హనుమకొండ, డిసెంబర్ 6 : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రిజర్వేషన్లను ఎత్తి వేసేందుకు కుట్ర పన్నుతోందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. హనుమకొండ అంబేద్కర్ జంక్షన్లో మంగళవారం అంబేద్కర్ వర్ధంతి నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి మంత్రి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగాన్ని సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నట్లు ఏ రాష్ట్రంలో అమలు చేయడం లేదన్నారు. అంబేద్కర్ స్ఫూర్తితోనే పాలన జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. భారతదేశానికి, ప్రపంచానికి ఆదర్శమైన అంబేదర్ ఒక దళిత వర్గానికే కాదు సమాజంలోని అందరివాడన్నారు. అంబేదర్ రాసిన రాజ్యాంగం వల్లే సీఎం, తాము మంత్రులుగా, మిగిలిన వారు నాయకులుగా ఉన్నారన్నారు.
అంబేదర్ స్ఫూర్తితోనే మనం కార్యక్రమాలు చేస్తున్నామని సీఎం అంటుంటారని మంత్రి తెలిపారు. దళితులకు, రైతులకు, పేదలకు, పెన్షన్లు, కల్యాణలక్ష్మి తదితర పథకాలు అందిస్తున్నట్లు వివరించారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం దేశంలోని ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తోందని మండిపడ్డారు. ఒక ఉద్యోగం ఇవ్వని కేంద్రం రిజర్వేషన్లను మంటగలిపే కుట్ర చేస్తోందని పేర్కొన్నారు. అందరూ బీజేపీ చేసే కుట్రలను వ్యతిరేకించాలని సూచించారు. సీఎం కేసీఆర్ అన్ని విషయాల్లో రాజ్యాంగ నిర్మాతకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. కావాలని రాష్ట్రంపై కొంతమంది చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు.
వరంగల్లో అంబేదర్ జయంతి, వర్ధంతిని కట్టయ్య స్ఫూర్తితో గొప్పగా కొనసాగిస్తున్నందుకు అభినందనలు తెలిపారు. మీకు తన పూర్తి సహకారం ఉంటుందని, మీరు చేపట్టే ఏ కార్యక్రమాల్లోనైనా తాను ముందుండి పనిచేస్తానని మంత్రి ఎర్రబెల్లి హామీ ఇచ్చారు. గతంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటా, దళితులకు, రాజ్యాంగానికి ఎవరైనా వ్యతిరేకంగా పనిచేస్తే తిప్పికొట్టడానికి మీ వెంట ఉంటానన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆస్తుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వంలోని ప్రతి ఆస్తిని, ఫ్యాక్టరినీ ప్రైవేటీకరణ చేసే కుట్ర జరుగుతోందని, ఉద్యమిస్తేనే కేంద్రం దిగివస్తుందన్నారు. రాజ్యాంగ వ్యతిరేక కుట్రలను తిప్పికొట్టే ఈ ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలన్నారు. హనుమకొండలో బుద్ధవిహార్ నిర్మాణంపై కలెక్టర్, అధికారులతో మాట్లాడుతానని మంత్రి హామీ ఇచ్చారు. కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహించిన ప్రవీణ్, సందీప్, శ్రీరాములు, రాజయ్యను అభినందించారు. మంత్రితోపాటు మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ సుందర్రాజ్యాదవ్, జనగామ జడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, నన్నపునేని నరేందర్, వరంగల్ కలెక్టర్ గోపి, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ ప్రావీణ్య తదితరులు అంబేదర్ విగ్రహానికి పూలమాల వేసి, నివాళులర్పించారు.