పాలకుర్తి రూరల్, నవంబర్ 15: సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఉద్య మ నేత, సీఎం కేసీఆర్ అని బీఆర్ఎస్ పాలకుర్తి నియోజకవర్గ అభ్యర్థి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. పేదలకు సంక్షేమ ఫలాలు అందుతుండడంతో దీనిని ఓర్వలేని కాంగ్రెస్ నేతలు ప్రజలకు మాయమాటలు చెబుతూ మోసం చేస్తున్నారని తెలిపారు. బుధవారం పాలకుర్తిలోని బషారత్ గార్డెన్లో గొల్ల కురుమల నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమ్మేళనం జరిగింది. తొలుత నియోజకవర్గంలోని గొల్లకురుమలు స్థానిక గుడివాడ చౌరస్తా నుంచి రాజీవ్ చౌరస్తా వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఒగ్గు డోలు విన్యాసాలు, బోనాలు, శివసత్తుల పూనకాలతో ఊరేగింపు చేశారు. ఆనంతరం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బక్క నాగరాజు, వర్రె ఎల్లయ్య యాదవ్ అధ్యక్షతన ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లికి మేకపిల్ల, గొంగడిని గొల్ల కురుమలు బహుకరించారు. అనంతరం మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ ఓటు అనే వజ్రాయుధాన్ని ఆలోచించి వేయాలని సూచించారు. ఎన్నికలొచ్చాయని గందరగోళానికి గురికావొద్దన్నారు. ప్రజల కోసం పని చేసే నాయకులకు మాత్రమే ఓటు వేయాలన్నారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో గొల్లకురుమలకు అన్యాయం జరిగిందన్నారు. కాంగ్రెస్ నేతలు దోచుకోవడమే తప్ప పేదల గురించి ఆలోచించలేదన్నారు. పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో గొల్ల కురుమలకు అండగా నిలిచింది సీఎం కేసీఆర్ మాత్రమేనన్నారు.
గొల్లకురుమల ఆర్థికాభివృద్ధికి సీఎం కేసీఆర్ సబ్సిడీపై గొర్రెల యూనిట్లను అందించారని, వీటిలో పాలకుర్తి నియోజకవర్గంలో అత్యధికులకు అందించామని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. దేశంలో ఎక్కడాలేని విధంగా సంక్షేమ పథకాలను రాష్ట్రంలో అమలు చేస్తున్నట్లు వివరించారు. వ్యవసాయానికి నిరంతరం ఉచిత విద్యుత్, రైతుబంధు రైతుబీమా, ఆసరా, కల్యాణలక్ష్మి పథకాలు పేదలకు ఎంతగానో మేలు చేస్తున్నాయని వివరించారు. ఇలాంటి సంక్షేమ పథకాలను కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఎందుకు అమలు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. మూడు పంటలు కావాల్నా.. మూడు గంటల కరెంట్ కావాలా రైతులు ఆలోచించాలన్నారు. టీ-పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బ్రోకర్ మాటలు మాట్లాడుతున్నాడని ధ్వజమెత్తారు. 10హెచ్పీ మోటార్ పెట్టి మూడు గంటల కరెంట్ ఇస్తామని రేవంత్రెడ్డి చెప్పడం చూస్తే కరెంట్పై అతడికి అవగాహన లేదని తెలుస్తున్నదన్నారు. గొల్లకురుమలు ఈ ఎన్నికల్లో బీఆర్ ఎస్ను భారీ మెజార్టీతో గెలిపించాలని, తనను మరోసారి ఆశీర్వదించాలని ఎర్రబెల్లి కోరారు. మళ్లీ అధికారంలోకి రాగానే నామినేటెడ్, పార్టీ పదవుల్లో గొల్లకురుమలకు ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చారు.
ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్టు చైర్ పర్సన్ ఎర్రబెల్లి ఉషా దయాకర్రావు మాట్లాడుతూ ప్రజల మనిషి దయన్నకు పట్టం కట్టాలన్నారు. నీతి, నిజాయితీకి మధ్య జరుగుతున్న ఎన్నికలన్నారు. కారు గుర్తుకు ఓటేసి ఎర్రబెల్లికి అత్యధిక మెజార్టీ అందించాలన్నారు. ఎన్నారై ఎర్రంరెడ్డి తిరుపతిరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ అభ్యర్థి యశస్వినిరెడ్డి, ఝాన్సీరెడ్డి ఇద్దరూ తోడు దొంగలన్నారు. వారికి పాలకుర్తికి ఎలాంటి సంబంధం లేదన్నారు. యశస్వినిరెడ్డి అమెరికా కోడలన్నారు. ఈ ఎన్నికల్లో మంత్రి ఎర్రబెల్లికి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గొల్లకురుమ సంఘం నాయకులు పండుగ నారాయణ, చిలువేరు పెంటయ్య, బొమ్మరబోయిన నాగరాజు, మాజీ కల్నల్ ప్రముఖ వైద్యుడు మాచర్ల భిక్షపతి, సలేంద్ర సోమన్న, బెల్లి యుగేందర్, సలేంద్ర శ్రీనివాస్, జిట్టబోయిన రమేశ్, నిమ్మల అనిల్, బెల్లి లింగన్న, కత్తుల భిక్షపతి, పండుగ ఈదయ్య, నీలారపు వెంకన్న, సుడిగెల హనుమంతు, కాసాని ఎర్రయ్య, తాటిపెల్లి మహేశ్, మేకల సంపత్యాదవ్, దూదిమెట్ల సోనాబాబు, మేకల రమేశ్, బండి రాజాబాబు, చిన్నాల లక్ష్మీనారాయణ, రాసాల సమ్మయ్య, చిలువేరు సంపత్, వల్లపు మల్లయ్య, బత్తిని యాకయ్య, ఎన్నకూస యాకయ్య, బొమ్మరబోయిన రాజేందర్, రాసాల మధు, వెల్పుల భాస్కర్ పాల్గొన్నారు. జానపద కళాకారుల ఆట పాటలు..గొల్ల కురుమల ఆత్మీయ సమ్మేళనలో జానపద కళాకారులు రేలారే గంగ, కనకవ్వ, ఒగ్గు రవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వారు తమ ఆటపాటలతో అలరించారు.