పరకాల, ఆగస్టు 14 : పట్టణంలో శ్రావణ మాస బోనాలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. డప్పు చప్పుళ్లు, ఊరేగింపులతో పోచమ్మ తల్లి ఆలయానికి బోనాలతో తరలి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోచమ్మ తల్లికి, పోతు లింగానికి బోనాన్ని సమర్పించి చల్లగా చూడమని వేడుకున్నారు. కుటుంబ సమేతంగా తల్లి ఆశీర్వాదాన్ని తీసుకుని యాటలను, కోళ్లతో మొక్కు లు తీర్చుకున్నారు. కాగా, బోనాల సందడితో ఆలయ ప్రాంగణమంతా భక్తులతో కిటకిటలాడింది.
విశ్వబ్రాహ్మణుల ఆధ్వర్యంలో..
శాయంపేట : మండల కేంద్రంలో విశ్వబ్రాహ్మణులు ఆదివారం పోచమ్మకు బోనాలను సమర్పించారు. ఈ సందర్భంగా మహిళలు, పిల్లలు, పెద్దలు కొత్త దుస్తులు దరించి నెత్తిన బోనం పెట్టుకుని డప్పుచప్పుళ్ళ మధ్య పోచమ్మ ఆలయానికి చేరుకున్నారు. పోచమ్మకు బోనం, నైవేద్యం సమర్పించి తమ కుటుంబాలను సల్లంగా చూడు తల్లీ అంటూ మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం గ్రామశాఖ అధ్యక్షుడు ఉప్పు నూతుల ప్రసాద్, శ్రీరామోజు జయప్రకాశ్, గూటోజు రవీంద్రాచారి, బొల్లోజు రమేశ్, వినుకొండ రాంగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
చీఫ్ విప్ వినయ్భాస్కర్ పూజలు
హనుమకొండ చౌరస్తా : హనుమకొండ బ్రాహ్మణ వాడలోని పోచమ్మ దేవాలయంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు వేముల శ్రీనివాస్, అభినవ్భాస్కర్, అధ్యక్షుడు కొండా శ్రీనివాస్, నిర్వాహకులు అరవింద్, బంటి, సుశీల్ పాల్గొన్నారు.
సోమిడిలో..
కాజీపేట : సోమిడిలో విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్య క్షుడు శృంగారపు భిక్షపతి చారి ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో విశ్వ బ్రాహ్మణులు రాజు, రామ్మోహన్, వెంకన్న, కుమార స్వామి, సుధాకర్, శ్రీను, రవి, గౌతం, వినయ్ చారి, టీఆర్ఎస్ నాయకులు పాలడుగుల శివకుమార్, ప్రభాకర్, సుంచు అశోక్, కుమ్మరి రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.