‘బావులు, బోర్లు, చెరువులల్ల నీళ్లు అడుగంటినయ్.. పొట్ట దశకు వచ్చిన వరికి నీళ్లందక పంటలు ఎండిపోయినయ్.. చేతికందే దశలో పంటను కాపాడుకునేందుకు అరిగోస పడుతున్నం.. బీఆర్ఎస్ గౌర్మెంటు ఉన్నప్పుడు కాల్వల నీళ్లు వచ్చేటియి. చెరువులు, కుంటలు నిండుగ ఉండి బాయిల నీళ్లకు ఢోకా లేకుండేది. ఏదో చేస్తదని నమ్మి ఓటేస్తే కాంగ్రెస్ను నట్టేట ముంచుతాంది. కనీసం సాగునీళ్లియ్యక అరిగోస పెడుతాంది. పెట్టుబడుల కోసం చేసిన అప్పులు మీదవడ్డయ్. మమ్ముల దేవుడే ఆదుకోవాలె’ అని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎప్పటిలా పంటలు పండుతాయనే నమ్మకంతో ఈ యాసంగి వరి సాగు చేసిన రైతులకు, కాలువల ద్వారా నీళ్లు రాక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కళ్లెదుటే పంటలు ఎండిపోతుండడంతో కన్నీళ్లను దిగమింగుతూ చేసేదేంలేక పైర్లల్లో పశువులను మేతకు తోలుతున్నారు. ఒక్క జనగామ మండలంలోనే 20వేల ఎకరాలకు గాను, దాదాపు 8వేల ఎకరాల్లో వరి ఎండిపోయింది. ఇలా జనగామ జిల్లావ్యాప్తంగా వేలాది ఎకరాల పంట కరువు కోరల్లో చిక్కుకుంది.
ఈ దుస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులకు బాసటగా నిలిచేందుకు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని దేవరుప్పుల మండలానికి వస్తున్నారు. మండలంలోని ధరావత్తండా, ధర్మాపురంలో ఎండిపోయిన పంటలను స్వయంగా పరిశీలించి రైతుల బాధలను తెలుసుకోనున్నారు. రైతులు, కూలీలను కలిసి వారి కష్టాలను అడిగి తెలుసుకొని ఓదార్చనున్నారు.
ఉదయం 8గంటలకు ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రం నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి జనగామ, నెల్లుట్ల మీదుగా 10.30 గంటల వరకు సూర్యాపేట ప్రధాన రోడ్డులోని ధరావత్తండా, ధర్మాపురంలో పంటలను సందర్శిస్తారు. మార్గమధ్యంలో ఎక్కడైనా ఎండిన పంటలు కనిపిస్తే ఆగి పరిశీలించే అవకాశం ఉంది. కాగా కేసీఆర్కు చేర్యాల, బచ్చన్నపేట, జనగామ, నెల్లుట్ల వద్ద ఘన స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ శ్రేణులు సన్నాహాలు చేస్తున్నారు.
– నమస్తే తెలంగాణ జనగామ నెట్వర్క్, మార్చి 30
జనగామ రూరల్, మార్చి 30 : మేము రెండెకరాల్లో వరి సాగు చేసినం. నీళ్లు లేక ఎకరం పూర్తిగా ఎండిపోయింది. పక్కనే కాలువ ఉన్నా నీళ్లు రాక పొలం బీటలువారి పంట చేతికిరాకుండా పోయింది. బోర్లు, బావులు కూడా అడుగంటినయ్. ఉన్న నీళ్లను పశువులకు, మిగతా పొలానికి వంతుల వారీగా వాడుకుంటున్నం. ఎండిపోయిన పంటను మేకలకు మేత కోసం వాడుతున్నం.
-ల్యాగల భాను, యువరైతు, పెద్దరాంచర్ల, జనగామ మండలం
జనగామ రూరల్, మార్చి 30 : మాకు నాలుగెకరాలు ఉంది. మూడు ఎకరాల్లో వరి ఏసినం. నీళ్లందక పొట్ట దశలో ఎకరం, ఈనిన తర్వాత ఎకరం మొత్తం రెండెకరాలు ఎండిపోయింది. ఉన్న ఎకరానికి విడుతల వారీగా నీరందిస్తున్నం. పక్కనే నాగిరెడ్డి కుంట చెరువున్నా అదిప్పుడు చుక్క నీరు లేక ఎండిపోయింది. పంటను కాపాడుకునేందుకు గోస పడుతున్నం.
-చెన్నూరి భాగ్య, రైతు, సిద్దెంకి గ్రామం, జనగామ మండలం
రఘునాథపల్లి మార్చి 30: నాకు ఊర్లె ఎనిమిదెకరాలు ఉంటే మూడున్నర ఎకరాల్లో వరి పంట వేసిన. ఎనిమిదేండ్ల సంది బోరు ఎత్తిపోయింది లేదు. పెట్టుబడికి ఇబ్బందులు కూడా కాలే. ఈ యేడు వరి పొట్ట దశకు వచ్చే సమయంలో బోర్ల నీళ్లు అడుగంటినయ్. రెండెకరాల్లో పశువులను మేపినం. ఎకరంనర చేతికస్తదనుకుంటే బోరు పూర్తిగా ఎండిపోయింది. నేను బోరు తవ్వించి ఎనిమిదేళ్లయింది. ఎప్పుడూ ఎండిపోలే. చెరువులు, కాల్వల నీళ్లు రాక బోర్లు వట్టిపోయినయ్. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చెరువులు, కుంటలు నింపింది. ఇప్పటి ప్రభుత్వానికి రైతులకు సాగునీళ్లియ్యాలన్న సోయే లేదు. మమ్ముల దేవుడే ఆదుకోవాలె.
– ముక్క పరశురాములు, రైతు, మేకలగట్టు, రఘునాథపల్లి మండలం
చిల్పూరు, మార్చి 30 : నేను నాలుగు ఎకరాల్లో వరి వేసిన. పంట చేతికందే సమయంలో నీరు లేక మొత్తం ఎండిపోయింది. దాదాపు రూ.2లక్షలు నష్టం. నాలుగెకరాల్లో మూడు బోర్లు వేస్తే ఒక్కదాంట్ల నీళ్లు పడ్డయ్. చెరువుల నీళ్లుంటెనే బోరు పోస్తది. ఈ సారి చెరువులకు నీళ్లు రాక బోరు వట్టిపోయింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి ఊర్లె చెరువులను కాలువలతో నింపింది. రైతులకు నీళ్ల గోస లేకుండ చేసింది. కాంగ్రెస్ వచ్చిన కాన్నుంచి రైతులకు నీళ్లులేవు, రైతుబంధు లేదు..రుణమాఫీ లేదు. ఎండిన పంటలకు ప్రభుత్వమే పరిహారం అందించి ఆదుకోవాలె.
– భోగి వెంకటమల్లయ్య, రైతు, మల్కాపూర్, చిల్పూరు మండలం
దేవరుప్పుల, మార్చి 30 : ఎప్పటిలెక్క ఈసారి కూడ నీళ్లొస్తయన్న ఆశతో రెండెకరాలు నాటు పెడితె మొత్తం ఎండిపోయింది. గొడ్లు మేపినం. ఇంతపనైతదని అస్సలు అనుకోలె. మునుపటి తీరుగనే నీళ్లొస్తయని అనుకున్నం. సుక్క నీళ్లు రాలె. కాంగ్రెస్ సర్కారు రాంగనె కట్క తిప్పినట్టే బందైనయ్. అప్పుల పాలైనం. ఇగ పట్నంల ఉప్పరి పనికి పోవుడే గతి. ఇంత అధ్వానం అయితదనుకోలె. నల్ల నీళ్లు కూడ సగం సగమే వస్తున్నయ్. అవిసుత రాకపోతే బిస్తరు కట్టుడే అయితదేమో.
– కున్సోతు కమలమ్మ, చింతబావి తండా
నర్మెట, మార్చి 30 : కేసీఆర్ సర్కారు ఉన్నప్పుడు కాల్వల నుంచి మస్తు నీళ్లు వచ్చేది. ఇప్పుడు ఉన్నదాంట్ల సగం వరకు ఎండిపోయింది. నాకున్న నాలుగు ఎకరాలల్ల రెండెకరాల పొలం ఎండిపోయింది. నా భూమిలో ఒక్క బోరు ఉంది. అప్పుడేమో ఐదు ఎకరాలకు పెట్టుబడికి లక్ష దాటింది. భూమిలో నీళ్లు దిగిపోవడంతో మోటరు కూడా సక్కడ పోస్తలేదు. మా దగ్గర కాల్వ పని మొత్తం కాలేదు. ఇంతకుముందేమో కాల్వ లేకున్నా నీళ్లు వచ్చేది. ఇప్పుడు ఎవ్వరిని అడిగినా మాకు నీళ్లు వస్తలేవు అంటున్నరు. కేసీఆర్ ఉన్నప్పుడే మాకు నయం ఉండే. ఆయన రైతులకు రంది లేకుంట చేశిండు.
– భూక్యా సక్రు, సూర్యబండ తండా, నర్మెట మండలం
నర్మెట, మార్చి 30 : నాకున్నది మూడెకరాల పొలం. ఎండలు బాగా కొడుతుండడం వల్ల ఉన్న ఒక్క బోరు సక్కగ పోస్తలేదు. పోయినసారి కంటే సగం వరకు బోరు పోస్తలేదు. దీంతో పంటను కాపాడుకునేందుకు లక్ష వరకు ఖర్చు చేసి నా పొలంలో రెండు బోర్లు వేశాను. రెండింట్లో ఒక్క సుక్క నీరు రాలేదు. వరి పంట పూర్తిగా ఎండిపోయింది. జొన్న చేను కూడా వేసిన. అది కూడా నీరు లేక ఎండిపోతాంది. మమ్ములను ప్రభుత్వం ఆదుకొని ఆర్థిక సహాయం అందించాలి.
– భూక్యా దేవా, బండతండా, నర్మెట మండలం
నర్మెట, మార్చి 30 : కాల్వలు మంచిగ లేక మాకు ఒక్క సుక్క కూడా గోదావరి నీళ్లు వస్తలేవు. మాకు ఐదు ఎకరాల భూమి ఉంది. అందులో రెండు బోర్లు ఉన్నాయి. ఐదు ఎకరాల్లో నాటు వేశాం. మొదట్లో బోర్లు మంచిగానే ఉన్నా .. ఈ మధ్యలో పూర్తిగా ఎండిపోయినయ్. దీంతో ఐదెకరాల పొలం మొత్తం ఎండిపోయింది. ఎండిన పొలం పశువులకు మేత అయింది. మా తండాకు గోదావరి నీళ్లు వచ్చేందుకు కాల్వలు కూడా సరిగా లేవు. వెంటనే పూర్తి చేసి మాకు నీళ్లు ఇయ్యాలె. ఎండిపోయిన రైతుల పొలాలను పరిశీలించి ప్రభుత్వం ఆదుకోవాలి.
– భూక్యా రమేశ్, బండతండా, నర్మెట మండలం
బచ్చన్నపేట, మార్చి 30 : మాది జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం లింగంపల్లి గ్రామం. నా పేరు పాశం శ్రీనివాస్. గ్రామంలో నాకున్నది ఆరెకరాల వ్యవసాయ భూమి. ఇదివరకు నాలుగెకరాల్లో వరి పెట్టిన మంచిగనే చేతికొచ్చింది. కానీ ఈసారి రెండెకరాలే సాగు చేసినం. బాయి ఎండిపోయింది. వేసిన రెండు బోర్లు ఎత్తిపోయినయ్. కండ్ల ముంగటనే కష్టపడి వేసిన వరి ఎండిపోయింది. చేసేదేమీ లేక పశువులను మేపుతున్న. ఇంతకుముందు గోదావరి నీళ్లతోటి చెరువులు, కుంటలు నింపుట్ల బావుల్లో నీళ్లు ఎప్పుడూ ఉండేది. బోర్లు కూడా మస్తు పోసేది. పదేండ్లు ఎవుసం బంగారం లెక్క చేసినం. ఇప్పుడే ఇంత కరువొచ్చింది. ఇన్ని తిప్పలు ఎన్నడూ చూడలే. పంటలకు తెచ్చిన పెట్టుబడి మీద పడ్డది. కనీసం తిండి మందం అన్న వస్తయ్ అనుకున్నం. కానీ గిట్ల పశువులకు మేత అయితదనుకోలే. ఇంత కన్నా దౌర్భాగ్య పరిస్థితి రైతుకు ఎప్పుడూ రావద్దు. సర్కారు ఆదుకోవాలె. అన్నదాతలకు అండగా నిలబడి ధైర్యమియ్యాలె.
– పాశం శ్రీనివాస్, రైతు, లింగంపల్లి, బచ్చన్నపేట మండలం
పాలకుర్తి, మార్చి 30 : నాకు రెండెకరాల 40గుంటల భూమి ఉంది. అందులో వరి వేసిన. మొదట్లో నీళ్లు మంచిగనే వచ్చేది. తర్వాత బోరు పారక పంట మొత్తం ఎండిపోయింది. రూ.20వేల దాకా పెట్టుబడి పెట్టిన. పంట పూర్తిగా ఎండిపోవడం వల్ల ఏం జేయాల్నో అర్థమైతలేదు. ఇదివరకు ఎన్నడూ గిట్ల కాలే. వ్యవసాయాన్ని నమ్ముకొని బతుకుతున్నం. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలె.
– ఆజ్మీరా సోమ్లు, రైతు, హఠ్యాతండా, పాలకుర్తి మండలం