతంలో ప్రజలకు స్వేచ్ఛగా మాట్లాడే హక్కు లేకుండా చేశారు. రైతుల కోసం, ఎరువుల కోసం మాట్లాడితే రౌడీషీట్లు ఓపెన్ చేయించిన చరిత్ర ఆయనది. తెలంగాణలోని 80శాతం ప్రజలు సింగరేణి మీద ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి ఉన్నారు. సింగరేణి విషయానికొస్తే తాడిచర్ల, కాపురం ప్రజల భూములు జెన్కో ఓపెన్కాస్టు కింద పోయాయి. అంతకుముందు ఈ ఎమ్మెల్యేనే అప్పుడు మంత్రిగా ఉన్నారు. అక్కడి ప్రజలు ఆయన దగ్గరికి పోయి ఎకరానికి రూ.3.80 లక్షలు ఇస్తున్నారు.. ఇంకో రూ.20వేలు పెంచాలని ప్రాధేయపడ్డారు. పెంచే బాధ్యత తనదని చెప్పి, మరుసటి రోజు పత్రికల్లో ఎకరానికి ధర రూ.3.80 లక్షలు మాత్రమే జెన్కో ప్రకటించిందని చెప్పి పట్టాలేని వారికి అందులో సగమే పరిహారం ఇచ్చేలా చేసిన్రు. నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఎకరానికి రూ.3.80 లక్షలు ఉన్న ధరను రూ.6.50 లక్షలకు పెంచి పరిహారం ఇప్పించాను. పట్టాలేని వారికి ఎరానికి రూ.4.50 లక్షలు ఇప్పించా.
– పుట్ట మధూకర్, జడ్పీ చైర్మన్, పెద్దపల్లి జిల్లా
బీజేపీ ప్రభుత్వం మాడి మసైపోక తప్పదు
సింగరేణి సంస్థను నిర్వీర్యం చేయాలని చూస్తే సింగరేణి కార్మికుల ఆగ్రహజ్వాలల్లో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మాడి మసైపోతుంది. తెలంగాణలోని బొగ్గు బ్లాకులను ప్రైవేటుకు అప్పగిస్తే ఇప్పుడున్న బొగ్గు నిక్షేపాలు పూర్తయి గనులు మూత పడిన తర్వాత సంస్థకు నూతన బొగ్గు గనులు రాకుంటే సింగరేణి కార్మికుల పరిస్థితి ఏమిటనే విషయమై ఆలోచించే సోయి ప్రధానికి ఎందుకు లేదు? మతం పేరుతో బీజేపీ నీచమైన రాజకీయాలు చేస్తోంది. సింగరేణి పరిరక్షణ కోసం సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు పోరాటం చేసేందుకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి. బీజేపీ అధికారంలోకి వస్తే పేదల ఖాతాల్లో రూ.15 లక్షల చొప్పున వేస్తామని చెప్పి వేయకపోగా నల్లధనాన్ని కూడా వెలికితీయలేని అసమర్థ ప్రభుత్వం మోదీది. ఎమ్మెల్యే గండ్ర కృషితోనే భూపాలపల్లి ఏరియాలో వెయ్యి క్వార్టర్లను సింగరేణి కార్మికుల కోసం నిర్మించుకున్నం. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో మరో 994 అధునాతన డబుల్ బెడ్రూం క్వార్టర్లను ఇటీవలే ప్రారంభించుకున్నం. ఎమ్మెల్యే గండ్ర నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు పనిచేస్తున్నారు. జీఎంఆర్ఎం ట్రస్టు ద్వారా మా కుమారుడు గౌతమ్రెడ్డి మంచి పనులు చేస్తుంటే వాటిని కూడా కొందరు వక్రీకరించి మాట్లాడుతున్నారు. మహాధర్నాను విజయవంతం చేసిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు.
– గండ్ర జ్యోతి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, జయశంకర్ భూపాలపల్లి
ప్రాణాలకు తెగించైనా కాపాడుకుంటాం
ప్రాణాలకు తెగించైనా సింగరేణిని ప్రైవేట్ పరం కాకుండా కాపాడుకుంటాం. గత సంవత్సరంలోనే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సింగరేణి జంగ్ సైరన్ ఊదాం. అందుకే ప్రధాని సింగరేణిని ప్రైవేట్పరం చేయబోమని హామీ ఇచ్చి, నేడు మళ్లీ మాట తప్పి దొంగచాటుగా ప్రైవేట్పరం చేసేందుకు టెండర్లు పిలుస్తున్నడు. మోదీ వచ్చిన తర్వాత రూ.48వేల కోట్ల విలువగల బొగ్గు గనులను అమ్మేశాడు. ఒకప్పుడు దేశవ్యాప్తంగా నాలుగు లక్షల మంది సింగరేణి కార్మికులుంటే, ఇప్పుడు రెండు లక్షల మందే ఉన్నారు. దేశంలోని బొగ్గు బ్లాకులను అమ్మినట్లే తెలంగాణలోని సింగరేణిని అమ్మాలని చూస్తున్నాడు. బీజేపీ కుట్రలను తిప్పికొడతాం. సీఎం కేసీఆర్ పాలనలో సింగరేణి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది. వారసత్వ ఉద్యోగాలను, లాభాల్లో 30శాతం వాటాను ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్దే. ఎమ్మెల్యే గండ్ర కార్మికుల కోసం ఇప్పటికే వెయ్యి క్వార్టర్లు నిర్మించారు. ఈ నెలఖారులోగా మరో వెయ్యి క్వార్లర్లు అందుబాటులోకి తెస్తారు. ఏరియాలో ఇప్పటికే నాలుగు వేల మంది కార్మికులకు సింగరేణి క్వార్టర్లు ఉన్నయ్.
–ఏబూసి ఆగయ్య, టీబీజీకేఎస్ భూపాలపల్లి బ్రాంచి ఇన్చార్జి
కేంద్రం సింగరేణికి ఏం చేసింది?
సింగరేణికి కేంద్రం చేసిందేమిటో తెలంగాణకు కేంద్రం ఇచ్చిందేమిటో ప్రధాని మోదీ చెప్పాలి. తెలంగాణకు గుండెకాయలాంటి సింగరేణిని ప్రైవేటీకరించాలని కుట్రలు చేస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని తన్ని తరిమికొట్టాలి. సింగరేణి బాగుండాలని సీఎం కేసీఆర్ ఎప్పుడూ పరితపిస్తుంటారు. తెలంగాణలోని నాలుగు బొగ్గు బ్లాకులను సింగరేణికే కేటాయించాలని సీఎం కేసీఆర్ లేఖ రాసినా ప్రధాని మోదీ ఇంతవరకు స్పందించలేదు. తెలంగాణ రాష్ర్టానికి వస్తే ఇక్కడి సమస్యలపై స్పందించకుండా దేశంలోని మరెక్కడివో ఇక్కడ చెబుతారు. సింగరేణి బొగ్గు ధరను మార్కెట్లో తక్కువ చేసి చూపించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారో మోదీ సమాధానం చెప్పాలి. ఇది సంఘాల కొట్లాట కాదు.. సింగరేణి కార్మికుల అస్తిత్వం కోసం పోరాటం. ప్రైవేటీకరణ సమస్యను అందరూ కలిసికట్టుగా పోరాడి ఎదుర్కోవాలి.
