నమస్తే నెట్వర్క్, ఏప్రిల్ 6 ;రైతుల కోసం బీఆర్ఎస్ నేతలు కదంతొక్కారు. పంటలకు మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్ ఇవ్వడంతో పాటు ఎండిపోయిన పంటలకు రూ.25వేల నష్టపరిహారం చెల్లించాలనే డిమాండ్తో రైతులకు మద్దతుగా శనివారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రైతు దీక్షలు నిర్వహించారు. ఎక్కడికక్కడ నియోజకవర్గ కేంద్రాల్లో ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొని కాంగ్రెస్ అసమర్థ పాలనపై దుమ్మెత్తి పోశారు. ఎండిపోయిన వరి, మక్కజొన్న మెదలతో దీక్షా శిబిరంలో బైఠాయించి ప్లకార్డులు చేతబట్టుకొని నినాదాలతో హోరెత్తించారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా శనివారం రైతు నిరసన దీక్షలు నిర్వహించారు. జనగామ జిల్లా పాలకుర్తిలోని రాజీవ్ చౌరస్తాలో చేపట్టిన దీక్షలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పాల్గొన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో పంటలు ఎండిపోలేదని అత్తాకోడళ్లు మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డికి ముందుచూపు లేకపోవడం, నిర్లక్ష్యంతోనే పంటలు ఎండిపోయాయని విమర్శించారు. ఎండిన పంటలను చూపించేందుకు తాను సిద్ధమని, అత్తాకొడళ్లు సిద్ధమా అని సవాల్ విసిరారు. రేవంత్రెడ్డి సీఎం పదవి చేపట్టిన నాటి నుంచి రాష్ట్రంలో 216మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు.
రాష్ట్రంలో ఎండిన పంటలకు రూ.25వేల ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతులు ఆరుగాలం పండించిన వరి పంటలకు రూ.500 బోనస్ ప్రకటించాలని కోరారు. అలాగే మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురులో మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్తో కలిసి మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్ దీక్షలో పాల్గొన్నారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో ఎన్నడూ పొలాలు ఎండిపోయిన దాఖలాల్లేవన్నారు. కాళేశ్వరంలో నీళ్లున్నా వదలకుండా రైతుల పొలాలు ఎండిపోయేలా చేయడమే కాకుండా కేసీఆర్ను బదనాం చేస్తున్నాడని సత్యవతి మండిపడ్డారు. అలాగే మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డితో కలిసి జనగామ జిల్లాకేంద్రంలోని ఆర్టీసీ చౌరస్తా వద్ద, స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ కేంద్రంలో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి పాల్గొన్నారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన ప్రతీ హామీని వెంటనే నెరవేర్చాలని పల్లా డిమాండ్ చేశారు. రైతులకు వెంటనే రూ.2లక్షల రుణమాఫీ చేయాలని, రైతుబంధు నిధులు ఖాతాల్లో జమ చేయాలని, కౌలు రైతులకు హామీ మేరకు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ధాన్యానికి మద్దతు ధర అందించడంతోపాటు క్వింటాల్కు రూ.500 బోనస్ చెల్లించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలన వల్ల సాగునీరు అందక పంట నష్టపోయిన రైతాంగానికి ఎకరాకు రూ.25 వేల చొప్పున పరిహారం అందించాలన్నారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలోని అంబేద్కర్ సెంటర్లో మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ పాల్గొని 420 హామీలతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లోనే అన్ని రంగాల్లో విఫలమైందన్నారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డితో కలిసి మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత పాల్గొని అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ తీరును ప్రజలు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఎండగట్టాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాతే రైతుల ఆత్మహత్యలు ఎక్కువయ్యాయని ఆ పార్టీకి రైతుల ఉసురు తప్పక తాకుతుందని భూపాలపల్లిలో నిర్వహించిన దీక్షలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లో మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ పాల్గొని కాంగెస్ సర్కారు తీరుపై మండిపడ్డారు.