వరంగల్,సెప్టెంబర్ 13 : గ్రేటర్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో బీజేపీ కార్పొరేటర్లు వీరంగం సృష్టించారు. మేయర్ చైర్ పైకి వాటర్ బాటిల్, నేమ్ ప్లేట్లు విసిరి అరాచకానికి పాల్పడ్డారు. బుధవారం ఉదయం మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం ప్రారంభం కాగానే బీజేపీ కార్పొరేటర్లు అనుచితంగా ప్రర్తించారు. ఏడుగురు బీజేపీ కార్పొరేటర్లు పథకం ప్రకారమే రచ్చ రచ్చ చేశారు. అడుగడుగునా సభకు అడ్డుపడుతూ గందళగోళం సృష్టించారు. కౌన్సిల్ సమావేశంలో ప్రజా సమస్యలు చర్చించకు రాకుండా అడ్డుపడ్డారు.
మాజీ కార్పొరేటర్, అర్బన్ మలేరియా, పారిశుధ్య కార్మికుల మృతికి సంతాప తీర్మానాల ప్రసంగాలకు అడ్డుతగిలారు. మేయర్ అధ్యక్ష ప్రసంగం చదువకుండా అడ్డుపడ్డారు. బీజేపీ ఫ్లోర్ లీడర్ చాడా స్వాతి వాటర్ బాటిల్, నేమ్ ప్లేట్ విసిరారు. ఎజెండా అంశాలపై చర్చ అనంతరం సభ్యులందరికీ మాట్లాడే అవకాశం కల్పిస్తానని మేయర్ చెప్పనప్పటికీ పోడియం వద్దకు దూసుకవెళ్లి ఆందోళనకు దిగారు. వీరి నినాదాలతో సభ్యులు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఎజెండా అంశాలకు ఆమోదం తెలిపిన అనంతరం మేయర్ కౌన్సిల్ సమావేశం ముగిసినట్లు ప్రకటించారు.
45 నిముషాల్లో ముగిసిన కౌన్సిల్..
ప్రజా సమస్యలపై చర్చించాల్సిన కౌన్సిల్ సమావేశం బీజేపీ కార్పొరేటర్ల ఆందోళనలతో 45 నిముషాల్లో ముగిసింది. ఉదయం 12 గంటలకు ప్రారంభమైన కౌన్సిల్ సమావేశం 12:45 గంటల వరకు కొనసాగింది. అలాగే మేయర్ గుండు సుధారాణి చాంబర్ భవనం ప్రధాన ద్వారం ఎదుట వారు ధర్నా చేశారు. కార్పొరేటర్లతో పాటు వారి అనుచరులు బైఠాయించారు. లోపలికి భోజనం తీసుకవెళ్లకుండా అడ్డుకున్నారు. సుమారు రెండు గంటల పాటు అందోళనకు దిగారు. ఆందోళన చేస్తున్న బీజేపీ కార్పొరేటర్లు, నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.
మృతులకు రెండు నిముషాల మౌనం..
మాజీ కార్పొరేటర్ మేడకట్ల సారంగపాణి, విధి నిర్వహణలో మృతి చెందిన అర్బన్ మలేరియా కార్మికుడు ఎర్ర రాజు, పారిశుధ్య కార్మికుడు మైదం జనార్దన్ల మృతికి బల్దియా సంతాపం ప్రకటించింది. సభ్యులు రెండు నిముషాలు మౌనం పాటించారు. సంతాప తీర్మానాన్ని కార్పొరేటర్ గుండేటి నరేంద్ర కుమార్ ప్రవేశ పెట్టారు. బీజేపీ కార్పొరేటర్ల నినాదాల మధ్యే సంతాప తీర్మానంపై సభ్యులు ప్రసంగించారు.
ఉనికి కోసమే గలాటా..
