భూపాలపల్లి రూరల్, మార్చి 15 : వేసవిలో తాగునీటి ఎద్దడి ఉండొద్దని, ఒకవేళ సమస్య ఉత్ఫన్నమైతే సంబంధిత అధికారులపై తగిన చర్యలు తీసుకుంటామని భూపాలల్లి కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను హెచ్చరించారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి మండల ప్రత్యేకాధికారులు, ఎంపీడీవోలు, ఆర్డబ్ల్యూఎస్, మిషన్ భగీరథ ఇంజినీరింగ్ అధికారులు, గ్రామ పం చాయతీ కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీల్లో నీటి సరఫరాపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని, ఏవైనా సమస్యలు వస్తే యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలన్నారు. పైపులైన్ లీకేజీల మరమ్మతులు, నూతన పైపులైన్ల ఏర్పాటుకు ప్రభుత్వం రూ. 3.91 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. గ్రామాల్లో నీటి సమస్య ఏర్పడితే సంబంధిత ఎంపీడీవో పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.
నివేదికలు అందజేయడంలో నిర్లక్ష్యం వహించిన మల్హర్ ఎంపీడీవోకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని జడ్పీ సీఈవోను ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో అధికారులు పర్యటించి తాగునీటిపై నివేదికలు అందజేయాలని, తప్పుడు సమాచారం ఇస్తే శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అన్ని ప్రభుత్వ, సంక్షేమ వసతి గృహాల్లో తాగునీటి సరఫరాకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ కలెక్టర్ ఉమాశంకర్ప్రసాద్, జడ్పీ సీఈవో విజయలక్ష్మి, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ నిర్మల, సీపీవో సామ్యూల్, డీపీవో నారాయణరావు, అధికారులు పాల్గొన్నారు.
మంగపేట : వేసవిని దృష్టిలో ఉంచుకొని మూడు నెలల పాటు గ్రామాల్లో ప్రజలకు తాగునీరు, విద్యుత్ సరఫరాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. మంగపేట రైతు వేదికలో శుక్రవారం ఆమె అదనపు కలెక్టర్ పీ శ్రీజతో కలిసి తాగు నీరు, విద్యుత్ సరఫరాపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామ పంచాయతీ, మిషన్ భగీరథ, ట్రాన్స్కో విభాగాల అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. పైప్లైన్లు, ట్యాంకుల వద్ద లీకేజీలు ఉంటే సత్వరమే మరమ్మతులు చేయించాలని ఆదేశించారు. అవసరం ఉన్నచోట హ్యాండ్ పంపులు, బోర్ వెల్ ద్వారా నీటిని అందించే ఏర్పాట్లు చేయాలన్నారు.
విద్యుత్ స మస్య రాకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవాలని ట్రాన్స్కో అధికారులను ఆదేశించారు. శానిటేషన్పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు. అలాగే ఎంపీడీవో కార్యాలయంలో పోషణపక్షం కార్యక్రమం నిర్వహించగా కలెక్టర్ హాజరయ్యారు. బాలింతలు, గర్భిణుల ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. పది మంది గర్భిణులకు సీమంతం చేశారు. సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ సీఈ శ్రీనివాస్, ఎస్ఈ మల్లేశ్, ఈఈ మాణిక్యరావు, మండల ప్రత్యేక అధికారి తుల రవి, డీడబ్ల్యూవో స్వర్ణలత, ఎంపీడీవో కృష్ణప్రసాద్, తహసీల్దార్ వీరస్వామి, ఏవో చేరాలు, సూపరింటెండెంట్ ఆలేటి సుదర్శన్, నాయబ్ తహసీల్దార్ మలేశ్వర్రావు, ఎంపీవో మమత, సీడీపీవో హేమలత, సూపర్వైజర్లు చంద్రకళ, ఇమ్మాన్యుయేల్, కమల, కల్పన, ప్రత్యేక అధికారులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.