ఖిలావరంగల్, మే 4 : ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధిని పాలకులు పట్టించుకున్న పాపాన పోలేదు. ఫలితంగా పర్యాటక, చారిత్రక ప్రాంతాల విశేషాలు మరుగునపడ్డాయి. స్వరాష్ట్రం సిద్ధించగానే సీఎం కేసీఆర్ పర్యాటక రంగానికి నిధులు కేటాయించి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టా రు. ఇందులో భాగంగా జిల్లాలోని పర్యాటక ప్రాంతాలకు కొత్తందాలు తీసుకొచ్చేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఇటీవల జిల్లాకు పర్యాటకుల తాకిడి కూడా పెరిగింది. ఒక్క ఖిలా వరంగల్ ప్రాంతానికే నిత్యం వందల సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారు. ఇక శని, ఆదివారాల్లో వేల సంఖ్యలో కోటకు వచ్చి చారిత్రక కట్టడాలను వీక్షిస్తున్నారు. జాతీయ పండుగలు, సమ్మక్క, సారలమ్మ మేడారం జాతర సమయంలో రోజుకు సుమారు 80 వేల మంది పర్యాటకులు వస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
శిల్పారామం ఏర్పాటుకు కసరత్తు..
కోటలో శిల్పారామం ఏర్పాటుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. సుమారు పది ఎకరాల స్థలంలో దీన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు సాగుతున్నారు. కీర్తితోరణాల మధ్య టీఎస్టీడీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘సౌండ్ అండ్ లైట్స్ షో’ ఆధునీకరణ కోసం రూ.5కోట్ల నిధులతో పనులు చేపట్టేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మ్యూజియం, ఫసాడ్ లైట్ల ఏర్పాటు పనులు జోరుగా సాగుతున్నాయి. ఎంతో చారిత్రక ప్రాశస్త్యం కలిగిన ఖిల్లాను పర్యాటక హబ్గా తీర్చిదిద్ది నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కృషి చేస్తున్నారు. వరంగల్ రైల్వేస్టేషన్ ఎదురుగా ఉన్న గోవిందరాజుల గుట్టను కూడా రూ.15 కోట్ల తో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
పోచమ్మమైదాన్లో హరిత హోటల్..
వరంగల్ పోచమ్మమైదాన్లో హరిత కాకతీయ హోటల్, కళాక్షేత్రం ఏర్పాటు చేయాలని అధికారులు ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. యునెస్కో గుర్తింపు వచ్చిన తర్వాత రామప్పకు పర్యాటకుల తాకిడి విపరీతంగా పెరిగింది. వారంతా వరంగల్ మీదుగా వెళ్తున్నారు. పర్యాటకుల డిమాండ్ మేరకు పోచమ్మమైదాన్ లో హరిత కాకతీయ హోటల్ నిర్మాణానికి సన్నద్ధమవుతున్నారు. ఓరుగల్లు కళాకారులను దృష్టిలో ఉంచుకొని కళాక్షేత్రం నిర్మించాలనే ప్రతిపాదనలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు.
పాకాల సరస్సులో బోటింగ్ పునరుద్ధరణ..
పాకాల సరస్సులో గత ఏడాది బోటింగ్ నిలిచిపోయింది. ఇక్కడ అటవీ శాఖ అనుమతితో బోటింగ్ను పునరుద్ధరించేందుకు ప్రతిపాదనలు చేస్తున్నారు. టీఎస్టీడీసీ ఆధ్వర్యంలో పాకాలలో ఏడు కాటేజీలు ఉన్నాయి. వీటికి తోడు మెడిసిన్ ప్లాంట్స్ గార్డెన్, బటర్ ఫ్లై గార్డెన్ పర్యాటకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. పర్యాటకులకు మరింతగా ఆకట్టుకునేలా సాహస క్రీడలను కూడా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సమాయత్తం అవుతున్నది.
1.50కోట్లు మంజూరు..
పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్ దర్గా పక్కనే ఉన్న సరస్సుకు మహర్దశ పట్టనుంది. సరస్సు కట్టను అభివృద్ధి చేసి బోటింగ్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం రూ.1.50కోట్లు నిధులు మంజూరు చేసింది. అలాగే మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు జన్మస్థలమైన లక్నేపల్లి గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి కావాల్సిన స్థలాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ చొరవతో అతి త్వరలోనే వరంగల్ జిల్లాలోని పర్యాటక ప్రాంతాలు నూతన శోభను సంతరించుకుంటాయని పర్యాటకులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.