వరంగల్, ఏప్రిల్ 5(నమస్తేతెలంగాణ) : బీఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో ఉన్న ఆదరణ, మద్దతు చూసి ఓర్వలేక బీజేపీ నీచ రాజకీయాలకు దిగజారుతున్నదని వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్, నర్సంపేట, వరంగల్తూర్పు ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్రెడ్డి, నన్నపునేని నరేందర్ అన్నారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లడానికి బీజేపీ కుట్రలు చేస్తున్నదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గతంలో కులం, మతం పేర రాజకీయాలు చేసిన బీజేపీ ఇపుడు చదువును అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నదని మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజ య్ సూత్రధారిగా రాష్ట్రంలో ప్రశ్న పత్రాల లీకేజీ కుట్ర జరుగుతున్నదని విమర్శించారు. పదో తరగతి ప్రశ్నపత్రాలు బయటకు వచ్చిన అంశంపై బుధవారం ఎమ్మెల్యేలు రైతు విమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్రావుతో కలిసి వరంగల్ శివనగర్లోని సాయి కన్వెన్షన్ హాల్లో సమావేశం నిర్వహించారు. బీజేపీ వైఖరిని తూర్పారబట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమేశ్ మా ట్లాడుతూ.. చదువు విలువ తెలియని సన్నాసుల పార్టీ బీజేపీ పన్నిన పన్నాగం పదో తరగతి ప్రశ్న పత్రాల లీకేజీ అని అభివర్ణించారు. గ్రూప్ 1, పదో తరగతి పేపర్ల లీకేజీల్లో బీజేపీ పాత్ర ఉందని పేర్కొన్నారు. మొన్న వికారాబాద్ జిల్లా తాండూరులో పదో తరగతి తెలుగు ప్రశ్న పత్రం లీకేజీలో బాధ్యుడైన ఉపాధ్యాయుడు బందెప్ప బీజేపీ అనుకూల సంఘం నాయకుడని, నిన్న కమలాపురంలో హిందీ ప్రశ్నపత్రం బయటకు రావడంలో నిందితుడైన ప్రశాంత్ బండి సంజయ్ అనుచరుడని చె ప్పారు. ప్రశాంత్ను అరెస్టు చేసిన వెంటనే బీజేపీ నాయకులు అర్ధరాత్రి వరంగల్ కమిషనరేట్ ఎదుట ఆందోళన చేయడం పార్టీతీ అతడికి ఉన్న సంబంధాలకు నిదర్శనమని పేర్కొన్నారు. పేపర్ల లీకేజీ కోసం బీజేపీ ప్రత్యేక ప్యాకేజీలకు ప్లాన్ చేసిందని, బండి సంజయ్ తన మనుషులు, కార్యకర్తలు, అనుకూలంగా ఉండే ఉపాధ్యాయు ల ద్వారా పేపర్ లీకేజీలకు కుట్ర చేశారని విరుచుకుపడ్డారు. బీజేపీ నాయకులకు చదువు విలువ తెలియదని, కష్టపడి పరీక్ష రాయలేదని, అందుకే విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని ఫైర్ అయ్యారు. కొలువులు, చదువులు వదిలేయండి.. బీజేపీకి పనిచేయండని బహిరంగంగా పిలుపునిచ్చిన బండి సంజయ్ ఇప్పుడు పదో తరగతి ప్రశ్న పత్రాల లీకేజీకి పాల్పడ్డాడన్నారు. ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయని ప్రచారం చేసి పరీక్షలను వాయి దా వేయించి విద్యార్థులను రాజకీయాలకు వాడుకోవాలని నీచమైన కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ కార్యకర్తలే ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి డ్రామా ఆడుతున్నారని, విద్యార్థులు, తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళనకు గురికావద్దన్నారు. బీజేపీ కుట్రలను ఖండించాలని అరూరి కోరారు.
