వరంగల్, మార్చి 1 (నమస్తేతెలంగాణ): కేంద్రంలోని బీజేపీ వంట గ్యాస్ ధరలు పెంచడంపై బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. బీజేపీ పేదల వ్యతిరేక పార్టీగా అభివర్ణించారు. మళ్లీ గ్యాస్ ధరలు పెంచడం దారుణమన్నారు. పెంచిన గ్యాస్ ధరలకు నిరసనగా ఈ నెల 3న జిల్లావ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. కేంద్రం గ్యాస్ ధర పెంచడంపై ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. దేశంలోని రాష్ర్టాల్లో ఎన్నికలు అయిపోయిన వెంటనే గ్యాస్ సిలిండర్ ధరలను పెంచడం ఆనవాయితీగా మారిందని అరూరి ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల కష్టాలను పట్టించుకోకుండా ధరలను పెంచుతున్న తీరు దారుణమని మండిపడ్డారు.
తాజాగా కేంద్రంలోని బీజేపీ భారీగా గ్యాస్ సిలిండర్ ధరలను పెంచి పేదలపై మరోసారి భారం వేసిందని దుయ్యబట్టారు. గృహ అవసరాల సిలిండర్పై రూ. 50, కమర్షియల్ సిలిండర్పై రూ. 350 కిపైగా పెంచిందని తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు. మోదీ ప్రభుత్వం రాకముందు రూ. 400 ఉన్న సిలిండర్ ధర ఇవాళ రూ. 1,160 దాటి రూ. 1,200కు చేరిందని అరూరి విమర్శించారు. మహిళా దినోత్సవం సందర్భంగా దేశ మహిళలకు ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన కానుక గ్యాస్ ధరల పెంపు అని ఎద్దేవా చేశారు. గ్యాస్ ధరల పెంపుతో ప్రజలకు అనేక కష్టాలు ఎదురవుతున్నాయని, గ్యాస్, నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు.
గ్యాస్ ధరలను తగ్గించాలనే డిమాండ్తో శుక్రవారం జిల్లాలోని అన్ని నియోజకవర్గ, మండల, పట్టణ, మున్సిపాలిటీ, డివిజన్ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని రమేశ్ బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎక్కడివారక్కడే వినూత్నంగా నిరసన తెలుపాలని ఆయన కోరారు. ఇప్పటికైనా అడ్డగోలుగా పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని, లేనిచో మహిళాలోకం రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వానికి గుణపాఠం చెబుతుందని అరూరి హెచ్చరించారు. ఉజ్వల స్కీమ్లో ప్రధానమంత్రి మోదీ చేతులమీదుగా లబ్ధిపొందిన మొదటి మహిళ సైతం ఇవాళ గ్యాస్ సిలిండర్ కొనలేక కట్టెల పొయ్యిపై వంట చేస్తున్నదని గుర్తుచేశారు.