‘ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ భారీ విజయం సాధిస్తుంది.. మళ్లీ కేసీఆరే మూడోసారి ముఖ్యమంత్రి అవుతున్నారు’ అని బీఆర్ఎస్ స్టేషన్ ఘన్పూర్ అభ్యర్థి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గంలో గెలిచిన పార్టీయే రాష్ట్రంలో అధికారం చేపడుతుందని, 1957 నుంచి ఇలానే జరుగుతూ వస్తున్నదని చెప్పారు. ప్రజాప్రతినిధులు, ముఖ్యనాయకులతో కలిసి స్టేషన్ఘన్పూర్లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
స్టేషన్ ఘన్పూర్, డిసెంబర్ 1 : ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీయే భారీ విజయం సాధిస్తుందని, మూడోసారి కూడా కేసీఆరే సీఎం అవుతారని స్టేషన్ఘన్పూర్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యాలయంలో ప్రజా ప్రతినిధులు, ముఖ్యనాయకులతో కలిసి శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గంలో విజయం సాధించిన పార్టీయే రాష్ట్రం అధికారం చేపడుతుందని, 1957 నుంచి ఇలాగే జరుగుతోందని చెప్పారు. స్టేషన్ఘన్పూర్లో బీఆర్ఎస్ విజయం ఖాయమని, రాష్ట్రంలో కూడా బీఆర్ఎస్సే అధికారంలోకి వస్తుందన్నారు. ఒకవేళ హంగ్ వచ్చినా బీఆర్ఎస్సే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, ఇందులో ఎలాంటి అనుమానం అవసరం లేదని స్పష్టం చేశారు.
కడియం శ్రీహరితోనే అభివృద్ధి సాధ్యమవుతుందన్న నమ్మకంతో నియోజకవర్గంలో సీపీఎం, సీపీఐ, టీడీపీతోపాటు అక్కడక్కడా బీజేపీ వాళ్లు కూడా సానుకూలంగా స్పందించి ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్కు పరోక్షంగా సహకరించాయని కడియం తెలిపారు. ప్రస్తుత బీఆర్ఎస్ శ్రేణుల తోపాటు, తనతో పాత పరిచయాలు ఉన్నవారు తన గెలుపు కోసం శక్తికి మించి కృషి చేశారని కడియం అన్నారు. వందశాతం బీఆర్ఎస్ గెలుస్తున్నదని, కార్యకర్తల కష్టానికి ఫలితం 3వ తేదీన చూడబోతున్నామన్నారు.
ఎన్నికల్లో శక్తికి మించి పనిచేసిన వారిని తన కుటుంబసభ్యుల్లా, కంటికి రెప్పలా కాపాడుకుంటానని కడియం అన్నారు. ఎన్నికల సమయంలో తాను ఎవరి మనసునైనా నొప్పించేలా మాట్లాడి ఉంటే మనస్ఫూర్తిగా క్షమించాలని కోరారు. తాను కోపంతో అనలేదని, అందులోని ప్రేమను కూడా చూడాలని బీఆర్ఎస్ శ్రేణులను కోరారు. తనకు నియోజకవర్గ అభివృద్ధే ఎజెండా అని, అందరి సహకారంతో సమష్టిగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామని చెప్పారు. ఇవే తన చివరి ఎన్నికలని, తన 30ఏళ్ల రాజకీయ జీవితంలో నీతి, నిజాయితీగా పనిచేశానని, ఇప్పటి వరకు కడియం శ్రీహరి నిజాయితీ పరుడు అనే పేరుందని, దాన్ని అలాగే కాపాడుకుంటానని చెప్పారు. అందరూ నీతి, నిజాయితీగా పనిచేసి సహకరించాలని కోరారు. అందరం ప్రజల మధ్య ఉంటూ, ప్రజల కోసం పనిచేద్దామని పిలుపునిచ్చారు. సమావేశంలో బీఆర్ఎస్ జనగామ జిల్లా అధ్యక్షుడు, జడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, జనగామ జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎడవెళ్లి కృష్ణారెడ్డి, బుగులు వేంకటేశ్వర స్వామి ఆలయ చైర్మన్ శ్రీధర్ రావు, బీఆర్ఎస్ జిల్లా నాయకులు నరేందర్ రెడ్డి, బెలిదె వెంకన్న, బూర్ల శంకర్, మండల అధ్యక్షుడు మాచర్ల గణేశ్, పెసరు రమేశ్, మునిగల రాజు, రైతుబంధు సమితి సభ్యుడు రాంబాబు, పీఏసీఎస్ చైర్మన్ తీగల కరుణాకర్ రావు, సర్పంచ్లు నగరబోయిన మణెమ్మ యాదిగిరి, ఎర్రబెల్లి శరత్, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చందర్ రెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్ తోట సత్యం, ఎంపీటీసీ రజాక్ యాదవ్, గుర్రం రాజు, నెలమంచి శైలజా అజయ్ రెడ్డి, కనకం స్వరూపా గణేశ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చేపూరి వినోద్, మాజీ ఎంపీటీసీలు గోనెల ఉపేందర్, గుర్రం ఫాతికుమార్, తిరుమలనాథ దేవస్థానం చైర్మన్ కుంభం కుమార్, పార్టీ మండల మాజీ అధ్యక్షుడు గట్టు రమేశ్, అంబటి కిషన్ రాజు, కనకం రమేశ్, పల్లె రవిగౌడ్, మంద రాజు, పొగాకు సోమయ్య, బొల్లు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.