Telangana Budget | రాష్ట్ర ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో స్కాములు తప్ప స్కీములు లేవని రైతుబంధు వరంగల్ జిల్లా మాజీ కోఆర్డినేటర్ ఎల్లావుల లలిత యాదవ్ విమర్శించారు. శుక్రవారం గ్రేటర్ వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సమీపంలోని బాలాజీ నగర్లో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు కేతిరి రాజశేఖర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరైన లలిత యాదవ్ మాట్లాడుతూ.. బడ్జెట్లో మహాలక్ష్మి పథకానికి రూ.2500 మాటే లేదని, కౌలు రైతులపై కనికరం చూపలేదని, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు గత బడ్జెట్ కంటే ఈసారి కోత విధించారని విమర్శించారు.
ఆరు గ్యారంటీలు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం కాలం గడుపుతుంది.. కానీ ఆరు పైసలు కూడా ఖర్చు చేయలేదని అన్నారు. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా డొల్లగా ఉంది, అందులో పెద్ద మోసం ఉందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి కోసం ఖర్చు చేసిన నిధులను చూపాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సుమారు రూ.3.85 లక్షల కోట్లు ఖర్చు చేసి పెద్ద ప్రాజెక్టులు పూర్తి చేశామని గుర్తుచేశారు. వరంగల్ హెల్త్ సిటీ కోసం రూ.1500 కోట్లతో 24 అంతస్తుల భవనం నిర్మించామన్నారు. దేవాదుల ప్రాజెక్టుకు రూ15వేల కోట్లు ఖర్చు చేసి పూర్తి చేశామన్నారు.
కాంగ్రెస్ బడ్జెట్ జీరో బడ్జెట్ అని లలిత యాదవ్ విమర్శించారు. అసెంబ్లీలో ప్రాంత సమస్యలు చెప్పేందుకు స్థానిక ఎమ్మెల్యేకు అవకాశం లేక, మంత్రులను అడగాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో గతంలో మంజూరు చేసిన రోడ్లకు నిధులు కేటాయించడం లేదని మండిపడ్డారు. గతంలో అసెంబ్లీలో సమస్యలు లేవనెత్తితే సమాధానాలు వచ్చేవి, ఇప్పుడు అలాంటిది లేదని అన్నారు. గతంలో ఒక కాంట్రాక్టర్ పిలిస్తే పదిమంది వచ్చేవారు. ఇప్పుడు పరిస్థితి మారిందని అన్నారు. రైతుబంధు ఇవ్వకపోవడంతో ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకం తగ్గిందని తెలిపారు. SDF నిధులు కేవలం కాంగ్రెస్ పార్టీ సర్పంచులకే ఇస్తున్నారని మండిపడ్డారు.