పాలకుర్తి రూరల్, నవంబర్ 3: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎస్టీ వర్గీకరణ చేపడుతామంటున్న టీ-పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి గిరిజనుల మధ్య చిచ్చు పెడుతున్నాడని బీఆర్ఎస్ పాలకుర్తి నియోజకవర్గ అభ్యర్థి, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. బ్రోకర్గా మారిన రేవంత్రెడ్డికి ఈ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం పాలకుర్తి మండల దుబ్బతండా(ఎస్పీ), గుడికుంట తండా, గోపాలపురం, నారబోయిన గూడెం గ్రామాల్లో ప్రర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లికి గిరిజనులు సంప్రదాయ రీతిలో బతుకమ్మలు, బోనాలతో ఘన స్వాగతం పలికారు. డప్పుచప్పుళ్లతో నృత్యాలు చేస్తూ నీరాజనం పలికారు. ఈ సందర్భంగా జరిగిన సభల్లో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ రాష్ట్రంలోని మారుమూల పల్లెలు, తండాలను గ్రామపంచాయతీలుగా మార్చి అభివృద్ధి పనులకు పెద్ద ఎత్తున కేటాయిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. సేవాలాల్ మహరాజ్ జయంతి ఉత్సవాలకు నిధులు మంజూరు చేశారని ఆయన గుర్తు చేశారు.
గిరిజన బిడ్డలకు ప్రజాప్రతినిధులుగా అవకాశం కల్పించామని, వారి కోరిక మేరకు మరిన్ని తండాలను పంచాయతీలుగా గుర్తించామన్నారు. గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్నదని, వీరికి 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. ఈ మేరకు అసెంబ్లీలో గిరిజన రిజర్వేషన్ల బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపినా అమలు చేయడంలో ప్రధాని మోదీ విఫలమయ్యారని ఎర్రబెల్లి విమర్శించారు. తండాల్లో సాగు, తాగు నీరు, కనీస సౌకర్యాలు కల్పించేందుకు నిధులు మంజూరు చేస్తున్న విషయాన్ని వెల్లడించారు. తండాలకు, ఆవాస ప్రాంతాలకు బీటీ రోడ్డు సౌకర్యం కల్పించామన్నారు. గోదావరి జలాలతో చెరువులు, కుంటలు నింపానన్నారు. మిషన్ భగీరథ ద్వారా తండాల్లో ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్నామన్నారు. పాలకుర్తి మండల కేంద్రంలో సేవాలాల్ మహరాజ్ గుడికి రూ.10 కోట్లు మంజూరు చేశామని ఆయన గుర్తు చేశారు. ఆసరా పథకంలో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు పింఛన్ అందిస్తున్నామన్నారు. అభివృద్ధిని ఓర్వలేని కాంగ్రెస్, మతతత్వ బీజేపీకి ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని ఎర్రబెల్లి ప్రజలకు పిలుపునిచ్చారు.
గ్రామపంచాయతీలుగా మారిన తండాల్లో నూతన జీపీ భవనాలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. గ్రామాలతోపాటు తండాల్లోనూ నర్సరీలు, వైకుంఠధామాలు, క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేశామన్నారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో గిరిజనులను పట్టించుకోలేదని విమర్శించారు. ఎన్నికల్లో ఓట్ల కోసం వచ్చే వారిని పట్టించుకోవద్దని సూచించారు. ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్టు ద్వారా ఉపాధి హామీ కూలీలకు ఉచితంగా బ్యాగులను అందిస్తున్నానని చెప్పారు. సీఎం కేసీఆర్కు గిరిజనులు అండగా నిలబడాలని ఆయన కోరారు. వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్ చాలంటున్న కాంగ్రెస్ నేతలకు గుణపాఠం చెప్పాలని, నిరంతర విద్యుత్ ఇస్తున్న బీఆర్ఎస్ను భారీ మెజార్టీతో గెలిపించాలని దయాకర్రావు కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నల్లా నాగిరెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్, జడ్పీటీసీ పుస్కూరి శ్రీనివాస్రావు, రైతుబంధు సమితి మండల కన్వీనర్ వీరమనేని యాకాంతారావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు ఎర్రబెల్లి రాఘవరావు, ముస్కు రాంబాబు, యూత్ ఇన్చార్జి ఎర్రబెల్లి వినయ్రావు, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి మాచర్ల ఎల్లయ్య, సర్పంచ్లు బానోత్ యాకూబ్, కాంతి, మేడిద రజిత, చెరిపెల్లి రజిత అనిల్, కోస రాంరెడ్డి, గ్రామశాఖ అధ్యక్షులు రమేశ్, భోజ్యా, మూర్తి, గంగమ్మ, బానోత్ శంకర్, ఠాకూర్, దేవేందర్, హనుమంతు, వీరన్న, మోహన్, జైతురాం, బానోత్ వెంకటి, రాములు, బానోత్ రమేశ్, చిక్కుడు సమ్మయ్య, రాంరెడ్డి పాల్గొన్నారు.