పరకాల, సెప్టెంబర్ 23 : సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పాలన సాగుతోందని, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి విపక్ష పార్టీల నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. హనుమకొండలోని ఆయన నివాసంలో విపక్ష పార్టీలకు చెందిన పలువురు నాయకులు బీఆర్ఎస్లో చేరారు. వీరికి ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి, సంక్షేమం కొనసాగుతోందని, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులవుతున్న విపక్ష పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములయ్యేందుకు బీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు.
ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. సీఎం కేసీఆర్ పాలనను ఇంటింటికీ తిరిగి వివరించాలన్నారు. సీఎం కేసీఆర్ మరో పదికాలాల పాటు అధికారంలో ఉంటేనే ప్రజలకు మంచి జరుగుతుందన్నారు. నియోజకవర్గంలో విపక్ష పార్టీలు కనుమరుగు కానున్నాయన్నారు. ప్రతిపక్షాల కుట్రలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులదేనన్నారు.
కాగా, బీఆర్ఎస్ పార్టీలో చేరిన వారిలో మండలంలోని వెల్లంపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు అన్వర్ పాషా, బీజేపీకి చెందిన వేమునూరి వెంకటేశ్వర్లు, వైఎస్ఆర్టీపీ పట్టణ మహిళా అధ్యక్షురాలు ఏకు కృష్ణవేణి, మండల అధ్యక్షురాలు సీహెచ్ లావణ్య, ఆటో యూనియన్ అధ్యక్షుడు జూపాక ప్రశాంత్, మండల యూత్ అధ్యక్షుడు గూడెపు రాజ్కుమార్ తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్చైర్మన్ రేగూరి విజయపాల్ రెడ్డి, దళితబంధు కమిటీ పట్టణ కన్వీనర్ సోదా రామకృష్ణ, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మడికొండ శ్రీను, నేతాని శ్రీనివాస్రెడ్డి, సింగిడి రాజ్గోపాల్రెడ్డి, వెల్లంపల్లి సర్పంచ్ వీ కృష్ణ, నాయకులు జిన్నా రామకృష్ణారెడ్డి, బొట్ల నరేశ్, ఏకు కార్తీక్, జన్నారపు మహేశ్ పాల్గొన్నారు.