ములుగు, మార్చి 23 (నమస్తే తెలంగాణ) : ములుగు జిల్లా కోర్టులో సోమవారం ఉదయం బాంబు కలకలం రేపింది. న్యాయమూర్తులు, న్యాయవాదులు, సిబ్బంది, కక్షిదారులు పోలీసుల తనిఖీలు చేసే వరకు కోర్టు బయటే వేచిచూడాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే… ములుగు కోర్టు అధికారిక మెయిల్ ఐడీకి కోర్టులో బాంబు అమర్చినట్లు ఈ నెల 22న ఆదివారం ఉదయం 8.46 గంటలకు మెయిల్ వచ్చింది.
ఆదివారం కోర్టులకు సెలవు కావడంతో సోమవారం వర్కింగ్ డే రోజు కోర్టు వచ్చిన సిబ్బంది మెయిల్ను ఓపెన్ చేసి చూసి భయాందోళనను గురయ్యారు. న్యాయమూర్తులకు సమాచారం అందించారు. డీఎస్పీ కిశోర్కుమార్, సీఐ సురేశ్, ఎస్సైలు ఉపేందర్రావు, చంద్రశేఖర్, రాజు సిబ్బందితో కలిసి కోర్టు వద్దకు చేరుకున్నారు. పరిస్థితిని పరిశీలించిన అనంతరం బాంబు డిస్పోజల్ టీమ్, డాగ్స్కాడ్లను రప్పించి కోర్టు ఆవరణతోపాటు కోర్టులోని గదులను క్షుణ్ణంగా తనిఖీ చేయించారు. చివరికి బాంబు లేదని తేలడంతో ఫేక్ మెయిల్గా గుర్తించారు.
ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. కోర్టుల్లో బాంబులు అమర్చామంటూ మెయిల్స్ రావడం.. తనిఖీలు చేసి అవి ఫేక్గా నిర్ధారించడం జరుగుతున్నదన్నారు. ములుగు కోర్టుకు కూడా ఫేక్ మెయిల్ వచ్చిందని, దర్యాప్తు చేస్తున్నామన్నారు. హైకోర్టు రిజిస్ట్రార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఆకతాయిలను పట్టుకొని త్వరలో జైలుకు పంపిస్తామని తెలిపారు. కాగా, బాంబు లేదని తేలడంతో న్యాయమూర్తులు, న్యాయవాదులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. దాదాపు రెండు గంటల ఉత్కంఠ అనంతరం యథావిధిగా కోర్టు విధులకు హాజరయ్యారు. మొత్తంగా ములుగు జిల్లా కోర్టులో బాంబు బెదిరింపు పుకార్లు జిల్లా ప్రజలను భయాందోళనకు గురి చేశాయి.