వరంగల్, సెప్టెంబర్ 1 ;ఉమ్మడి రాష్ట్రంలో కునారిల్లిన కులవృత్తులకు స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ జీవం పోస్తున్నారు. కులవృత్తులపై ఆధారపడి బతుకుతున్న వేలాదిమందికి భరోసా కల్పిస్తున్నారు. లాండ్రీలు, సెలూన్లకు కరెంట్ సబ్సిడీ ఇస్తూ అటు రజకులు, ఇటు నాయీబ్రాహ్మణులకు ఆసరాగా నిలిచారు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి దేశంలోనే అతిపెద్ద ల్యాండ్రో మార్ట్లను రజకుల కోసం గ్రేటర్ వరంగల్ పరిధిలో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోతన నగర్లో రూ.3కోట్లతో రోజుకు 10వేల వస్ర్తాలను ఉతికే సామర్థ్యంతో ఆధునిక ల్యాండ్రో మార్ట్ పనులు చివరి దశకు చేరాయి.
రోజూ 10 వేల వస్ర్తాలు వాష్
పోతన నగర్లోని ల్యాండ్రోమార్ట్, రోజుకు 10 వేల వస్ర్తాలు ఉతికే సామర్థ్యం కలిగి ఉంది. దేశంలో ఏర్పాటు చేసిన ల్యాండ్రో మార్ట్లలో ఇప్పటి వరకు కేవలం రోజుకు 5 వేల వస్ర్తాలు మాత్రమే ఉతికే సామర్థ్యం కలిగి ఉన్నాయి. ఇప్పటికే ఇక్కడి ల్యాండ్రో మార్ట్లో బట్టలు ఉతికేందుకు తొమ్మిది పెద్ద వాషింగ్ మిషన్లు, బట్టలు ఆరేసేందుకు డ్రయర్లు ఏర్పాటు చేశారు. ఇస్త్రీ చేసేందుకు ఏడు ఐరన్ స్ట్రీమ్ మిషన్లు, ఐరన్ టేబుళ్లను అందుబాటులోకి తెచ్చారు. పూర్తి ఆధునిక వసతులతో ల్యాండ్రో మార్ట్ను నిర్మిస్తున్నారు.
మంత్రి కేటీఆర్తో ప్రారంభోత్సవం!
సెప్టెంబర్ 9న రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ల్యాండ్రో మార్ట్ను ప్రారంభించేందుకు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. పక్కా భవనాన్ని పూర్తి చేసి, తుది మెరుగులు దిద్దుతున్నారు. కలెక్టర్ సిక్తా పట్నాయక్, గ్రేటర్ కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా పలు మార్లు ల్యాండ్రోమార్ట్ పనుల పురోగతిని పరిశీలించారు. పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ల్యాండ్రోమార్ట్లో అతిపెద్ద వాషింగ్ మిషన్లు, డ్రయర్లు, స్ట్రీమ్ మిషన్లను ఏర్పాటు చేశారు. నీటి వసతి కోసం బోరుబావి వేశారు. విశాలమైన స్థలంలో ల్యాండ్రోమార్ట్ను నిర్మించారు. గ్రేటర్ కార్పొరేషన్ పరిధిలో రెండు ల్యాండ్రో మార్ట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన గ్రేటర్ అధికారులు, పోతన నగర్లోని ల్యాండ్రో మార్ట్ను ప్రారంభానికి సిద్ధం చేస్తున్నారు. ఉర్సు చెరువు వద్ద మరో ల్యాండ్రోమార్ట్ పనులు పురోగతిలో ఉన్నాయి.
రూ.3కోట్లతో నిర్మాణం
రూ. 3కోట్లతో నిర్మించిన ల్యాండ్రో మార్ట్కు రూ. 2 కోట్లతో పక్కా భవనం నిర్మించి సివిల్ వర్క్లు చేశారు. మరో రూ.కోటితో మిషనరీలను కొనుగోలు చేశారు. విద్యుత్, మిషనరీల బిగింపు పనులు పూర్తి చేసి నీటి వసతి కల్పించారు. మరో రెండు, మూడు రోజుల్లో పనులు పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేస్తామని అధికారులు చెబుతున్నారు. మరో రెండు నెల్లో ఉర్సు చెరువు వద్ద ల్యాండ్రో మార్ట్ పనులను పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు.
వంద మందికి ఉపాధి
ల్యాండ్రో మార్ట్ ద్వారా వంద మందికి ఉపాధి లభించనుంది. కులవృత్తినే నమ్ముకొని జీవనం సాగిస్తున్న వారికి ఇది ఎంతగానో దోహదపడనుంది. దీని నిర్వహణ బాధ్యతలను బీసీ సంక్షేమ శాఖకు అప్పగించనున్నారు. రజక వృత్తిపై ఆధారపడి గుర్తింపు పొందిన రజక సంఘంలో సభ్యులుగా ఉన్న వారికి ల్యాండ్రోమార్ట్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. విధి విధానాలను బీసీ వేల్పేర్ శాఖ అధికారులు రూపొందించనున్నారు. ఇంత అత్యాధునిక ల్యాండ్రో మార్ట్ను తమకు అందుబాటులోకి తెచ్చిన సీఎం కేసీఆర్కు రజకులు కృతజ్ఞతలు చెబుతున్నారు.