వర్ధన్నపేట, ఏప్రిల్ 16 : రాజకీయంగా లబ్ధి పొంద డం కోసమే బీజేపీ నిరుద్యోగ మార్చ్ పేరుతో యువతను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నదని బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి రమేశ్ ధ్వజమెత్తారు. మండల కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావుతో కలిసి ఆదివారం ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. పదో తరగతి పేపర్ లీకేజీని కప్పిపుచ్చుకునేందుకే బండి ఈ మార్చ్ చేపట్టారన్నారు. ఈ యాత్రలో కేవలం బీజేపీ కార్యకర్తలు తప్ప నిరుద్యోగులు పాల్గొనలేదని చెప్పారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఎక్కడ భర్తీ చేశారో కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు తెలుపాలని నిలదీశారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వేస్తున్నారన్నారు.
ప్రభుత్వరంగ సంస్థలను అదానీ, అంబానీలకు అమ్ముతున్న కేంద్రం ప్రజల కోసం పనిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు కుట్రలు చేస్తున్నదని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితపై కుట్రలు చేస్తున్నదని ఆరోపించారు. బీజేపీ నేతలు అనేక రాష్ర్టాల్లో కుటుంబ పాలన సాగిస్తున్నారన్నారు. మతం పేరుతో ప్రజలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని ధ్వజమెత్తారు. ప్రజలు బీజేపీ కుట్రలను తెలంగాణలో సాగనివ్వరన్నారు. ప్రజల చేతిలో గుణపాఠం తప్పదని హెచ్చరించారు.
బీజేపీది రాజకీయ నిరుద్యోగ మార్చ్ మాత్రమేనని డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు ఎద్దేవా చేశారు. బీజేపీ కేవలం రాజకీయ లబ్ధి కోసమే తెలంగాణలో కుట్రకు తెర తీస్తున్నదని వివరించారు. విద్యార్థుల భవిష్యత్తును కూడా ఆలోచించకుండా పేపర్ లీకేజీకి పాల్పడి నిరుద్యోగ మార్చ్లు నిర్వహిస్తే ప్రజలు నవ్వుతున్నారన్నారు. అధికార దాహంతో విపక్ష నేతలపై కేంద్రం ఈడీ దాడులు చేయిస్తున్నదని, ఒక్క అధికార బీజేపీ ఎమ్మెల్యే, మంత్రిపై ఐటీ దాడులు ఎందుకు జరుగలేదని ప్రశ్నించారు. సమావేశంలో ఎంపీపీ అన్నమనేని అప్పారావు, జడ్పీటీసీ మార్గం భిక్షపతి, మున్సిపల్ చైర్పర్సన్ అంగోత్ అరుణ, వైస్ చైర్మన్ ఎలేందర్రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తూళ్ల కుమారస్వామి, నాయకులు సిలువేరు కుమారస్వామి, చొప్పరి సోమయ్య, పాలకుర్తి సారంగపాణి, పులి శ్రీనివాస్ పాల్గొన్నారు.
కల్యాణలక్ష్మితో పేదల ఇళ్లల్లో వెలుగులు..
వర్ధన్నపేట : కల్యాణలక్ష్మి పథకం పేదల ఇళ్లల్లో వెలుగులు నింపుతున్నదని ఎమ్మెల్యే అరూరి అన్నారు. క్యాం పు కార్యాలయంలో మండలానికి చెందిన 67 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రవిచంద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేద తల్లిదండ్రులు తమ కూతురి వివాహం చేసేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతుండడాన్ని గమనించి సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి పథకం ద్వారా ఆర్థికసాయం అందిస్తున్నారన్నారు. మంత్రి కేటీఆర్ కృషితో ఐటీ కంపెనీలు హైదరాబాద్కు వస్తున్నాయన్నారు. దీంతో యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయని వివరించారు.