ఖబర్దార్ బీజేపీ నాయకుల్లారా… బీఆర్ఎస్ను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేకే చిల్లర రాజకీయాలు చేస్తున్నారు.. ఇప్పటికైనా ప్రజలకు ఏం చేస్తారో, ఏం చేశారో చెప్పండి అన్నారు. దమ్ముంటే రాజకీయంగా తలపడండి.. విద్యార్థులు, యువతను అడ్డుపెట్టుకుని రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తే, ఆ యువతే మీకు సరైన బుద్ధి చెబుతదని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నదని, నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా ముందు కు వెళ్తున్నదని చెప్పారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ప్రశ్న పత్రాల లీకేజీలపై దర్యాప్తులు, నిందితులకు శిక్షలు లేవ ని, గుజరాత్ రాష్ట్రంలో పదహారు సార్లు ప్రశ్నపత్రాలు లీక్ అయినా కనీసం దర్యాప్తు చేశారా? ఎంతమందికి శిక్ష వేశారు? అని ప్రశ్నించారు. అదే తెలంగాణలో పేపర్ లీకేజీపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి సిట్తో దర్యాప్తు వేగవంతంగా చేయించి, నిందితులపై చర్యలు తీసుకుందన్నారు. ఓట్ల కోసం బీజేపీ కులం, మతం, సైనికులను వాడుకొంటున్నదని, ఎన్నికలు రాగానే బార్డర్లో యుద్ధాలు వస్తాయని విమర్శించారు.
కమలాపురం ఈటెల సొంతూరు..
నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది మాట్లాడుతూ పదో తరగతి హిందీ ప్రశ్న ప త్రం బయటకు వచ్చిన కమలాపురం బీజేపీకి చెందిన హుజూరాబాద్ ఎమ్మె ల్యే ఈటెల రాజేందర్ సొంతూరు అని, ఈటల చదువుకున్న పాఠశాలలోనే ప్రశ్నపత్రం బయటకొచ్చిందని పేర్కొన్నారు. కమలాపురం బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోనిదని గుర్తు చేశారు. ఎంపీ, ఎమ్మెల్యేలతో పాటు కమలాపురంలోని స్థానిక ప్రజాప్రతినిధులందరూ బీజేపీకి చెందిన వారేనని, ఈ నేపథ్యంలో ఇక్కడ జరిగిన పేపర్ లీకేజీ బీజేపీ కుట్ర కాదా? అని ప్రశ్నించారు. ప్రశాంత్ ఎంపీ బండి అనుచరుడని, అతడి ద్వారా పేపర్ లీక్ చేయించిన సం జయ్పై అనర్హత వేటు వేయాలని పార్లమెంట్ స్పీకర్ను కోరుతున్నట్లు చెప్పారు. మత రాజకీయాలపై తెలంగాణ ప్రజలు స్పందించకపోవడంతో బీజేపీ లీకేజీల మోర్చా ఏర్పాటు చేసిందని, నెలరోజుల క్రితం ఢిల్లీలో తమ పార్టీ నేతలతో సమావేశమైన కేంద్ర మంత్రి అమిత్షా పేపర్ లీకేజీలకు ప్లాన్ చేశారన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ను టార్గెట్ చేస్తూ బీజేపీ నేతలు చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని, కేంద్ర ప్రభుత్వం గత పదేళ్లలో తెలంగాణకు ఇచ్చిందేమిటని ప్రశ్నించారు.
ఎంపీ పదవి నుంచి తొలగించాలి..
ఎమ్మెల్యే నన్నపునేని మాట్లాడుతూ బీజేపీ కుట్రపూరిత చర్యల్లో భాగమే పేపర్ లీకేజీ వ్యవహారమన్నారు. కమలాపురం పరీక్ష కేంద్రంలోకి గుర్తు తెలియని వ్యక్తి వెళ్లి పేపర్ను ఫొటో తీసుకుని ఉదయం 11.30 గంటలకు నేరుగా ఎంపీ బండి సంజయ్కి పంపించారని సీపీ రంగనాథ్ వెల్లడించారని తెలిపారు. ప్రతిపక్షాలు ఇంతటి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయని, సంజయ్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వాన్ని కావాలనే బద్నాం చేస్తున్నారన్నారు. సంజయ్ని వెంటనే ఎంపీ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మేయర్ గుండు సుధారాణి, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ లిలితాయాదవ్, కార్పొరేటర్లు సిద్ధం రాజు, వేల్పుగొండ సువర్ణ, చింతాకుల అనిల్, సోమిశెట్టి ప్రవీణ్, మరుపల్ల రవి, హరిరమాదేవి, పల్లం రవి, దామోదర్, కేడల పద్మ పాల్గొన్నారు.