ఉద్యోగాలు ఇవ్వాల్సింది పోయి.. ఉన్నవాటిని కూడా రాకుండా చేసి యువతలో ఆగ్రహానికి కేంద్ర సర్కారు ఆజ్యం పోసింది. ‘రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వస్తది.. ఉపాధి దొరుకుతది’ అని ఆశలు పెట్టుకున్నవారికి బీజేపీ సర్కారు మొండిచెయ్యి చూపింది. ఈ పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా 10వేల మందికి .. పరోక్షంగా అంతకు రెట్టింపు మందికి బతుకుదెరువు లభిస్తుందనుకుంటే ‘కోచ్’నై.. కుచ్నై అని ధోకా ఇచ్చింది. విభజన చట్టంలోనే స్పష్టంగా ఉన్న ఈ అంశానికి నీళ్లొదిలి వరంగల్ ఉమ్మడి జిల్లావాసులకు తీరని అన్యాయం చేసింది.
వరంగల్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వస్తే వేలాది మందికి ఉపాధి దొరుకుతుందని కంటున్న కలలు ఈనాటివి కావు.. ప్రత్యక్షంగా 10వేల మందికి పరోక్షంగా అంతకు రెట్టింపు మందికి బతుకుదెరువు చూపే ఈ ఫ్యాక్టరీని కాజీపేటలో ఏర్పాటు చేయాలని 1979కి ముందు నుంచే పోరాటం కొనసాగుతున్నది. 42 ఏళ్ల క్రితం కూడా బంద్లు, రాస్తారోకోలు, నాయకుల అడ్డగింతలతో నిరసన కార్యక్రమాలు ఉధృతంగా సాగాయి. ఆది నుంచీ వరంగల్ ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చకుండా కేంద్ర సర్కారు మోసం చేస్తూనే వస్తున్నది. పునర్విభజన చట్టంలో పొందుపర్చినా ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా మరోమారు ధోకా ఇవ్వడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతున్నది.
1979 నుంచే ఉద్యమాలు
కాజీపేట రైల్వే జంక్షన్ ఉత్తర, దక్షిణ భారతదేశానికి వారధిగా ఉంటుంది. దక్షిణ మధ్య రైల్వేలో పెద్ద జంక్షన్ కాజీపేట. ఇక్కడ కోచ్ ఫ్యాక్టరీ సాధన కోసం 1979నుంచే ఉద్యమాలు మొదలయ్యాయి. 1980లోనే అప్పటి కాంగ్రెస్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వరంగల్కు రైల్వే కోచ్ ఫ్యాక్టరీని మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. 1500 ఎకరాలు సేకరించేందుకు మడికొండ ప్రాంతంలో సర్వే చేశారు. కానీ, ఇచ్చినట్లే ఇచ్చి పంజాబ్కు తరలించడంతో ఉద్యమాలు ఉవ్వెత్తున లేచాయి. తెలంగాణ ఏర్పాటు కోసం పార్లమెంట్లో పెట్టిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో మన రాష్ర్టానికి కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని స్పష్టంగా పేర్కొన్నారు. దీంతో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై తెలంగాణ ప్రజల్లో ముఖ్యంగా వరంగల్ ఉమ్మడి జిల్లా వాసుల్లో కొత్త ఆశలు మొదలయ్యాయి.
దాదాపు ఎనిమిదేళ్లుగా కోచ్ ఫ్యాక్టరీ విషయంలో జాప్యం చేసిన బీజేపీ ప్రభుత్వం, వరంగల్ ప్రజలను మోసం చేసింది. వేల మందికి ఉపాధి కల్పించే రైల్వే కోచ్ ఫ్యాక్టరీని కాజీపేటలో ఏర్పాటు చేసేది లేదని తేల్చి చెప్పి ధోకా ఇచ్చింది. నాలుగు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న కలను బీజేపీ అడ్డుకోవడంతో ప్రజలు, యువకులు, రాజకీయ పార్టీల నాయకుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ అవసరం లేదని కేంద్రం ప్రకటించినప్పుడు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. హైదరాబాద్లోని ఇందిరాపార్కు వద్ద అన్ని పార్టీలు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు.