ములుగు, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ) : ఆ కార్యాలయానికి ప్రజలు నేరుగా వెళ్తే ఏ పనీ జరుగదు.. ఏ చిన్న పనైనా బ్రోకర్లను కలవాల్సిందే.. వారు చెప్తేనే అటెండర్ నుంచి అధికారుల వరకు పనిచేస్తారు. ఇదీ ములుగు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రోజూ జరుగుతున్న తంతు. నిన్న మొన్నటి వరకు ఎవరికి వారుగానే ఉన్న డాక్యుమెంట్ రైటర్లు ప్రస్తుతం సిండికేట్గా మారారు. పనికో రేటు ఫిక్స్ చేసి, కార్యాలయానికి వచ్చే ప్రజల నుంచి ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నారు.
అనంతరం అధికారులు, సిబ్బందితో పనులు చేయించి వాటాలు పంచుతున్నారు. ఏ చిన్న పనైనా పెద్ద హడావుడి చేస్తూ అందినకాడికి దోచుకోడం నిత్యం జరుగుతున్నది. దందా బాగుండడంతో డాక్యుమెంట్ రైటర్లు కార్యాలయం చుట్టూ దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారు. భూమి, మ్యారేజ్ రిజిస్ట్రేషన్ కోసం నేరుగా కార్యాలయానికి వెళ్లిన వారికి బ్రోకర్లను ఆశ్రయించాలని సిబ్బంది సూచిస్తున్నారు. ఇందుకు ఉదాహరణగా మ్యారేజ్ రిజిస్ట్రేషన్ కోసం స్రవంతి-రాజేశ్ దంపతులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని కార్యాలయానికి రాగా అటెండర్ డాక్యుమెంట్ రైటర్ను కలువాలని సూచించారు.
ఎదురుగా ఉన్న డాక్యుమెంట్ రైటర్ వద్దకు వెళ్లి కలువగా రూ.700 ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఎందుకివ్వాలని వారు ప్రశ్నించగా కార్యాలయ ఖర్చుల నిమిత్తం అధికారులు తీసుకొమ్మన్నారని, ఇక్కడ ఇదే పద్ధతి ఉంటుందని చెప్పడంతో వారు డబ్బులు చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకొని వెళ్లాల్సి వచ్చింది. అనంతరం ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో జిల్లా వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరుగుతున్న అవినీతి చర్చనీయాంశంగా మారింది.
ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకొని అన్ని పత్రాలతో ప్రజలు వస్తున్నప్పటికీ కార్యాలయంలో పనిచేసే సిబ్బంది మాత్రం బ్రోకర్లు సూచించిన వారికే ప్రాధాన్యత ఇస్తున్నారు. నేరుగా వచ్చిన వారిని గంటల తరబడి కూర్చోబెట్టడంతో చివరకు వారు సైతం బ్రోకర్లను ఆశ్రయించాల్సి వస్తున్నది. వివిధ రాజకీయ పార్టీల్లో కీలక పదవుల్లో ఉంటూనే డాక్యుమెంట్ రైటర్లుగా చలామణి అవుతూ పైసలు దండుకుంటున్నారు. అటెండర్లు సైతం కార్యాలయం ముద్ర వేస్తే రూ .500 నుంచి రూ.1000 వరకు వసూలు చేస్తున్నారు.
డాక్యుమెంట్ నంబర్లను రిజిస్టర్లో నమోదు చేయాల్సిన అటెండర్లు పెన్సిల్తో సంబంధిత డాక్యుమెంట్ రైటర్ పేరు, ఎన్ని డాక్యుమెంట్లు నమోదయ్యాయో రాసుకుంటున్నారు. కార్యాలయం వేళలు ముగిసిన తర్వాత అధికారులు, సిబ్బంది వాటాలు తీసుకొని వెళ్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద డాక్యుమెంట్ రైటర్ల దందాకు అడ్డుకట్ట వేయకుంటే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుంది. ప్రజలే భూమి, మ్యారేజ్ రిజిస్ట్రేషన్ల కోసం నేరుగా కార్యాలయానికి వచ్చేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.