క్షణం ఆగకుండా పొద్దంతా కురిసిన వానతో వరంగల్, హనుమకొండ జిల్లాలు తడిసి ముద్దయ్యాయి. రెండు జిల్లాల్లో వరుసగా 2.7, 2.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, అత్యధికంగా నల్లబెల్లిలో 5.3, అత్యల్పంగా రాయపర్తిలో 1.2సె.మీ వర్షం కురిసింది. నగరంలోని మూడో డివిజన్ పరిధిలోని పైడిపల్లిలో వర్షానికి తడిసి గోడ కూలడంతో ఒకరు మృతిచెందారు. అప్రమత్తమైన అధికారులు ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టారు. అలాగే ట్రైసిటీలోని నాలాలు, లోతట్టు కాలనీలను ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్, మేయర్ గుండు సుధారాణి, గ్రేటర్ కార్పొరేషన్ కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా పరిశీలించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే వరంగల్లో 24 గంటల టోల్ ఫ్రీ నంబర్ 9154252937 ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ప్రావీణ్య ప్రకటించారు. కాగా, వానలతో చెరువుల్లోకి వరద నీరు చేరుతుండడంతో రైతులు వరి నాట్లు వేసేందుకు సమాయత్తమవుతున్నారు.
– వరంగల్, జూలై 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ వరంగల్, (నమస్తేతెలంగాణ)
వరంగల్, జూలై 19 (నమస్తే తెలంగాణ): మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జిల్లా తడిసి ముద్దయింది. వరదలతో ముంపు గ్రామాలు, కాలనీలు అతలాకుతలమయ్యాయి. జనం ఇండ్ల నుంచి బయటకు వెళ్లలేదు. ఇంటి గోడ కూలిన ఒకరు మృతిచెందారు. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. వరంగల్లో సహాయక చర్యలు చేపట్టారు. ముంపు ప్రాంతాల ప్రజలను పునరావస కేంద్రాలకు తరలించేందుకు నిర్ణయించారు. జిల్లాలో సోమవారం రాత్రి నుంచి వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తున్నది. బుధవారం జిల్లాలో 359.6 మిల్లమీటర్ల వర్షాపాతం నమోదైంది. నల్లబెల్లి మండలంలో భారీ వర్షం కురిసింది. జిల్లాలో అత్యధికంగా ఇక్కడ 70.2 మిల్లీమీటర్ల భారీ వర్షం నమోదైంది. మండలంవారీగా ఖానాపురంలో 41.2, గీసుగొండ, దుగ్గొండిలో 34.6, చెన్నారావుపేటలో 33.4, నర్సంపేటలో 33.2, ఖిలావరంగల్లో 22, వరంగల్లో 20, నెక్కొండలో 17.2, సంగెంలో 16 మిల్లీమీటర్ల వర్షం పడింది. పర్వతగిరిలో 13.4, రాయపర్తిలో 12, వర్ధన్నపేటలో 11.8 మిల్లీమీటర్ల తేలికపాటి వర్షం పడింది. సగటున 27.7 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదైంది. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య సూచించారు. వర్షాలతో ఏవైనా సమస్యలు ఎదురైతే జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ 9154252937కు సంప్రదించాలని తెలిపారు. సిబ్బంది 24గంటలు కంట్రోల్ రూమ్లో అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. బుధవారం వరంగల్లో 3వ డివిజన్ పరిధిలోని పైడిపల్లిలో వర్షానికి తడిసిన గోడ కూలి మీద పడటంతో ఇంట్లో ఉన్న రావిరాకుల విజయ్(38) చనిపోయాడు. సమాచారం అందగానే జీడబ్ల్యూఎంసీ అధికారులు రంగంలోకి దిగారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఎనుమాముల పోలీసులు ఎంజీఎం మార్చురీకి తరలించారు.