–పెద్దిరెడ్డి సుదర్శన్రెడ్డి, నర్సంపేట ఎమ్మెల్యే
తెలంగాణపై మోదీ విషం
సింగరేణి సంస్థ తెలంగాణ కొంగుబంగారం. 14ఏండ్లు పోరాడి సాధించుకున్న తెలంగాణలో తొమ్మిదేండ్ల నుంచి చేస్తున్న అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రధాని మోదీ నాయకత్వంలో తెలంగాణపై విషం చిమ్ముతున్నది. సాగు, తాగునీటి రంగంలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉంది. ప్రతి చోటా పల్లెప్రగతి, పట్టణప్రగతి పనులే అభివృద్ధికి నిదర్శనంగా కనిపిస్తున్నయ్. సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ ఆకుపచ్చని, ఆయురారోగ్యాలు కలిగిన తెలంగాణగా విలసిల్లుతుంటే చూసి కండ్లు మండిన బీజేపీ ప్రభుత్వం సీఎం కేసీఆర్ను తట్టుకోవడం కష్టమని భావించి, కేసీఆర్ కుటుంబసభ్యులను ఇబ్బందులు పెడుతున్నది. ఖబడ్దార్ నరేంద్ర మోదీ.. కేసీఆర్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఆయన వెనుక నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలు ఉన్నారన్న విషయాన్ని గుర్తుంచుకో.. యువత, విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడానికి బండి సంజయ్ చిల్లర రాజకీయాలకు పాల్పడుతూ పేపర్లను లీకేజీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే కుట్రలు చేశాడు. విభజన చట్టంలోని ఏ ఒక్క హామీనీ బీజేపీ ప్రభుత్వం నెరవేర్చలేదు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట రైల్వేకోచ్ ఫ్యాక్టరీ, ములుగులో గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని చెప్పి ఇప్పటివరకు వాటి ఊసే ఎత్తలేదు. దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లను పూర్తిగా ఎత్తేసే కుట్రలు చేస్తున్న బీజేపీని గద్దె దించేదాకా నిద్రపోం. మేకిన్ ఇండియా అనే చెప్పుకొనే నరేంద్ర మోదీ దేశ సంపదను దేశానికి ఎందుకు వాడడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలి. తెలంగాణలోని ప్రాజెక్టులకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదో చెప్పాలి. ప్రధాని మోదీ పేదల జీవితాలతో ఆడుకుంటున్న నీచుడు.
– అరూరి రమేశ్, వర్ధన్నపేట ఎమ్మెల్యే
బీజేపీ పాలనకు చరమగీతం పాడాలి
కేంద్రంలో అధికారంలో ఉండి ప్రజా వ్యతిరేక పాలనను కొనసాగిస్తున్న బీజేపీకి భూపాలపల్లి నుంచే చరమగీతం పాడాలి. బీజేపీ పాలనలో దేశంలోని పేదలు బతకలేని దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణలోని అన్నివర్గాల ప్రజలు సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో జీవిస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం పన్నుల రూపంలో రాష్ట్రం నుంచి తీసుకుంటూ తెలంగాణకు ఏమీ తిరిగివ్వకుండా అణగదొక్కే ప్రయ త్నం చేస్తున్నది. దళిత, గిరిజనుల రిజర్వేషన్లను ఎత్తేయాలని కుట్ర పన్నుతున్నది. దేశంలోనే అన్ని రాష్ర్టాల్లో కన్నా తెలంగాణలోని సింగరేణి లాభాల బాటలో నడస్తుంటే, ఓర్వలేని బీజేపీ, నాలుగు బొగ్గు బ్లాకులను ప్రైవేటుపరం చేసేందుకు దొంగచాటున ఆన్లైన్లో టెండర్లు పిలుస్తున్నది. సింగరేణిని ప్రైవేట్పరం చేస్తే కార్మికుల ఉసురు బీజేపీకి తాకుతది. గత నవంబర్లో ప్రధాని నరేంద్ర మోదీ సింగరేణిని ప్రైవేట్పరం చేయబోమని రామగుండానికి వచ్చి చెప్పింది వట్టి నీటి మూటలేనా?. సింగరేణి ప్రైవేటీకరణను అడ్డుకోవాల్సిన బాధ్యత తెలంగాణలో ప్రతి ఒక్కరిపై ఉంది. బీజేపీ నాయకులను ఎక్కడికక్కడ నిలదీయాలి. సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ సస్యశ్యామలంగా ఉంది. దేశంలో ఎక్కడాలేని విధంగా 50లక్షల మందికి ఆసరా పింఛన్లు ఇస్తున్న ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుంది.