– గుండు సుధారాణి, మేయర్, గ్రేటర్ వరంగల్
బీజేపీ కార్పొరేటర్లు ఉనికి కోసమే కౌన్సిల్లో గలాటా సృష్టించారు. ఏనాడు ప్రజా సమస్యలను పట్టించుకోని వారు ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో నాటకాలకు తెరతీశారు. నగరాభివృద్ధికి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ వేల కోట్ల నిధులను కేటాస్తున్నారు. ప్రభుత్వం తొమ్మిదేళ్లలో రూ. 4500 కోట్లతో గ్రేటర్లో అభివృద్ధి పనులు చేపట్టింది. అనేక పనులు పూర్తి కాగా, మరికొన్ని పురోగతిలో ఉన్నాయి. ఇటీవల భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు నీటి మునిగితే మంత్రి కేటీఆర్ స్పందించి రూ. 250 కోట్లను మంజూరు చేశారు. వరదల సమయంలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, గ్రేటర్ అధికారులు ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భోజన వసతి కల్పించి అండగా నిలిచాం. ఆనాడు బీజేపీ కార్పొరేటర్లు, నాయకులు ఏమయ్యారు. శాశ్వత ముంపు నివారణకు మాస్టర్ ప్లాన్ను రూపొందిస్తున్నాం. వరంగల్ను భవిష్యత్ నగరంగా తీర్చిదిద్దేడమే లక్ష్యంగా ముందుకు పోతున్నాం.
9 అంశాలకు ఆమోద ముద్ర..
1. పేదలకు అందించే రూ.5 భోజనానికి 6 నెలలకు సంబంధించిన రూ.1,89,00,000 బిల్లు అక్షయ పాత్ర ఫౌండేషన్ వారికి చెల్లించేందుకు సభ్యులు ఆమోదం తెలిపారు.
2. 16వ డివిజన్ పరిధిలోని జాన్పాక ఎఫ్సీఐ గోదాముల నుంచి గొర్రెకుంట క్రాస్ రోడ్డు వరకు 200 ఎంఎం డయా పైప్లైన్ వేసేందుకు 15వ ఫైనాన్స్ నిధుల మంజూరుకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది
3. 36వ డివిజన్ పరిధిలోని పుప్పాల గుట్టలో ఈఎల్ఎస్ఆర్ నిర్మాణం కోసం రూ. 3.90 కోట్ల నిధులను 15వ ఫైనాన్స్ నుంచి మంజూరుకు కౌన్సిల్ ఆమోదించింది.
4. 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి రూ. 12 కోట్లతో 118 వాహనాలను కొనుగోలుకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది.
5. 27వ డివిజన్ గోవిందరాజు గుట్ట వద్ద 1500 కేఎల్ సామర్థ్యం కలిగిన ఈఎల్ఎస్ఆర్ నిర్మాణానికి 15వ ఫైనాన్స్ నిధుల మంజూరుకు కౌన్సిల్ ఆమోదించింది.
5. కేయూ 100 ఫీట్ల రోడ్డు అమరావతి నగర్లో నాలా అభివృద్ధిలో భాగంగా తీసివేసిన 100 ఎంఎం డయా బీడబ్ల్యూఎస్ఈ పైపులను స్క్రాప్ కింద కిలోకు రూ. 40 చొప్పున విక్రయించేందుకు ఆమోద ముద్ర వేసింది.
6. వరంగల్ హెడ్ పోస్టాఫీస్ వద్ద ఉన్న మున్సిపల్ కాంప్లెక్స్లోని 11, 13, 14, 17, 21 షాపు నంబర్ల గదుల అద్దె కాల పరిమితిని డిసెంబర్ వరకు పొడిగింపును ఆమోదించింది
7. పైడిపల్లి గ్రామంలోని ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 355లోని 11 గుంటల భూమిని హనుమకొండ కలెక్టర్ అభ్యర్థన మేరకు శ్మశాన వాటికకు కేటాయిస్తూ ఆమోద ముద్ర వేసింది.