ఐనవోలు, జనవరి 12: భక్తుల కొంగు బంగారం ఐనవోలు మల్లన్న బ్రహ్మోత్సవాలకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తిచేసింది. ధ్వజారోహణంతో శుక్రవారం జాతర ప్రారంభం కానుంది. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు జాతరలో ఏర్పాట్లపై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యే అరూరి రమేశ్ పర్యవేక్షణతో పనులు వేగంగా సాగాయి. శాశ్వత, తాత్కాలిక మరుగుదొడ్లు, బట్టలు మార్చుకునే గదులతోపాటు కుడా ఆధ్వర్యంలో నిర్మించిన స్వాగత తోరణాలతో దేవాలయం కొత్త శోభ సంతరించుకున్నది. జాతరకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలని మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యే అరూరి రమేశ్ ఆదేశించడంతో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఆలయానికి దారులు ఇవే..
ఆలయ భూమి చుట్టూ ‘కుడా’ ఆధ్వర్యంలో ప్రహరీ నిర్మించారు. ఆలయంలోకి ప్రవేశం ఒక తూర్పు వైపు నుంచి మాత్రమే ఉంటుంది. వరంగల్ నుంచి వచ్చే భక్తులు తహసీల్దార్ కార్యాలయం ముందు నుంచి బైపాస్ రోడ్డు ద్వారా ఐనవోలు పాఠశాల వెనుక భాగం వాహనాలు పార్కింగ్ చేసుకోవాలి. కాలి నడుక ద్వారా తూ ర్పు ముఖం నుంచి లోపలికి ప్రవేశించాలి. స్టేషన్ఘన్పూర్ నుంచి వయా కూనూరు, గర్మిళ్లపల్లి నుంచి వచ్చే భక్తులు తాటి వనం దగ్గర వాహనాలను పార్కింగ్ చేయాలి. కాలి నడకన దేవాలయ తూర్పు వైపు నుంచి ఆలయంలోకి వెళ్లాలి. అదేవిధంగా హైదరాబాద్ పెద్దపెండ్యాల వయా వెంకటాపురం నుంచి వచ్చే భక్తులు వెంకటాపురం రోడ్డు ఒంటిమామిడిపల్లి రైస్ మిల్లు వద్ద వాహనాలు పార్కింగ్ చేయాలి.
కాలి నడకన తెలంగాణ తల్లి సెంటర్ నుంచి తూర్పు వైపు నుంచి ఆలయంలోకి వెళ్లాలి. తిమ్మాపురం క్రాస్ నుంచి వయా సింగారం, కొండపర్తి గ్రామాల నుంచి వచ్చే భక్తులు ఒంటిమామిడిపల్లి రోడ్డు ఐనవోలు 33/11 కేవి సబ్ స్టేషన్ దగ్గర వాహనాలను పార్కింగ్ చేయాలి. కాలినడకన తూర్పు వైపు నుంచి ఆలయానికి వెళ్లాలి. ఆర్టీసీ బస్సుల ద్వారా వచ్చిన భక్తులు కూడా తెలంగాణ తల్లి సెంటర్ వద్ద బస్సు దిగి కాలి నడకన తూర్పు వైపు నుంచి దేవాలయ ఆవరణంలోకి ప్రవేశించి, తిరిగి తూ ర్పు వైపు నుంచే బయటకు వెళ్లాల్సి ఉంటుంది.