– బానోత్ శంకర్నాయక్, మహబూబాబాద్ ఎమ్మెల్యే
ఎర్రకోటపై గులాబీ జెండా ఎగరేస్తాం
ప్రజావ్యతిరేక పాలనను అవలంబిస్తున్న బీజేపీని వచ్చే ఎన్నికల్లో గద్దెదించి, ఎర్రకోటపై గులాబీ జెండాను ఎగరేస్తాం. నరేంద్ర మోదీ.. రాష్ట్ర విభజన చట్టంలోని ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా ఏ ముఖం పెట్టుకొని తెలంగాణకు వచ్చినవ్?. తొమ్మిదేళ్లుగా కేంద్రంలో అధికారం వెలగబెడుతున్న బీజేపీ, తెలంగాణకు ఏమిచ్చిందో చెప్పాలి. తెలంగాణ సంపదనంతా పన్నుల పేరిట దోచుకుంట తెలంగాణను విచ్ఛిన్నం చేసే కుట్ర చేస్తున్న నీచమైన చరిత్ర నరేంద్ర మోడీది. దేశంలోని అనేక రాష్ర్టాల్లో ట్రాఫిక్ సమస్య ఉన్నది. దాన్ని కేంద్రం ఎందుకు పరిష్కరిస్తలేదో చెప్పాలి. సీఎం కేసీఆర్ పాలనలో అన్నిరంగాల్లో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచింది. తెలంగాణ పల్లెల్లో జరుగుతున్న అభివృద్ధిని మెచ్చుకొని కేంద్రమే అవార్డులు ఇస్తున్నది. ఒకప్పుడు ఏమీ లేని తెలంగాణను సీఎం కేసీఆర్ ఇప్పుడు దేశం మెచ్చేలా, దేశానికే అన్నం పెట్టేలా అభివృద్ధి చేస్తుంటే. అన్నీ ఉన్న దేశాన్ని ఎందుకు దివాలా తీయిస్తున్నాడో ప్రధాని నరేంద్రమోదీ చెప్పాలి.
– ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, జనగామ ఎమ్మెల్యే
పేపర్ లీకేజీలో అడ్డంగా దొరికిన దొంగ బండి సంజయ్
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పరీక్షలు నిర్వహిస్తుంటే ప్రశ్నపత్రాలను లీక్ చేస్తూ అడ్డంగా దొరికిన దొంగ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. సీఎం కేసీఆర్ చావునోట్లోకి వెళ్లి తెలంగాణను సాధించి అన్ని రంగాల్లో రాష్ర్టాన్ని అభివృద్ధి చేస్తుంటే పేపర్ లీకేజీలు, కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతూ రాష్ర్టాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రకు బీజేపీ తెరలేపింది. నరేంద్ర మోదీ దేశ సంపదనంతా తన దోస్తులు అదానీ, అంబానీలకు దోచిపెడుతున్నారు. ఏ రాజకీయ పార్టీల నాయకులైనా ప్రజల తరఫున ఆలోచిస్తూ, పేదల అభివృద్ధి కోసం పోరాడాలి. కానీ, బీజేపీ నాయకులు మాత్రం అదానీ, అంబానీలకు దోచిపెట్టేందుకే దేశ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు. రాష్ట్రంలోని బొగ్గు బ్లాకులను ప్రైవేట్పరం చేస్తూ సింగరేణి కార్మికుల పొట్టకొట్టాలని చూస్తున్నారు. దేశంలో బొగ్గు ధరను పిరం చేసి, ఇతర దేశాల నుంచి బొగ్గు దిగుమతి చేసుకొని కార్మికుల ఇన్సెంటివ్పై దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నరు.