క్షేత్రస్థాయిలో కమిషనర్ పర్యటన
జీడబ్ల్యూఎంసీ కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా వరంగల్లోని పలు ప్రాంతాలను సందర్శించారు. ఎన్టీఆర్ నగర్, పన్నెండు మోరీల ప్రాంతంలోని మినీ అండర్బ్రిడ్జి, కీర్తి బార్ ఏరియా, నాగేంద్రనగర్, మైసయ్యనగర్, చాకలి ఐలమ్మనగర్, చిన్నవడ్డెపల్లి కట్ట ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మినీ అండర్బ్రిడ్జి ప్రాంతంలో నీరు నిల్వకుండా చర్యలు తీసుకోవాలని రైల్వే అధికారులతో ఫోన్లో మాట్లాడారు. బల్దియా ఇంజినీరింగ్, రైల్వే అధికారులు సమన్వయంతో పనిచేసి సమస్యను పరిష్కరించాలని అన్నారు. కీర్తి బార్ వద్ద నిర్మాణ పనులు కొనసాగుతున్నందున పైనుంచి వచ్చే నీటి ప్రవాహం కొనసాగేలా చూడాలని, అందులో పేరుకుపోయే చెత్త, సిల్ట్ను ఎప్పటికప్పుడు తొలగించేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ జీడబ్ల్యూఎంసీ సీఎంహెచ్వోను ఆదేశించారు. నాగేంద్రనగర్లో డ్రెయినేజీలో నీటి ప్రవాహానికి ఆటంకం లేకుండా చూడాలన్నారు. మైసయ్యనగర్లో సిల్ట్ తొలగింపు పనులను పరిశీలించిన షేక్రిజ్వాన్ బాషా ఈ ప్రాంతంలో రీ టైనింగ్ వాల్ నిర్మాణం జరుగుతున్నందున కట్ట వైపు నుంచి వచ్చే నీటిని శివనగర్ డక్ట్లోకి మళ్లించాలని జీడబ్ల్యూఎంసీ అధికారులకు చెప్పారు. శిథిలావస్థలో ఉన్న ఇండ్లలో నివసించే వారిని వెంటనే ఖాళీ చేయించాలన్నారు. దేశాయిపేట, ఎస్ఆర్నగర్ ప్రాంతాల నుంచి వచ్చే నీటిని చిన్నవడ్డెపల్లి చెరువులోకి పంపాలని చెప్పారు. చాకలిఐలమ్మ కాలనీ ప్రాంతంలోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి తగిన ఏర్పాట్లు చేయాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అధికారులను ఆదేశించారు. ఆయన వెంట కార్పొరేటర్లు ప్రవీణ్, సురేష్జోషి, సీఎంహెచ్వో రాజేశ్, బయాలజిస్ట్ మాధవరెడ్డి, డీఎఫ్వో శంకర్లింగం, ఎంహెచ్వో జ్ఞానేశ్వర్, ఈఈలు శ్రీనివాస్, సంజయ్కుమార్, ఏసీపీలు శ్రీనివాస్రెడ్డి, ఖలీల్, శానిటరీ సూపర్వైజర్ సాంబయ్య ఉన్నారు.
హనుమకొండ జిల్లాలో 2.2 సెంటీమీటర్ల వర్షపాతం
వరంగల్, జూలై 19(నమస్తే తెలంగాణ ప్రతినిధి): హనుమకొండ జిల్లాలో మూడు రోజులుగా వాన కురుస్తూనే ఉంది. బుధవారం రోజంతా ముసురు పట్టి మోస్తరు వాన పడింది. దీంతో అంతటా నీళ్లు చేరుతున్నాయి. పొలాలు, చెలకల్లో నిండా నీళ్లు కనిపిస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మరో రెండు రోజులు వానలు కొనసాగుతాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. సోమవారం నుంచి బుధవారం రాత్రి వరకు వానలు పడుతూనే ఉన్నాయి. హనుమకొండ జిల్లాలో 2.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
నాలాలను పరిశీలించిన చీఫ్విప్
నయీంనగర్: వర్షాలు కురుస్తున్నందున లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. నయీంనగర్ నాలా (పెద్దమోరీ)తోపాటు రాజాజీనగర్లోని నాలాలను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో ప్రజలు ఉండొద్దని, ప్రభుత్వం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తోందని తెలిపారు. వర్షంతో ఎలాంటి ఘటనలు జరిగినా వెంటనే 18004251980, 9701999645టోల్ ఫ్రీ నంబర్లను సంప్రదించాలని కోరారు. మున్సిపల్ కమిషనర్ రిజ్వాన్ బాషాషేక్, ఆర్డీవో వాసుచంద్ర, ఎంహెచ్వో రాజేశ్, ఈఈ రాజయ్య పాల్గొన్నారు.