కరీమాబాద్, నవంబర్ 19: తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మళ్లీ కేసీఆరే సీఎం కావాలని బీఆర్ఎస్ వరంగల్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. వరంగల్ 32వ డివిజన్లో ఆదివారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నన్నపునేని మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. అన్ని వర్గాల ప్రజలకు బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలుస్తున్నదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో, రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అండదండలతో తూర్పును గొప్పగా అభివృద్ధి చేశానన్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా పనులు చేసినట్లు చెప్పారు. ప్రతి ఇంటికీ తాగునీరు అందించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. ప్రజలు ఓటుతో ప్రతిపక్షాలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. తూర్పులో మరోమారు గులాబీ జెండాను ఎగురవేసేందుకు ప్రజలు సిద్ధం కావాలని కోరారు. ఎంపీ పసునూరి దయాకర్ మాట్లాడుతూ తెలంగాణకు సీఎం కేసీఆర్ శ్రీరామరక్ష అన్నారు. తూర్పు మరింత అభివృద్ధి చెందాలంటే మరోమారు నన్నపునేనిని ఆశీర్వదించాలన్నారు. ప్రచారంలో భాగంగా మహిళలు బతుకమ్మలు, బోనాలు, మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే ప్రతి ఒక్కరిని కలిసి ఆప్యాయంగా పలకరించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ పల్లం పద్మ, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు పొగాకు సందీప్, మాజీ కార్పొరేటర్లు నాగపురి కల్పన, పల్లం రవి, డివిజన్ ఇన్చార్జి నాగపురి సంజయ్బాబు, నాయకులు జబ్బార్, పరదేశి రాజేశ్, బత్తుల కుమార్, రాజమణి, బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నాయి.
గిర్మాజీపేట: సంక్షేమ ప్రభుత్వానికే ప్రజల సంపూర్ణ మద్దతు ఉందని, వచ్చే ఎన్నికల్లో ఇది నిజమవుతుందని, ప్రజలంతా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీఆర్ఎస్ వైపే ఉన్నారని నన్నపునేని నరేందర్ అన్నారు. శనివారం రాత్రి బీజేపీ, బీజేవైఎం నాయకులు బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా శివనగర్లోని తన క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ నాయకులు భూపాల్, ప్రసాద్ ఆధ్వర్యంలో బీజేపీ రజక సెల్ జిల్లా కన్వీనర్ కొత్తపల్లి రాజేశ్, బీజేవైఎం జిల్లా సెక్రటరీ సురేశ్, ఓబీసీ మోర్చా డివిజన్ అధ్యక్షుడు రామరాజు, బూత్ ప్రెసిడెంట్ యాట సురేశ్, బీజేవైఎం నాయకులు బోయిని మహేశ్, సురేశ్, గుండం ప్రసాద్, కొమురవెళ్లి శామ్యూల్, ఆకుల రమేశ్, ఒంటెల ప్రతాప్ను ఎమ్మెల్యే బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. ఇంటింటికీ వెళ్లి బీఆర్ఎస్ గెలుపు కోసం కృషి చేస్తామని పార్టీలో చేరిన వారు అన్నారు.
కరీమాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ టీచర్స్ యూనియన్కు అన్ని విధాలా అండగా ఉంటానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఇచ్చారు. ఫోర్టురోడ్డులోని రోటరీక్లబ్లో తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ టీచర్స్ యూనియన్ వార్షికోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా నన్నపునేని పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ టీచర్స్ యూనియన్ సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానన్నారు. ఎన్నికల్లో తనకు మద్దతు ప్రకటించిన యూనియన్కు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం నన్నపునేనిని వారు గజమాలతో సత్కరించారు.
పోచమ్మమైదాన్: ఎమ్మెలే నన్నపునేని నరేందర్కు మద్దతుగా 12వ డివిజన్లోని పలు కాలనీల ప్రజలు ఏకగ్రీవంగా తీర్మానాలు చేసి, ఎమ్మెల్యే నరేందర్తోపాటు ఎంపీ పసునూరి దయాకర్కు తీర్మాన ప్రతులు అందజేశారు. తూర్పు నియోజకవర్గంలోని అన్ని కాలనీలు గొప్పగా అభివృద్ధి చెందాయని, తమకు అండగా ఉంటున్న ఎమ్మెల్యేను గెలిపిస్తామని స్పష్టం చేస్తూ ఏకగ్రీవ తీర్మానాలు చేశారు. డివిజన్లోని కట్టమైసమ్మ పరపతి సంఘం, స్నేహనగర్, వీవర్స్ కాలనీ, ఉమ్మడి డాక్టర్స్ కాలనీతోపాటు అనుబంధ కాలనీలన్నీ మూకుమ్మడిగా మద్దతు వ్యక్తం చేస్తూ ఆమోద పత్రాలను వారికి అందజేసి, నరేందర్ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ కావటి కవితా రాజు, ఎన్నికల డివిజన్ ఇన్చార్జి యెలుగం శ్రీనివాస్, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు సోల రాజు, యూత్ నాయకులు రామ్కీ యాదవ్, స్నేహనగర్ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు గుర్రం చంద్రశేఖర్, కాశెట్టి వేణు, బండారి శ్రీనివాస్, యతిరాజు నర్సింహ పాల్గొన్నారు.
వరంగల్ 22వ డివిజన్ బ్యాంకు-2, శాంతినగర్ కాలనీవాసులు వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్తో కలిసి ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కాలనీవాసులు ఎమ్మెల్యేకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ స్వీట్లు తినిపించారు. అలాగే, కారు గుర్తుకే ఓటు వేసి మళ్లీ గెలిపిస్తామంటూ మద్దతు తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్ బస్వరాజు కుమారస్వామి, డివిజన్ ఇన్చార్జి మావురపు విజయభాస్కర్రెడ్డి, కార్పొరేటర్లు సురేశ్కుమార్ జోషి, కావటి కవిత, డివిజన్ అధ్యక్షుడు కంచర్ల శివ, సోల రాజు, యాకూబ్ పాల్గొన్నారు.
ఖిలావరంగల్: వరంగల్, హనుమకొండ పట్టణ పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో ఖిలావరంగల్లో కార్తీకమాస వన భోజన మహోత్సవం నిర్వహించారు. పద్మశాలీ కుటుంబాలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నాయి. అనంతరం రామాయణ ఇతిహాసాలకు సంబంధించి నృత్య రూపకాలతో కూడిన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఉత్సవానికి ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, మేయర్ గుండు సుధారాణి హాజరయ్యారు.