– నన్నపునేని నరేందర్, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే
కార్మికులకు అండగా బీఆర్ఎస్
కార్మికులకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుంది. ప్రజల కష్టాలు తీర్చి, వారి సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పుట్టిన పార్టీ బీఆర్ఎస్. తెలంగాణలో సారవంతమైన భూములున్నా, నాడు సాగుకు నోచుకోలేదు. అదే తెలంగాణలో సీఎం కేసీఆర్ సీఎం అయిన తర్వాత అన్ని వసతులను కల్పించి సాగునీటికి ఢోకా లేకుండా చేశారు. లాభాల్లో నడుస్తున్న సింగరేణి గనులను ప్రైవేటీకరణ చేయాలని ప్రధాని మోదీ కుట్రలు చేస్తున్నారు. ఈ కుట్రలను తిప్పికొట్టడంలో బీఆర్ఎస్ పార్టీ ముందుంటుంది. కేంద్రం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ప్రజలు తిప్పికొట్టాలి. రాష్ట్ర విభజన హామీలను నెరవేర్చకుండా కేంద్రం విస్మరించింది. మతాలు, కులాల పేరిట పబ్బం గడపడమే పనిగా పెట్టుకుంది.
– పసునూరి దయాకర్, వరంగల్ ఎంపీ
రెండు కోట్లు కాదు.. రెండు వేలు కూడా ఇవ్వలే
బీజేపీ పాలనలో దేశంలోని పేదలంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లాభాల్లో ఉన్న ఎల్ఐసీ, సింగరేణి, రైల్వేను ప్రైవేట్పరం చేయాలని చూడడం సిగ్గుచేటు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏటా రెండుకోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన నరేంద్ర మోదీ, ఇప్పటివరకు రెండు వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. దేశంలో నిత్యావసర సరుకులు, వంట గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెంచి బీజేపీ పేదల పొట్టకొడుతోంది. సీఎం కేసీఆర్ పాలనలో సింగరేణి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది. లాభాల వాటాలో కార్మికులకు 30శాతం చెల్లించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుంది. సింగరేణిలో 17వేల వారసత్వ ఉద్యోగాలు ఇచ్చిన మహనీయుడు సీఎం కేసీఆర్.
–జక్కు శ్రీహర్షిణి, జడ్పీ చైర్పర్సన్, జయశంకర్ భూపాలపల్లి
సింగరేణి కోసం సంఘటితంగా పోరాడాలి
లాభాల బాటలో నడుస్తున్న సింగరేణిని ప్రైవేట్ పరం చేసేందుకు బీజేపీ పన్నుతున్న కుట్రలను తిప్పికొట్టేందుకు ప్రతిఒక్కరూ సంఘటితంగా పోరాడాలి. తెలంగాణలో సీఎం కేసీఆర్ రైతులు, కార్మికుల అభివృద్ధే ధ్యేయంగా పరిపాలన చేస్తుంటే, బీజేపీ మాత్రం దేశంలోని రైతులను, కార్మికులను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ప్రజల అవసరాలను పక్కనబెట్టి, కేవలం అదానీ, అంబానీల జపం చేస్తున్నది. మా తాతముత్తాల నుంచి ఒంటిలో బొక్కలు విరిగేలా కష్టపడి బొగ్గు తీస్తూ, సింగరేణిని కాపాడుకుంటే.. బీజేపీ ప్రభుత్వం ప్రైవేట్ చేతుల్లో పెట్టి నాశనం చేయాలని చూస్తున్నది. నరేంద్ర మోదీ ఖబడ్దార్.. సింగరేణిని ప్రైవేట్ పరం చేసే నిర్ణయాన్ని మానుకోవాలి.
– మాడ హరీశ్రెడ్డి, భారత జాగృతి జిల్లా అధ్యక్షుడు, జయశంకర్ భూపాలపల్లి
కార్మికుల గళం